మల్టీప్లెక్స్ లకు భారీ ఊరట
తెలంగాణ రాష్ట్రంలోని మల్టీప్లెక్స్లకు హైకోర్టులో భారీ ఊరట కలిగింది. 16 సంవత్సరాలలోపు పిల్లలను కూడా అన్ని షోలకు అనుమతించాలని హైకోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జనవరి 21న ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సవరించింది. తదుపరి విచారణను మార్చి 17కు వాయిదా వేసింది.
సినిమా టకెట్ల ధరలపెంపు, ప్రత్యేక షోల అనుమతి వ్యవహారంపై ఇటీవల దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. వేళాపాలా లేని షోలకు పిల్లలు వెళ్లడం వల్ల వాళ్ల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

ఈ క్రమంలో పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన హైకోర్టు ధర్మాసనం.. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు 16 ఏళ్లలోపు పిల్లలను థియేటర్లలోకి అనుమతించొద్దని ఆదేశించింది. అంతేగాక, ఈ విషయంపై అన్ని వర్గాలతో చర్చించి తగు నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఈ నేపథ్యంలోనే హైకోర్టు ఉత్తర్వులపై మల్టీప్లెక్స్ యాజమాన్యం మధ్యంతర పిటిషన్ దాఖలు చేసింది. పిల్లల ప్రవేశంపై ఆంక్షల వల్ల ఆర్థిక నష్టపోతున్నామని కోర్టుకు తెలిపింది. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునేంతవరకు హైకోర్టు విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని కోరింది. వారి వాదనలు పరిగణలోకి తీసుకున్న హైకోర్టు.. గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సవరించింది. ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకూ 16 ఏళ్లలోపు పిల్లలు మల్టీప్లెక్స్ థియేటర్లలోకి ప్రవేశించవచ్చని స్పష్టం చేసింది. దీంతో థియేటర్ల యాజమాన్యాలకు భారీ ఊరట లభించినట్లయింది.












Click it and Unblock the Notifications