రైల్వే‌స్టేషన్‌లో బాలుడి కిడ్నాప్: 24గం.లోనే పట్టేసిన పోలీసులు, సీసీఫుటేజీ, మహిళల గొడవే పట్టించింది

హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో సోమవారం కిడ్నాపైన నాలుగేళ్ల బాలుడు ఆయూష్ కేసును నార్త్ జోన్, రైల్వే పోలీసులు కలిసి 24గంటల్లోనే ఛేదించారు. మహబూబ్‌నగర్‌కు చెందిన ఎం యాదమ్మ అలియాస్ దుర్గ(21), ఎం జయ(18) బాలుడిని కిడ్నాప్ చేసినట్టు గుర్తించి, వారిద్దరినీ అరెస్ట్ చేశారు.

ఆయూష్‌తోపాటు మరో ఇద్దరు చిన్నారులకు కిడ్నాపర్ల చెర నుంచి విముక్తి కల్పించారు. ఈ ముఠా చిన్నారులను విక్రయిస్తున్నదని లేదా వారితో భిక్షాటన చేయిస్తున్నదని గుర్తించారు. మంగళవారం రైల్వే ఎస్పీ జీ అశోక్‌కుమార్‌తో కలిసి నార్త్‌జోన్ డీసీపీ సుమతి ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు.

 రైల్వే స్టేషన్‌లో బాలుడు అదృశ్యం

రైల్వే స్టేషన్‌లో బాలుడు అదృశ్యం

ఉత్తరప్రదేశ్‌లోని కన్నాంజ్ జిల్లా మన్నపూర్‌కు చెందిన సంజూచమర్ తన కొడుకు ఆయూష్(4), కుమార్తె అంజలి(6)తో కలిసి ఆదివారం సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. రాత్రంతా ఒకటో నంబర్ ప్లాట్‌ఫాంపై ఉన్న జనరల్ వెయిటింగ్ హాల్‌లో ఉన్నారు. సోమవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో సంజూ తన పిల్లలను వెయిటింగ్ హాల్‌లో ఉండమని చెప్పి, టిఫిన్ తెచ్చేందుకు వెళ్లింది. 10 నిమిషాల తర్వాత తిరిగి వచ్చేసరికి ఆయూష్ కనిపించలేదు.

సీసీ ఫుటేజీ ఆధారంగా..

సీసీ ఫుటేజీ ఆధారంగా..

సంజూ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న నార్త్ జోన్, రైల్వే పోలీసులు సంయుక్తంగా 5 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి తీవ్రంగా గాలించారు. రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాల్లోని 43 సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించగా కిడ్నాపర్లు యాదమ్మ, జయ ఆయూష్‌ను తీసుకెళ్లారని గుర్తించారు. వారు ఉదయం 7:50 గంటలకు రైల్వే స్టేషన్‌లోకి ప్రవేశించి, 8:15 గంటలకు బాలుడిని కిడ్నాప్ చేశారు. అక్కడ్నుంచి పరారయ్యారు. కాగా, పోలీసులు సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

బస్సు ఎక్కినట్లు గుర్తించిన పోలీసులు..

బస్సు ఎక్కినట్లు గుర్తించిన పోలీసులు..

రైల్వేస్టేషన్ ముందున్న ఆల్ఫా హోటల్, ప్యాట్నీ సెంటర్, హరిహరా కళాభవన్ వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో కిడ్నాపర్ల దృశ్యాలు నమోదయ్యాయి. కిడ్నాపర్లు హరిహరా కళాభవన్ ముందు బస్సు ఎక్కి వెళ్లిపోయారు. దీంతో సీసీ కెమెరా ఫుటేజీల లింకు తెగిపోయింది. కిడ్నాపర్ల ఆచూకీ కనుక్కోవడం పోలీసులకు సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో ఎస్సై రాజశేఖర్ రివర్స్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. కిడ్నాపర్లు ఎక్కడికి వెళ్లారో తెలుసుకునే కంటే.. వారు ఎక్కడి నుంచి వచ్చారనే అంశంపై ఆరాతీశారు. కిడ్నాపర్లు సోమవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో హకీంపేట డిపోకు చెందిన 25ఎస్ నంబర్ బస్సులో ప్రయాణించినట్టు గుర్తించారు. ఆ బస్సు డ్రైవర్, కండక్టర్‌ను పిలిపించి విచారించారు.

బిక్షమెత్తించడం లేదా.. అమ్మేయడమే వారిపని

బిక్షమెత్తించడం లేదా.. అమ్మేయడమే వారిపని

ఈ ముఠాలో మొత్తం ఆరుగురు ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది. వీరంతా బొల్లారం, అల్వాల్ ప్రాంతాల్లో స్థిరపడ్డవారే. వీరు రైల్వే స్టేషన్లు, బస్‌స్టాండుల్లో తిరుగుతూ అమాయక మహిళలను లక్ష్యంగా చేసుకొని వారిని వెంబడిస్తారు. అదును చూసి వారి పిల్లలను ఎత్తుకెళ్తుంటారు. పిల్లలు అరువకుండా చాక్లెట్లు, బిస్కెట్లు ఇస్తూ వారి స్థావరాలకు తీసుకెళ్తారు. తర్వాత ఎవరైనా పిల్లలు లేని వారికి అమ్మేస్తుంటారు. ఎవ్వరూ కొనకుంటే వారిని భిక్షాటనకు, చిత్తుకాగితాలు ఏరేందుకు పంపిస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది.

 టికెట్ కోసం మహిళల గొడవే వారిని పట్టించింది..

టికెట్ కోసం మహిళల గొడవే వారిని పట్టించింది..

యాదమ్మ, జయ అల్వాల్ వద్ద బస్సు ఎక్కిన తర్వాత టికెట్ ఎవరు తీయాలనే విషయంలో గొడవపడ్డారు. వీరి గొడవను డ్రైవర్ నర్సింహులు గమనించారు. ఆ తర్వాత సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు ఛార్జీ ఎంత అని కండక్టర్‌ను అడుగగా, రూ.30 అవుతుందని చెప్పడంతో ఆయనపై రుసరుసలాడారు. మా అంబేద్కర్‌నగర్ నుంచి రూ.20 అని అల్వాల్ నుంచి ఎందుకింత అవుతుందని కండక్టర్‌తో గొడవకుదిగారు. బస్సులో వీరిద్దరూ చేసిన రచ్చే పోలీసులకు పట్టించింది. వారు మాటల మధ్యలో మా అంబేద్కర్‌నగర్ అన్నారని, బహుశా ఆ ప్రాంతానికే చెందినవారై ఉంటారని బస్సు డ్రైవర్ నర్సింహులు పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు సోమవారం సాయం త్రం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకు బొల్లారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని అంబేద్కర్‌నగర్‌లో జల్లెడ పట్డారు. స్థానికుల సహకారంతో యాదమ్మ, జయను అదుపులోకి తీసుకున్నారు. ఆయూష్‌తోపాటు వారి చెరలో ఉన్న మరో ఇద్దరు చిన్నారులకు విముక్తి కల్పించారు. ఆయూష్‌ను ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు కిడ్నాపర్లు గౌన్ వేయడం గమనార్హం.

మరో ఇద్దరు చిన్నారులనూ కిడ్నాప్ చేశారు

మరో ఇద్దరు చిన్నారులనూ కిడ్నాప్ చేశారు

ఆయూష్‌ను తన తల్లి సంజూకు అప్పగించామని, కిడ్నాపర్ల చెర నుంచి విడిపించిన బాలిక బుచ్చి(7), బాలుడు శేఖర్(5)ను బాలసదనానికి పంపినట్టు డీసీపీ సుమతి మీడియాకు వివరించారు. మేడ్చల్ రైల్వేస్టేషన్‌లో 2017లో ఓ బాలిక, 2016లో ఉందానగర్ రైల్వేస్టేషన్‌లో ఓ బాలుడు కిడ్నాప్ అయ్యారని, ఈ ఇద్దరూ వారేనా? అని ఆరా తీస్తున్నామని ఆమె చెప్పారు. పిల్లలను అమ్మేందుకు లేదా భిక్షాటన చేయించేందుకు కిడ్నాప్ చేసినట్టు నిందితులు ఒప్పుకున్నారన్నారు. ఇదే ముఠాకు చెందిన మరో మహిళ అంజమ్మ పరారీలో ఉన్నట్టు తెలిపారు. ఇలాంటి కిడ్నాప్ ఘటనల నేపథ్యంలో తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో రైల్వే డీఎస్సీ రాజేంద్రప్రసాద్, ఏసీపీ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. కాగా, కేసును చాకచక్యంగా ఛేదించిన గోపాలపురం డీఐ కిరణ్, రైల్వే ఇన్‌స్పెక్టర్ ఆదిరెడ్డి, ఎస్సై యుగంధర్, సిబ్బందిని డీసీపీ అభినందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+