జీహెచ్ఎంసీ బడ్జెట్ సమావేశాల్లో రసాభాస! బీఆర్ఎస్ కార్పొరేటర్ల సస్పెండ్, అరెస్ట్
జీహెచ్ఎంసీ (GHMC) సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. బడ్జెట్ ఆమోదించిన తర్వాత ప్రజా సమస్యలపై చర్చించాలని బీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్పొరేటర్లకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు కార్పొరేటర్లను మార్షల్స్ బయటకు తీసుకెళ్లారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో మిగితా బీఆర్ఎస్ కార్పొరేటర్లు మేయర్ పోడియాన్ని చుట్టుముట్టి క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. అదుపులోకి తీసుకున్న కార్పొరేటర్లను సభలోకి తీసుకొచ్చి సభను నిర్వహించాలన్నారు. ప్రశ్నోత్తరాలు నిర్వహించి ప్రజా సమస్యలపై చర్చించాలని బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో సభలో మరోసారి గందరగోళం నెలకొంది.

మేయర్ ప్రజా సమస్యలపై చర్చిద్దామని చెప్పినా.. బీఆర్ఎస్ కార్పొరేటర్లు మాత్రం పట్టువీడలేదు. ఈ క్రమంలో అసహనం వ్యక్తం చేసిన మేయర్ గద్వాల విజయలక్ష్మి.. మార్షల్స్ తీసుకెళ్లిన కార్పొరేటర్లను తిరిగి సభలోకి తీసుకురావాలని పోలీసులను ఆదేశించారు. అయితే, ఆ నలుగురు కార్పొరేటర్లు లోనికి రావడానికి నిరాకరించడంతో మరోసారి వాగ్వాదం చోటు చేసుకుంది.
ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లందరినీ మేయర్ సస్పెండ్ చేశారు. దీంతో వారందరినీ మార్షల్స్ బయటికి తీసుకెళ్లారు. ఆ తర్వాత జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు బీఆర్ఎస్ కార్పొరేటర్లు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో మేయర్ విజయలక్ష్మి బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ. 8440 కోట్ల బడ్జెట్కు కౌన్సిల్ ఆమోదం తెలిపింది.
బీఆర్ఎస్ కార్పొరేటర్ల అరెస్టుపై కేటీఆర్ ఫైర్
కాగా, బీఆర్ఎస్ కార్పొరేటర్లను సస్పెండ్ చేయడంపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరానికి నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు. కోటి మంది నగర ప్రజల తరపున బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్రశ్నిస్తే.. బయటికి గెంటేస్తారా. అని కేటీఆర్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ కార్పొరేటర్ల అరెస్టును ఆయన ఖండించారు. హైదరాబాద్ నగరాన్ని పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టినందుకే తమ కార్పొరేటర్లను అరెస్ట్ చేశారని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications