విషాదం: వాగులో కొట్టుకుపోయిన కారు, తల్లి సహా ఐదుగురు పిల్లల మృతి
హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా పిట్లం మండలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మండలంలోని కారేంగాం వద్ద ఉన్న పిల్లివాగులో శనివారం కారు గల్లంతైన ఘటనలో తల్లితో సహా ఐదుగురు చిన్నారులు మృతిచెందారు. గల్లంతైన ఆరుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి.
వివరాల్లోకి వెళితే... మెదక్ జిల్లా కంగ్టీ మండలానికి చెందిన రాజమణి అనే మహిళ తన ఐదుగురు పిల్లలతో సహా కారులో నిజామాబాద్ జిల్లాలోని పిట్లం ఆస్పత్రికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పిల్లి వాగుని దాటే క్రమంలో వాగులో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కారు అందులో కొట్టుకుపోయింది.
వాగువైపు వెళ్తుండగా వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుందని, వెళ్లొదని స్థానికులు డ్రైవర్ను వారించారు. అయినప్పటికీ డ్రైవర్ 'ప్రమాదం ఏమీ లేదు కారును తీసుకెళ్లగలను' అనే ధీమాతో ముందుకు వెళ్లినట్లు పలువురు గ్రామస్థులు తెలిపారు. వరదలో కొట్టుకుపోతున్న కారులో నుంచి బయటపడిన డ్రైవర్ పక్కనే ఉన్న చెట్టును పట్టుకొని ప్రాణాలు కాపాడుకున్నాడు.
ఇంతలో స్థానికులు అతడిని తాడు సాయంతో రక్షించారు. అనంతరం అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లటంతో అతనిని ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్తో పాటు మృతురాలి తమ్ముడు కూడా ప్రాణాలు దక్కించుకున్నాడు. ప్రమాద సమాచారం అందుకున్న పిట్లం ఎస్సై శ్రీకాంత్రెడ్డి, సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని వాగులో గాలించి మృతదేహాలను వెలికి తీశారు.
ఈ ప్రమాదంలో తల్లి రాజమణి, పిల్లలు ప్రియ (7), జ్యోతి(6), రెండేళ్ల కవల పిల్లలు జ్ఞాన అశ్మిత (3), జ్ఞాన సమిత (3), 10 నెలల పాప దీపాక్షలు గల్లంతయ్యారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.