గులాబీ పార్టీలో ఛాన్స్ దక్కని ఎంపీలకు బీజేపీ గాలం ? తెలంగాణలో రసవత్తర రాజకీయం
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. సరికొత్త రాజకీయ సమీకరణాలతో కాంగ్రెస్ పార్టీని వెనక్కి నెడుతూ బిజెపి ముందుకు వస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ మాత్రం చరిష్మా చూపించలేకపోయిన బిజెపి లోక్ సభ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. కాంగ్రెస్ పార్టీ నుండి సీనియర్ నేతలైన అసంతృప్తులను, ఇటు టిఆర్ఎస్ పార్టీ నుండి టిక్కెట్ ఆశించి భంగపడిన వారిని పార్టీలో చేర్చుకుని సీట్లు కేటాయించే వ్యూహంలో ఉంది.

బీజేపీ 7 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించని కారణం ఇదే .. వలస నేతల కోసం బీజేపీ యత్నం
బిజెపి లోక్ సభ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన బీజేపీ అధిష్టానం తొలివిడత జాబితాలో పది మంది నాయకులకు మాత్రమే స్థానం కల్పించింది. మరో 7 స్థానాలను పెండింగ్ పెట్టింది. మెదక్, ఖమ్మం, పెద్దపల్లి, జహీరాబాద్, చేవెళ్ల, ఆదిలాబాద్, హైదరాబాద్ స్థానాల నుండి పోటీ చేసే అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. ఈ స్థానాల నుండి అటు కాంగ్రెస్ పార్టీ నుండి, ఇటు టిఆర్ఎస్ పార్టీ నుండి టిక్కెట్ ఆశించి భంగపడిన సీనియర్ నేతలకు అవకాశం ఇవ్వాలని బిజెపి నిర్ణయించింది.
ఒక పక్క టీఆర్ ఎస్ పార్టీ పక్క పార్టీల నేతలను గులాబీ గూటికి చేర్చటం పై దృష్టి సారిస్తే , బీజేపీ సైతం వలస నేతల కోసం ఎదురు చూస్తుంది. అందులో భాగంగానే 7 స్థానాల్లో టికెట్ లను పెండింగ్ పెట్టింది .

టీఆర్ఎస్ లో , కాంగ్రెస్ లో టికెట్లు దక్కని వారికి గాలం ..
అసెంబ్లీ ఎన్నికల్లో చరిష్మా కోల్పోయిన బీజేపీ డీకే అరుణ చేరికతో రాజకీయ వర్గాల దృష్టి మరల్చింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుండి డీకే అరుణ బిజెపిలో చేరి మహబూబ్ నగర్ నుండి టికెట్ దక్కించుకుంది. ఇక డీకే అరుణ బాటలో మరికొంత మంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీఆర్ఎస్ అధినేత కెసిఆర్ నలుగురు సిట్టింగ్ ఎంపీలకు షాక్ ఇచ్చారు. సలహాదారు వివేక్ సైతం టికెట్ కేటాయించలేదు. దీంతో అసంతృప్తితో ఉన్న టీఆర్ఎస్ నేతలకు సైతం గాలం వేసే పనిలో పడింది బిజెపి.

పావులు కదుపుతున్న బీజేపీ.. టికెట్ల కోసం బీజేపీ లో చేరతారా
ఇక ఇప్పటికే మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి తో బండారు దత్తాత్రేయ తో కలిసి మంతనాలు జరుపుతున్నారు డీకే అరుణ. బిజెపిలో చేరితేమెదక్ నుండి పోటీ చేసే అవకాశం వస్తుందని ఆమెతో చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఖమ్మం నుండి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి టికెట్ ఇవ్వనున్నట్లు గా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అలాగే పెద్దపల్లి నుండి వివేక్ కు , చేవెళ్ళ నుండి జితేందర్ రెడ్డి కి అవకాశం ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తుంది బీజేపీ . లోక్ సభ ఎన్నికల్లో ఊహించని విధంగా చివరి నిముషం లో బీజేపీ పావులు కదుపుతుంది. ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో అన్న టెన్షన్ ఉన్నప్పటికీ ఉనికి చాటుకునే యత్నం మాత్రం ముమ్మరంగా చేస్తుంది బీజేపీ .












Click it and Unblock the Notifications