TSRTC Strike: కలచివేసింది: టీఎస్ఆర్టీసీ సమ్మెపై స్పందించిన చంద్రబాబు
అమరావతి/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పదిరోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను ఉద్యోగాల నుంచి తీసివేస్తున్నామని ప్రకటించిన నేపథ్యంలో పలువురు కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడిన విషయం తెలిసిందే.

కలచివేసింది..
ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు సోమవారం నెల్లూరు టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ సమీక్షలో మాట్లాడుతూ.. తెలంగాణలో ఇద్దరు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడం తనను కలచి వేసిందని అన్నారు. ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కాదని అన్నారు.

పోరాడి సాధించాలి..
జీవితం ఎంతో విలువైందని, బతికి సాధించాలే తప్ప.. బలవన్మరణం పరిష్కారం కాదని చంద్రబాబు నాయుడు సూచించారు. ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆర్టీసీ కార్మికులను కోరారు. కార్మికులంతా సంయమనం పాటించాలని, పోరాడి హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు.

నియంత పాలన..
ఇది ఇలావుండగా, ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడటం బాధాకరమని సీపీఐ నేత నారాయణ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీ కార్మికుల పాత్ర మరువలేనిదని గుర్తు చేశారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను తీర్చకుండా కేసీఆర్ నియంత పాలన కొనసాగిస్తున్నాడని మండిపడ్డారు. తాజాగా నియమించిన తాత్కాలిక కార్మికులు, ఆర్టీసీ కార్మికుల మధ్య అంతర్యుద్ధం నడుపుతున్నారని నారాయణ ఆరోపించారు.

హుజూర్నగర్లో టీఆర్ఎస్కు మద్దతుపై పునరాలోచన..
ఆర్టీసీ కార్మికులంతా ధైర్యంగా ఉండాలని, ఆత్మహత్యలకు పాల్పడవద్దని సూచించారు. ఆత్మహత్యలకు పాల్పడిన ఒక్కో కార్మికుడి కుటుంబానికి రూ. కోటి చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మృతుల పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగంతోపాటు ఇల్లు కూడా ప్రభుత్వమే ఇవ్వాలన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న దోరణి నేపథ్యంలో హుజూర్నగర్ ఉపఎన్నికలో ఆ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలా? లేదా? అన్న విషయంపై సీపీఐ కీలక నేతలు చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతిస్తామని ప్రకటించినప్పటికీ.. ఆర్టీసీ కార్మికులకు వ్యతిరేకంగా ప్రభుత్వం నిర్ణయాలుండటంతో మద్దతుపై పునరాలోచనలో పడింది సీపీఐ. కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే తమ నిర్ణయాన్ని పునర్ ప్రకటిస్తామని సీపీఐ నేతలు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications