మేడారం సమ్మక్క సారలమ్మలపై వ్యాఖ్యల వివాదంపై నోరుతెరిచిన చిన్నజీయర్ స్వామి.. ఏం చెప్పారంటే
మేడారం సమ్మక్క సారలమ్మలను కించపరుస్తూ చిన్న జీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్రంలో దుమారం రేగిన విషయం తెలిసిందే. గిరిజనుల ఆరాధ్య దైవమైన మేడారం సమ్మక్క-సారలమ్మలను కించపరిచిన చిన్న జీయర్ స్వామి తక్షణం తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, గిరిజన సమాజానికి, తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పాలని గిరిజన ఆదివాసీల నుండి డిమాండ్ వినిపించింది. చిన్న జీయర్ స్వామి దిష్టిబొమ్మల దహనాలు, ఆందోళనలతో ఈ వివాదం కాస్త ముదిరింది. ఇక రాజకీయ నాయకులు కూడా చిన్న జీయర్ చేసిన వ్యాఖ్యలపై నిప్పులు చెరిగారు.

మేడారం సమ్మక్క సారలమ్మల వివాదంపై స్పందించిన చిన్న జీయర్ స్వామి
తాజాగా ఈ వివాదంపై చిన్న జీయర్ స్వామి వివరణ ఇచ్చారు. తాడేపల్లిలో మీడియా సమావేశం నిర్వహించిన చిన్న జీయర్ స్వామి తాను మహిళల్ని ఆదరించాలని భావించేవాడిని అని పేర్కొన్నారు. మహిళల్ని, దేవతల్ని చిన్నచూపుతో మాట్లాడతామని అనుకోవడం పొరపాటు అని పేర్కొన్న ఆయన, ఒక విషయాన్ని మాట్లాడినప్పుడు పూర్వాపరాలు చూడాలని కానీ మధ్యలో ఒక దాన్ని చూపించి విమర్శించడం హాస్యాస్పదం అని వెల్లడించారు.

ఈ వివాదాన్ని ఎందుకు తెరమీదకు తెచ్చారో వారి విజ్ఞతకే వదిలేస్తున్నా: చిన్న జీయర్ స్వామి
ఎవరినీ చిన్నచూపు చూసే ఉద్దేశ్యం తనకు లేదని పేర్కొన్న చిన్నజీయర్ స్వామి కొందరు సొంత లాభం కోసమే ఈ రకమైన వివాదాన్ని తెరపైకి తెస్తున్నారని మండిపడ్డారు. అసలు ఈ వివాదాన్ని ఎందుకు తెరమీదకు తీసుకువచ్చారు అన్నది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం అని పేర్కొన్నారు చిన్న జీయర్ స్వామి. గతంలో ఎప్పుడో తాను చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు వివాదం చేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. ఆదివాసీల కోసం తాము పాఠశాలలను నిర్వహిస్తున్నామని, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని చిన్న జీయర్ స్వామి వెల్లడించారు.

కొందరు పబ్లిసిటీ కోసం ఈ రకమైన అల్ప ప్రచారం
చేస్తున్నారంటూ చిన్న జీయర్ స్వామి మండిపడ్డారు. ఇవాళ లక్ష్మీదేవి పుట్టినరోజు అని పేర్కొన్న చిన్న జీయర్ స్వామి ఆగమ శాస్త్రాలు ఇదే విషయాన్ని చెబుతున్నాయని ఇవాళ అంతర్జాతీయ వైదిక మహిళా దినోత్సవంగా చెప్పాలని, మహిళలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని పేర్కొన్నారు. మహిళలందరికీ మంగళాశాసనాలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు .

ఆదివాసీలను తాము గౌరవిస్తాం .. ఆదివాసీల కోసం స్కూల్స్ నిర్వహిస్తున్నాం
ఎవరికి జ్ఞానం విలక్షణంగా ఉంటే వారికి ఆరాధ్య స్థానం కల్పించాలని రామానుజాచార్యుల వారు సూచించారని చిన్నజీయర్ స్వామి తెలిపారు. జ్ఞానులైన ఆదివాసీలను గౌరవించే సంప్రదాయం ఉండాలని రామానుజాచార్యులు సూచించారని పేర్కొన్న ఆయన, తాము ఆదివాసీలను గౌరవిస్తామని స్పష్టం చేశారు. అవకాశాలు లేక ఆదివాసి బిడ్డలు వెనుకబడ్డారని, అవకాశం ఉంటే ఆదివాసీలు అద్భుతమైన ప్రగతిని చూపిస్తారని చిన్న జీయర్ స్వామి వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీల కోసం 2004లోనే స్కూలును ప్రారంభించామని తనకు ఆదివాసీల పట్ల చులకన భావం లేదని చిన్న జీయర్ స్వామి స్పష్టంచేశారు.












Click it and Unblock the Notifications