నయనానందకరం ... లక్ష్మీ నారసింహుని కళ్యాణం , పరవశించిన భక్త జనం
సకల కళ్యాణ గుణ పరిపూర్ణుడైన దేవదేవుడు వరదహస్తుడై ఆశీర్వదించిన వేళ.. స్వామివారి కరుణా కటాక్ష వీక్షణాలకై భక్తజనం పోటెత్తిన సమయాన.. వేదమంత్రోచ్ఛారణల నడుమ దిక్కులు పిక్కటిల్లేలా ఓం నమో నారసింహాయ అంటూ నామస్మరణలు మిన్నంటిన శుభ సమయాన.. జగత్కల్యాణం అందర్నీ ఆనందపారవశ్యంతో ముంచెత్తింది. అపూర్వ ఘట్టం భక్త హృదయాల్లో ఆధ్యాత్మిక వైభవాన్ని నింపింది. యాదాద్రి పులకించింది. తిరుకల్యాణ మహా ఘట్టాన్ని చూసిన భక్తుల హృదయం పరవశించింది.
మహాద్భుతంగా యాదాద్రి లక్ష్మీ నారసింహుడి పరిణయోత్సవ ఘట్టం
యాదాద్రి పుణ్య క్షేత్రంలో శుక్రవారం లక్ష్మీనరసింహస్వామి వారి మహాద్భుత పరిణయోత్సవం కనులపండుగగా సాగింది. బాలాలయంలో కల్యాణ వేడుక నిర్వహించి, కొండ కింద ఉన్న పాఠశాల ఆవరణలో వైభవోత్సవ కళ్యాణ ఘట్టాన్ని ఘనంగా నిర్వహించారు . యాదాద్రి బ్రహ్మోత్సవ తిరుకల్యాణ మహోన్నత వేడుక వేద మంత్రాలతో, మంగళవాయిద్యాలు, కర్పూర కాంతుల నడుమ అంబరాన్ని తాకింది. సర్వ జగత్తుకూ కల్పవల్లి, పుణ్యాలరాశి అయిన అమ్మవారికి మాంగల్యధారణ మహోన్నతంగా జరిగింది. ఆ కమనీయ దృశ్యాన్ని తనివితీరా చూసిన ప్రతి హృదయం అంతులేని ఆనందంతో మురిసింది. స్వర్ణాభరణాలతో అలంకరించిన ఉత్సవమూర్తులను వేదిక వద్ద కొలువుదీర్చినది మొదలు జరిగిన ప్రతి ఘట్టం పరమార్థంతో నిండి మనోహరంగా అలరించింది. వేదిక చుట్టూ విద్యుద్దీపాల సోయగాల మధ్య ఆనందహేల సందడి చేసింది.
తిరుకల్యాణోత్సవంలో పాల్గొన్న నరసింహన్ దంపతులు
యాదాద్రి స్వామి వారి కల్యాణానికి గవర్నర్ నరసింహన్ దంపతులు హాజరై రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించి కళ్యాణ వేడుకలో పాల్గొన్నారు.బాలాలయంలో జరిగిన కల్యాణ ఉత్సవంలో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, సతీమణి విమలా నరసింహన్ దంపతులు పాల్గొన్నారు. యాదాద్రి బాలాలయంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు, కొండ కింద జెడ్పీ హైస్కూల్ ఆవరణలో రాత్రి శ్రీవారి కల్యాణ మహోత్సవాన్ని అర్చకులు నిర్వహించారు.
జగన్మోహినిగా సమ్మోహితులను చేసిన స్వామి...... నేడు వైభవంగా తిరు కళ్యాణ వేడుక ..
కల్యాణోత్సవంలో పాల్గొన్న అధికారులు.. భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు
ఉదయం స్వామి వారు శ్రీరాముడిగా భక్తులకు దర్శనమిచ్చి, హనుమంత వాహనంలో బాలాలయంలో విహరించారు. గజ వాహనంపై వివాహానికి వేంచేసిన స్వామివారు లక్ష్మీదేవిని పరిణయమాడిన ఘట్టాన్ని తిలకించడానికి వచ్చిన అశేష భక్తజనంతో యాదాద్రికొండ కిక్కిరిసింది. ఆర్టీఐ చీఫ్ కమిషనర్ రాజాసదారామ్, కలెక్టర్ అనితారామచంద్రన్, డీసీపీ నారాయణరెడ్డి, ఆలయ ఈవో గీత, అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి వేడుకల్లో పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, స్వామివారి కల్యాణోత్సవం తిలకించేలా ఘనమైన ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు.