తెలంగాణకూ నిధులు: ‘అమృత్’ కింద రూ.416 కోట్లు విడుదల చేసిన కేంద్రం
హైదరాబాద్: తెలంగాణకు కేంద్రం నిధులను విడుదల చేసింది. ఇటీవలే ఆర్ధిక సర్దుబాటు కింద ఆంధ్రప్రదేశ్కు రూ. 700 కోట్లను కేంద్రం విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో నిధులన్నీ ఏపీకే కేటాయిస్తున్నారు, మా పరిస్థితి ఏంటని ఎంపీ కవిత కేంద్రాన్ని, మోడీని ప్రశ్నించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ‘అమృత్' పథకం కింద తెలంగాణకు కూడా నిధులు విడుదల చేస్తూ గురువారం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తెలంగాణకు రూ.416 కోట్లు విడుదలయ్యాయి.
విభజన అనంతరం తెలుగు రాష్ట్రాలకు నిధుల విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతోందన్న వాదన వినిపిస్తోంది. అయితే ఈ వాదనకు చెక్ పెడుతూ కేంద్ర ప్రభుత్వం ఒకే వారంలో ఇరు రాష్ట్రాలకు నిధులు విడుదల చేసింది.

మరోవైపు తెలంగాణలో కరవు పరిస్థితుల నేపథ్యంలో తక్షణ సాయంగా రూ. 1000 కోట్లు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం కేంద్రానికి ప్రాథమిక నివేదిక అందజేయనుంది. రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో 231 కరవు మండలాలను అధికారులు ప్రకటించారు.
కరవు నేపథ్యంలో రైతాంగాన్ని ఆదుకునేందుకు కేంద్రం సాయపడాలని కోరనున్నారు. కరవు పరిస్థితులపై ప్రాథమిక నివేదికలో రూ. 1000 కోట్లు తక్షణ సాయం విడుదలతో పాటు కరువు మండలాల్లో ఉపాధిహమీ పనిదినాలను 100 నుంచి 150కి పెంచాలని కోరారు.
మరోవైపు కరవు నష్టం అంచనాలను సాధ్యమైనంత త్వరగా సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. జిల్లాల వారీగా నష్టం అంచనాల ఆధారంగా పూర్తిస్థాయి నివేదికను కేంద్రానికి పంపనున్నారు.












Click it and Unblock the Notifications