ఫార్ములా వన్ రేసు మోసం: 'అంజనా రెడ్డి మోసం చేయలేదు, ఏం జరిగిందంటే'
నగరంలో ఫార్ములా వన్ రేస్ పేరిట భారీ కుంభకోణం జరిగిందని, ఓ వ్యాపారవేత్త నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారని, ఇందుకు సంబంధించి అంజనీ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
హైదరాబాద్: నగరంలో ఫార్ములా వన్ రేస్ పేరిట భారీ కుంభకోణం జరిగిందని, ఓ వ్యాపారవేత్త నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారని, ఇందుకు సంబంధించి అంజనీ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
దీనిపై సంబంధించి వ్యాపారవేత్త రఘురామకృష్ణం రాజు స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ ఛానల్తో మాట్లాడినట్లుగా వార్తలు వస్తున్నాయి. 2011లో అంజనీరెడ్డిని చాముండేశ్వరీనాథ్ పరిచయం చేశారని, రేసింగ్ వ్యాపారంలో లాభాలుంటాయని అంజనీ రెడ్డి తనకు చెప్పారని అన్నారు.
డబ్బు వస్తుందనే ఆశతో పెట్టుబడి
డబ్బు వస్తుందనే ఆశతో రూ.7.5 కోట్లు అఢ్వాన్స్ ఇచ్చానని, ఏడాది అయినా రేసింగ్ నిర్వహించకపోవడంతో నష్టాలు వచ్చాయని, దీంతో కోర్టులో పిటిషన్ దాఖలు చేశామని, విచారణకు స్వీకరించిన కోర్టు కేసు నమోదుకు ఆదేశించిందని రఘురామకృష్ణంరాజు తెలిపారు. పోలీసులకు గతంలోనే వాంగ్మూలం ఇచ్చినట్లు చెప్పారు.
కార్లు రాకపోవడం వల్లే
కాగా, దీనిపై చాముండేశ్వరినాథ్ కూడా మాట్లాడారని తెలుస్తోంది. రఘురామకృష్ణం రాజు, అంజనా రెడ్డి కలిసి వ్యాపారం చేశారని, ఇదే విషయాన్ని పోలీసులకు చెప్పామని, కార్లు రాకపోవడం వల్లే రేసింగ్ జరగలేదని, రేసింగ్ జరగకపోవడంతో కంపెనీ నష్టపోయిందని, కానీ మోసం చేయలేదన్నారు.
అసలు ఏం జరిగిందంటే
2011లో ఫార్ములా వన్ రేసు లీగ్ నిర్వహిస్తామని చెప్పి తమను మోసం చేశారని రఘురామకృష్ణం రాజు ఫిర్యాదు చేయడంతో ఈ కేసుకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు.
అమితాబ్, షారుక్లు పెట్టుబడులు పెట్టారని చెప్పి
అంజనారెడ్డి, వినోద్ మెహ్రా, సురేశ్ ఉతప్పలు కలిసి మకదర్ మోటార్స్ను స్థాపించారు. ఐపీఎల్ తరహాలో ఫార్ములా వన్ రేసు లీగ్ నిర్వహిస్తున్నామని, అందులో పెట్టుబడులు పెట్టాలని బడా వ్యాపారవేత్తలను కలిశారు. ఎనిమిది ఫ్రాంచైజీలు ఏర్పాటు చేశామని, షారుక్, అమితాబ్ వంటి వారు ఫ్రాంచైజీలను కొనుగోలు చేశారని, చెన్నైని మీరు తీసుకోవాలని రఘురామకృష్ణం రాజుకు చెప్పడంతో ఆయన రూ.7.5 కోట్లు అడ్వాన్స్గా ఇచ్చారు. రేసు ప్రారంభం కాకపోవడంతో 2017 మార్చిలో రఘురామ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు.