బీజేపీ జాతీయకార్యవర్గ సమావేశాలు: నేడు నగరానికి కమలదళపతి; భారీ ర్యాలీ; మొత్తం షెడ్యూల్ ఇదే!!
భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయ కార్యవర్గ సమావేశం హైదరాబాద్లో జరగనున్న నేపథ్యంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా శుక్రవారం తెలంగాణ రాజధానికి రానున్నారు. కమల దళపతి జేపీ నడ్డా హైదరాబాద్ కు రానున్న నేపథ్యంలో బీజేపీ శ్రేణులు ఫుల్ జోష్ లో ఉన్నారు.

18 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు
దాదాపు 18 సంవత్సరాల తర్వాత బీజేపీ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ వేదికగా మారింది. బిజెపి జాతీయ అగ్రనాయకులు ప్రధాని నరేంద్ర మోడీ, హోం శాఖ మంత్రి అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, జేపీ నడ్డా తోపాటు, కేంద్ర మంత్రులు, మూడు వందల అరవై మంది జాతీయ ప్రతినిధులు జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొననున్నారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో జూలై 2-3 తేదీల్లో జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి ప్రతినిధులు హైదరాబాద్కు చేరుకోవడం నేటి నుండి మొదలవుతుంది.

నేడు హైదరాబాద్ కు బీజేపీ దళపతి జేపీ నడ్డా... మెగా రోడ్ షో తో బీజేపీ హంగామా
ఈరోజు బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా 3.30 నిమిషాలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. నడ్డాకు స్వాగతం పలికేందుకు రాష్ట్ర యూనిట్ మెగా రోడ్షోను నిర్వహించనుంది. శంషాబాద్లోని హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి సాగే రోడ్షోకు సన్నాహాలు జరుగుతున్నాయి. రోడ్ షో అనంతరం నేరుగా హైటెక్స్ కు చేరుకుని అందులో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను ప్రారంభిస్తారు. అనంతరం సాయంత్రం ఏడు గంటలకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులతో భేటీ నిర్వహిస్తారు. అయితే కార్యవర్గ సమావేశంలో చర్చించాల్సిన ముసాయిదాను రూపొందించనున్నారు. అధిష్ఠానం ఆదేశాల మేరకు ఇప్పటికే కేంద్ర మంత్రులు, జాతీయ నేతలు రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో పర్యటిస్తున్నారు.

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల షెడ్యూల్ ఇదే
ఇక జులై 1వ తేదీన సాయంత్రం నడ్డా అధ్యక్షతన జరిగే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శుల భేటీలో, కార్యవర్గ సమావేశాల అజెండాను, సమావేశంలో చేయాల్సిన తీర్మానాలను గురించి చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. జూలై 2వ తేదీన ఉదయం పదాధికారుల సమావేశం, ఇక అదే రోజు సాయంత్రం నాలుగు గంటల నుండి 3 వ తేదీ సాయంత్రం ఐదు గంటల దాకా జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తారు. ఆపై మూడవ తేదీన సాయంత్రం పరేడ్ గ్రౌండ్స్ లో ప్రధాని మోడీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ప్రధాని మోడీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున జనసమీకరణ చేసి బీజేపీ సత్తా చాటనున్నారు.

కాషాయ వర్ణం అయిన హైదరాబాద్.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు సర్వం సిద్ధం
హైదరాబాద్ నగరం మొత్తం పార్టీ జెండాలు, బ్యానర్లతో కాషాయ వర్ణాన్ని సంతరించుకుంది. కేంద్ర ప్రభుత్వ ఘనతను దాటేలా పోస్టర్లను బ్యానర్లు ఏర్పాటు చేశారు. నగరంలోని ప్రతి సందు బీజేపీ అగ్రనేతల పెద్ద పెద్ద కటౌట్లు, బ్యానర్లతో అలంకరించారు. జులై 2న జాతీయ ప్రధాన కార్యదర్శులు, జాతీయ ఆఫీస్ బేరర్ల సమావేశాలు, అనంతరం జాతీయ కార్యవర్గ సమావేశం, జూలై 3న పరేడ్ గ్రౌండ్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగంతో బహిరంగ సభ నిర్వహించనున్నారు.

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ద్వారా దక్షిణాది రాష్ట్రంపై ఫోకస్
జాతీయ కార్యవర్గానికి హాజరయ్యే ముందు సంపర్క్ అభియాన్ కోసం తెలంగాణలోని 119 నియోజకవర్గాలలో పర్యటించాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులకు సూచించిన విషయం తెలిసిందే . 2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు వెళుతున్న తరుణంలో బిజెపి అధికార టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని శతవిధాల ప్రయత్నం చేస్తుంది. గతంలో 2004లో నగరంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించి అధికారంలోకి వస్తే ఆలస్యం చేయకుండా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ బిజెపి కోరిక ఫలించలేదు. ప్రస్తుతం జాతీయ కార్యవర్గ సమావేశాల ద్వారా మళ్లీ దక్షిణాది రాష్ట్రమైన తెలంగాణపై ఫోకస్ చేస్తున్న బిజెపి ఈసారి ఏమేరకు సక్సెస్ అవుతుందనేది వేచి చూడాల్సిన విషయం.












Click it and Unblock the Notifications