సడన్ బ్రేక్ : బస్సులో నుంచి ఎగిరి, చక్రాల కిందపడి చిన్నారి మృతి
మెదక్: మెదక్ జిల్లా సిద్దిపేట మండలంలోని ఇర్కోడు గ్రామంలో సోమవారం నాడు ఘోరం జరిగింది. డ్రైవర్ అజాగ్రత్త వల్ల అక్షిత్ అనే ఆరేళ్ల బాలుడు బస్సులో నుంచి ఎగిరి కింద పడి, చక్రాల కింద నలికి చనిపోయాడు. వర్షిత్ యూకేజీ చదువుతున్నాడు.
ఈ సంఘటన సోమవారం సాయంత్రం జరిగింది. బాలుడి కుటుంబంలో విషాదం నింపింది. ఇర్కోడుకు చెందిన వెంకటేశం, కృష్ణవేణికి ఇద్దరు పిల్లలు. ఆరేళ్ల అక్షిత్ను సిద్దిపేటలో యూకేజీ చదివిస్తున్నారు. అతను పాఠశాల బస్సులో వచ్చి వెళ్తుంటాడు.
ఆ బస్సు నిత్యం హన్మంతుపల్లి వద్ద విద్యార్తలను దించి ఇర్కోడు వెళ్తుంది. సోమవారం కూడా ఇర్కోడు గుట్టల సమీపంలో హన్మంతుపల్లి మలుపు వద్ద డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేకు వేశాడు. నిలుచుని ఉన్న అక్షిత్ ఒక్కసారిగా ఎగిరి కిందపడ్డారు.
దీంతో బస్ వెనుక చక్రం అతని తలమీదుగా వెళ్లడంతో అక్కడికక్కడే మరణించాడు. బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. బస్సు నడిచే సమయంలో డోర్లు బిగించక పోవడం కూడా అక్షిత్ ప్రాణాలు పోవడానికి కారణం. కనీసం డోర్ వేసి ఉన్నా ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదంటున్నారు.
నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాలపై చర్యలు తీసుకోవాలంటూ బంధువులు, గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఆందోళనకారులు బస్సు అద్దాలు పగులగొట్టి నిరసన తెలిపారు. కాగా, ఘటనకు కారణమైన పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని టీఎన్ఎస్ఎఫ్ జాతీయ సమన్వయ కమిటీ సభ్యుడు రమేశ్ డిమాండ్ చేశారు.