కేంద్ర గెజిట్ తెలుగురాష్ట్రాలకు గొడ్డలి పెట్టు, జగన్ వల్లే ఇదంతా : మాజీ మంత్రి కడియం శ్రీహరి ఫైర్
తెలంగాణ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం, టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు కడియం శ్రీహరి తాజాగా కృష్ణా ,గోదావరి నదీ జలాల బోర్డుల పరిధి నిర్ణయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు . కేంద్రం తీసుకువచ్చిన గెజిట్ తెలుగు రాష్ట్రాల హక్కులను కాల రాసిందని మాజీ మంత్రి కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు.
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం లేని ప్రాజెక్టులను సైతం తన హస్తగతం చేసుకోవడానికి కేంద్రం అడుగులు వేసిందని, అందుకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కేంద్రానికి దోహదపడ్డాయని కడియం శ్రీహరి ఆరోపించారు. ఏపీ సీఎం రాసిన లేఖను సాకుగా చూపించి కేంద్రం ఏకపక్షంగా గెజిట్ విడుదల చేయడాన్ని తప్పుపట్టిన కడియం శ్రీహరి కేంద్రం తీరుపై మండిపడ్డారు. కేంద్ర నిర్ణయం రెండు తెలుగు రాష్ట్రాలకు గొడ్డలిపెట్టు అన్న కడియం శ్రీహరి, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశపరిచి వివాదాలను పరిష్కరిస్తే సరిపోతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు .
అలా కాకుండా కేంద్రం ముందుకు వెళితే, ఈ వ్యవహారంలో కేంద్రం దిగి రాకుంటే న్యాయపోరాటం చేస్తామని కడియం శ్రీహరి స్పష్టం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాల విషయంలో చోటుచేసుకున్న వివాదం చిలికి చిలికి గాలివానగా మారి చివరికి కేంద్రం కోర్టులోకి బంతి వెళ్ళింది. దీంతో కేంద్రం కృష్ణా గోదావరి జలాల బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ జారీచేసిన గెజిట్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఆందోళనకు కారణంగా మారింది. తెలంగాణ సర్కార్ దీనిపై బాహాటంగానే విమర్శలు గుప్పిస్తుంటే, కేంద్రంపై సమరానికి సై అంటుంటే, ఏపీ ప్రభుత్వం మాత్రం ఎటూ తేల్చుకోలేని సందిగ్ధంలో సతమతమవుతోంది.