కేసీఆర్ ధైర్యం ఉంటే కేసులు పెట్టు: కొత్తబిచ్చగాడు వ్యాఖ్యలపై బీజేపీ ఖండన
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రాజకీయ దూరంకారంతో మాట్లాడుతున్నారని బీజేపీ మ్మెల్సీ రాంచందర్రావు ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో టీఆర్ఎస్కు బీజేపీ ప్రత్యామ్నాయం అవుతుందన్న భయం సీఎం కేసీఆర్కు పట్టుకుందన్నారు.
నీట్ పరీక్షపై కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఆయన చెప్పారు. పాలేరు ఉపఎన్నిక విజయానంతరం సీఎం కేసీఆర్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్పై చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్పై సీఎం వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే కేసీఆర్ తట్టుకోలేకపోతున్నారని మండిపడ్డారు. దమ్ము, ధైర్యం ఉంటే కేసులు పెట్టండని ముఖ్యమంత్రి కేసీఆర్కు సవాల్ విసిరారు. రాష్ట్రంలోని విపక్షాలపై కేసులు పెడతామని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
కాగా పాలేరు ఉపఎన్నిక పాలేరు చరిత్రలోనే టీఆర్ఎస్ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా గురువారం మీడియాతో కేసీఆర్ మాట్లాడుతూ బీజేపీ అధ్యక్షుడు కొత్తగా ఒకాయన వచ్చాడు. కొత్తబిచ్చగాడు పొద్దు గుర్తు ఎరుగడన్నట్లు ఆయన వైఖరి ఉందన్నారు.
కేంద్రం నిధులు ఇస్తే రాష్ట్రం ఖర్చు చేయడం లేదని అంటున్నాడు. తాగునీటికి కేంద్రం రూ.54 కోట్లు ఇస్తే.. రాష్ట్రం రూ.350 కోట్లు ఖర్చు చేసిందన్నారు. కరువు సాయం కింద రూ. 3వేల కోట్లు అడిగితే కేంద్రం రూ.750కోట్లు మాత్రమే ఇచ్చిందని చెప్పిన కేసీఆర్ మేం రైతుల ఇన్పుట్ సబ్సిడీకే రూ.1300 కోట్లు ఇవ్వాలన్నారు.
కరువు తాత్కాలిక చర్యల కింద అడిగిన డబ్బులు కేంద్రం ఇవ్వనేలేదు.. అయినా కేంద్రంపై ఆధారపడకుండా పనిచేస్తున్నామని చెప్పుకొచ్చారు. రాష్ట్రం సంక్షేమ కార్యక్రమాలను సొంతంగా అమలు చేస్తున్నామని చెప్పిన కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు బీజేపీకి లేదన్నారు.

మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ప్రాజెక్టుల్లో ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వమని కేంద్రాన్ని అడుగుతున్నాం. దత్తాత్రేయ, లక్ష్మణ్లు ఒక జాతీయ ప్రాజెక్టు సాధించుకొని రండి.. ప్రజలు మిమ్ములి హర్షిస్తారని అన్నారు. అలా కాకుండా ప్రభుత్వం ఎన్నో మంచిపనులు చేస్తున్న బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
గతంలో లాగా ఇపుడు సెక్రటేరియట్లో పైరవీలు లేవని, పైరవీకారులు కనిపించడం లేదన్నారు. అర్థం పర్థం లేకుండా ప్రతి దాంట్లో అక్రమాలున్నాయంటే... కమీషన్లు తీసుకుంటున్నారంటే ఇకపై సహించేది లేదు... ఇక నుంచి మీ ఆరోపణలపై ఆధారాలతోసహా రుజువులు లేకపోతే కేసులు పెడతామన్నారు.
మీ ఇష్టం వచ్చినట్లు వెకిలి, మకిలి ఆరోపణలు చేసే వారిపై పరువు నష్టం దావా వేస్తామని కూడా చెప్పారు. కొత్త రాష్ట్రమైన తెలంగాణ కోసం నిర్మాణాత్మక సలహాలు ఇచ్చి రాష్ట్రం పటిష్టతకు తోడ్పండని ఉత్తమ సలహాలు ఇస్తే సంతోషంగా స్వీకరిస్తామని చెప్పారు. కాగా కేసీఆర్ వ్యాఖ్యలపై శుక్రవారం బీజేపీ నేతలు మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications