రంగంలోకి నిఘా వర్గాలు: అల్లోల కోటలో ‘అమిత్ షా’ ఢీ
దక్షిణాదిన అందునా తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో పాగా వేయాలన్న సంకల్పంతో అమిత్ షా ముందుకు సాగుతున్నారు.
హైదరాబాద్: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వ్యూహమే డిఫరెంట్. 2013లో తొలుత ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపై ద్రుష్టి సారించిన ఈ గుజరాతీ నేత ఆ రాష్ట్రంలో కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీలకు చోటు లేకుండా చేయడంలో విజయం సాధించారు.
తర్వాత అసోం, మణిపూర్, హర్యానా తదితర రాష్ట్రాల్లోనూ ఇదే పంథా. ఇటీవల ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో బీజేపీ గెలుపొందడంలోనూ ఇదే వ్యూహం సక్సెసయింది. దీంతో ఇక ముందు కూడా ఇతర రాష్ట్రాల్లో బలమైన నేతలు, బలమైన సామాజిక వర్గాన్ని కమలదళంలో కలిపేసుకునేందుకు ప్రయత్నాలు మరింత ముమ్మరమయ్యాయి. దక్షిణాదిన అందునా తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో పాగా వేయాలన్న సంకల్పంతో అమిత్ షా ముందుకు సాగుతున్నారు.
ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి పెద్ద దిక్కుగా ఉన్న వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు చేపట్టినందున వచ్చే ఐదేళ్లపాటు ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైనట్లే. కనుక తెలంగాణలో పాగా వేయాలని, కుదరకపోతే ప్రధాన ప్రత్యర్థిగా అవతరించాలని కమలనాథులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. బీహార్ రాష్ట్రంలోగానీ, తెలంగాణ పొరుగు రాష్ట్రం కర్ణాటకలో గానీ ఒకనాడు చాలా నామమాత్రం. కానీ ఈ నాడు ఆ రాష్ట్రాల రాజకీయాలను శాసించే స్థాయికి చేరుకున్నది.
ప్రజల సెంటిమెంట్ కు అనుగుణంగా ‘కమలం' నినాదాలు
ఇప్పటి వరకు తెలంగాణలో కొన్ని ప్యాకెట్లలో బీజేపీకి పట్టు ఉన్నదనే అంశం నిర్వివాదాంశం. 1984లో నాటి కేంద్రమంత్రి, తర్వాత ప్రధానిగా పని చేసిన పీవీ నర్సింహారావును వరంగల్ లోని హన్మకొండ స్థానం నుంచి ఓడించిన నేపథ్యం బీజేపీది. మారిన పరిస్థితుల్లో ఇతర పార్టీల నేతలను ప్రత్యేకించి కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీల నేతలను దిగుమతి చేసుకుని బలోపేతం కావాలని.. ఆ దిశగా వ్యూహాలు అమలుచేస్తూ ముందుకు సాగుతోంది బీజేపీ.. ఈ క్రమంలో ఆదిలాబాద్ నుంచి కొత్తగా విడివడి ఏర్పాటైన నిర్మల్ జిల్లాలో బలమైన శక్తిగా ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు గత కొంతకాలం నుంచి చేస్తున్న ప్రయత్నాలను మరింత బలంగా కొనసాగించేందుకు వ్యూహత్మకంగా వ్యవహరిస్తోంది.
ప్రజల్లో ఉన్న బలమైన సెంటిమెంట్ను ఓటు రూపంలో మల్చుకొని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగేందుకు ఆ పార్టీ పావులు కదుపుతోంది. ఇటీవల పార్టీ రాష్ట్ర నాయకత్వం స్థానిక నేతలతో చర్చించి జిల్లా స్థితి గతులపై సమీక్షించింది. ఈ సమావేశంలో స్థానిక నేతల మధ్య స మన్వయం ఉండాలని, ఏ ఒక్క చిన్న సమస్యను గానీ, పథకాల అమలులో వైఫల్యాలను, అక్రమాలను లక్ష్యంగా చేసుకుంటూ ఆందోళనలు తీవ్రంగా చేయాలని అధిష్టానం ఆదేశించింది. దీంతో బీజేపీ గతం కన్నా కొంత దూకుడును పెంచి నిరంతర పార్టీ కార్యకలాపాలను హోరెత్తిస్తోంది.
బీమన్న గుట్టపై కలెక్టరేట్ పట్ల ప్రజా వ్యతిరేకత
బీజేపీ నిర్మల్ జిల్లా నేతలు కార్యకర్తలతో కలిసి బృందాలుగా విడిపోయి విడివిడిగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే సీరియస్ సమస్యలపై మాత్రం నేతలు, కార్యకర్తలంతా కలిసికట్టుగా ఆందోళన చేస్తున్నారు. అయితే ధర్మాసాగర్ చెరువులో పార్కు , వాకింగ్ ట్రాక్ నిర్మాణంపై బీజేపీ ఆందోళనలు చేసినా అవి యంత్రాంగంపై ఆశించిన రీతిలో ప్రభావం చూపలేదంటున్నారు. ఈ క్రమంలో భీమన్న గుట్టపై సమీకృత కలెక్టరేట్ నిర్మాణాల వ్యవహారంపై ప్రజల్లో వెల్లువెత్తిన నిరసనలు అనుకూలంగా మల్చుకునే ఎత్తుగడకు శ్రీకారం చుట్టింది. మొదట ధర్నా, రాస్తారోకోలు చేసిన బీజేపీ ఈ ఆందోళనను మరింత ఉధృతం చేయ తలపెట్టింది.
ఇందులో భాగంగా ఆ పార్టీ రిలే నిరాహార దీక్షలకు శ్రీకారం చుట్టింది. గత వారం రోజుల నుంచి స్థానిక భీమన్న గుట్టకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ కలెక్టరేట్ కార్యాలయం ముందు నిర్వహిస్తున్న దీక్షల శిబిరం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. భీమనిగుట్టపై కలెక్టరేట్ నిర్మించబోమని రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడే వరకు ఆందోళన విరమించవద్దని బీజేపీ తీర్మానించినట్లు తెలుస్తున్నది. భీమన్న గుట్టను లక్ష్యంగా చేసుకొని ఉద్యమాన్ని సాగిస్తోంది. మొదటి నుంచి ఆ పార్టీ ఈ అంశాన్ని అస్త్రంగా మలుచుకుంది. కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ దక్కకుండా వ్యూహత్మకంగా వ్యవహారిస్తోంది. కలెక్టరేట్ వద్ద దీక్ష శిబిరం ఏర్పాటు చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఈ రిలే దీక్షలకు స్థానిక నేతలే కాక రాష్ట్రస్థాయి నేతలను రప్పిస్తున్నారు. ఇటీవల ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘునందర్రావు దీక్ష శిబిరాన్ని సందర్శించి మద్దతు ప్రకటించారు.కాగా జిల్లాలో పార్టీ స్థితిగతులపై కేంద్ర ఇంటలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నట్లు వెలువడుతున్న సమాచారం ఆ పార్టీలో కదలిక తేస్తోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మరో నెల రోజుల్లోగా రాష్ర్టానికి రానున్న నేపథ్యంలో 31 జిల్లాల పార్టీ పరిస్థితులను, నేతల బలబలాలను, పార్టీ పట్ల ఆకర్షితులవుతున్న నేతల వివరాలను కేంద్ర నిఘా వర్గాలు సేకరిస్తున్నట్లు సమాచారం.
వచ్చే సార్వత్రిక ఎన్నికలే బీజేపీ లక్ష్యం
వచ్చే 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ అధిష్టానం ముందస్తు వ్యూహంతో సిద్ధమవుతోంది. లోక్ సభలో పార్టీ బలం పుంజుకోవాలని కమలనాథుల వ్యూహం. ప్రస్తుతం రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలో ఉండడం, కాంగ్రెస్ బలమైన ప్రతిపక్షంగా కొనసాగుతుండడంతో ఈ రెండు పార్టీలను దీటుగా ఎదుర్కొనేందుకు బీజేపీ ఇప్పటి నుండే రంగం సిద్ధం చేస్తోంది. దీని కోసం అధిష్టానం కేంద్ర నిఘా వర్గాలను రంగంలోకి దింపినట్లు సమాచారం. గత వారం రోజుల నుంచి జిల్లాలో ని నిర్మల్, భైంసా, ఖానాపూర్ పట్టణాల్లోనే కాకుండా కొన్ని మండల కేంద్రాల్లో నిఘా అదికారులు రహస్య ఆరా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. అమిత్షా రాష్ర్టానికి రాగానే ఇదే నివేదిక ఆధారంగా పార్టీ నేతల, శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్నట్లు సమాచారం.
బీజేపీ అధిష్టానం పార్టీ కార్యక్రమాలపైనా, నాయకుల బల బలాలపై దృష్టి సారిస్తుండడంతో అందరూ అప్రమత్తమవుతున్నారు. గతానికి భిన్నంగా అధిష్టానం స్థానిక కార్యకలాపాలపై రోజువారీ వివరాలను ఆరా తీస్తుండడంతో నేతలు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొద్ది రోజుల్లోనే అధినేత అమిత్షా రాష్ర్టానికి రానుండడంతో అప్పటిలోగా పార్టీ కార్యకలాపాలను ఉదృతం చేసి అధిష్టానాన్ని ఆకర్షించాలని స్థానిక నేతలు యోచిస్తున్నారు. అయితే అధికార టీఆర్ఎస్ పార్టీని లక్ష్యంగా చేసుకొని నిరంతర ఆందోళన చేపట్టాలని ఆ పార్టీ నాయకులు నిర్ణయించారు. ఇక నిరంతరం ప్రజల్లోనే పార్టీని ఉంచాలని స్థానిక నాయకులు వ్యూహరచన చేస్తున్నారు.
ఉనికి చాటుకునేందుకు ఇలా కమలనాథులు
కాగా బీజేపీ నేతలు భీమన్న గుట్ట వద్ద కలెక్టరేట్ నిర్మించవద్దని నిర్మల్ పట్టణంలో నిర్మాణాలకు అనుకూలమైన స్థలాలను చూపుతూ ప్రత్యేక మ్యాప్ను రూపొందించారు. దీని కోసం బీజేపీప్రత్యేక కర పత్రాన్ని ముద్రించి ప్రజలకు అందిస్తున్నది. ఈ కర పత్రాలను గ్రామ గ్రామాన పంపిణీ చేసి జనాలకు వాస్తవ పరిస్థితులను వివరించాలని, అలాగే పార్టీ ఉనికిని చాటుకోవాలని బీజేపీ భావిస్తోంది.
ఈ పరిస్థితుల్లో నిర్మల్ జిల్లాలో బీజేపీ బలపడితే మాత్రం ఇటు అధికార టీఆర్ఎస్, దానికి ప్రత్యామ్నాయమని విశ్వసిస్తున్న ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీకి ఉనికిని కాపాడుకోవడం కష్టమేనన్న అభిప్రాయం వినిపిస్తున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భాగమైన నిర్మల్ ప్రాంతంలో ప్రస్తుత రాష్ట్ర దేవాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కీలక నేత. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల తరఫున లోక్సభ, అసెంబ్లీలకు ప్రాతినిధ్యం వహించిన అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి 2009 ఎన్నికల తర్వాత పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు.
గత ఎన్నికల్లో ఇలా బీఎస్పీ నుంచి అల్లోల పోటీ
అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి నిర్మల్ ప్రాంతంలో గల పట్టును గుర్తించ నిరాకరించిన మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు వంటి వారు కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం, కేంద్ర నాయకత్వం వద్ద తమ ఉనికిని కాపాడుకోవడం కోసం అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ దొరక్కుండా చేశారు. దీంతో ప్రస్తుత సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పతో కలిసి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గత ఎన్నికల్లో మాయావతి సారథ్యంలోని బీఎస్పీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత మారిన పరిణామాల్లో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరి మంత్రి పదవిని దక్కించుకున్న అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి.. గత ఏడాది జరిగిన నూతన జిల్లాల ఏర్పాటులో నిర్మల్ కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. తద్వారా రాష్ట్ర ప్రభుత్వంలోనూ కీలక వ్యక్తిగా వ్యవహరిస్తున్న అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి - సీనియర్ రాజకీయ నాయకుడు సముద్రాల వేణుగోపాల చారిలు తమకు బీజేపీ విసురుతున్న సవాల్ను ఎలా ఎదుర్కొంటారన్న సంగతి భవిష్యత్ రాజకీయ యవనికపై చూడాల్సిందే.