నేడే హన్మకొండలో బీజేపీ బహిరంగసభ; హాజరుకానున్న జేపీ నడ్డా, సర్వత్రా ఆసక్తి!!
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో అధికారాన్ని చేపట్టాలని వ్యూహాత్మకంగా ఇప్పటి నుంచే పావులు కదుపుతున్న బిజెపి నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర అనేక ఉద్రిక్తతల మధ్య కొనసాగుతున్న విషయం తెలిసిందే. మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఈరోజు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వరంగల్ లోని భద్రకాళి ఆలయం వరకు పాదయాత్రను నిర్వహించి, ఆ తర్వాత ముగింపు సందర్భంగా హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు.

హన్మకొండలో బీజేపీ భారీ బహిరంగ సభ.. పాల్గొననున్న జేపీ నడ్డా
మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర నేటితో ముగియనున్న నేపథ్యంలో హన్మకొండ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.జేపీ నడ్డా మధ్యాహ్నం 3 గంటలకు భద్రకాళీ అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. మూడు గంటల 30 నిమిషాలకు తెలంగాణ అమరవీరుల కుటుంబాల తో సమావేశం నిర్వహిస్తారు. ఆపై 4 గంటల 10 నిమిషాలకు హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్ లో నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. సభ అనంతరం ఆయన హైదరాబాద్ కు బయలుదేరి వెళ్తారు.

జేపీ నడ్డాతో పాటు సభకు హాజరయ్యే ప్రముఖులు వీరే
జేపీ నడ్డాతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, బిజెపి రాష్ట్ర కొత్త ఇన్చార్జి సునీల్ బన్సల్ తో పాటు బిజెపి ఎమ్మెల్యేలు, పలువురు ముఖ్య నాయకులు హాజరు కానున్నారు. టిఆర్ఎస్ పార్టీ ఈ సభను అడ్డుకోవాలని ప్రయత్నించడం తో, బిజెపి సభను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని కోర్టును ఆశ్రయించి మరీ ఈ సభకు అనుమతి పొందింది.

నేటి బీజేపీ బహిరంగ సభకు రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత
ఈ క్రమంలో ఈరోజు హనుమకొండ వేదికగా నిర్వహించే సభను గ్రాండ్ సక్సెస్ చేయాలని బీజేపీ శ్రేణులు ప్రయత్నం చేస్తున్నాయి. ఆంక్షలు, అరెస్టులు, అనుమతుల గందరగోళం మధ్య హైకోర్టు అనుమతితో నిర్వహించనున్న నేటి సభకు రాజకీయంగా ప్రాధాన్యత ఉంది. మునుగోడు ఉపఎన్నిక, రాజా సింగ్ వ్యాఖ్యల నేపథ్యంలో చోటుచేసుకున్న ఉద్రిక్తతలు, ఇక లిక్కర్ కుంభకోణంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు వినిపిస్తున్న వ్యవహారం తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సమయంలో వరంగల్ వేదికగా నిర్వహిస్తున్న ఈ బహిరంగ సభ రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.

వేదికపై 150మంది కూర్చునేలా ఏర్పాట్లు
భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్న నేపథ్యంలో, సభను సక్సెస్ చేయడం కోసం బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున పనిచేస్తున్నారు. కాకతీయ కళా తోరణం తో సభా వేదికను ముస్తాబు చేశారు. వేదిక పైన 150 మంది కూర్చునే లాగా వేదికను సిద్ధం చేశారు. కళాకారుల కోసం మరో వేదికను ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికపై నుండి సీఎం కేసీఆర్ పై జేపీ నడ్డా, బండి సంజయ్ ఏ విధమైన వ్యాఖ్యలు చేస్తారు అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

తెలంగాణాపై బీజేపీ హైకమాండ్ ఫోకస్
ఇదిలా ఉంటే హోంమంత్రి అమిత్ షా మునుగోడు సభలో మాట్లాడిన తర్వాత ప్రస్తుతం మూడవ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా జేపీ నడ్డా తెలంగాణ రాష్ట్రానికి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని ప్రయత్నిస్తున్న క్రమంలోనే బీజేపీ అగ్రనేతలు తెలంగాణ రాష్ట్రంపై ఫోకస్ చేసినట్టుగా ప్రధానంగా కనిపిస్తుంది.












Click it and Unblock the Notifications