ఉద్యోగులను ఖుషీ చేసే ఫిట్మెంట్... సీఎం కేసీఆర్ కీలక హామీలు.. వేటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటే...?
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు,ఉపాధ్యాయులకు ఆమోదయోగ్యమైన పీఆర్సీకి ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 29శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ అమలుచేయాలని సీఎం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందునా... ఎన్నికలు ముగిసిన వెంటనే దీనిపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. పీఆర్సీతో పాటు రాష్ట్రంలో ఉద్యోగ,ఉపాధ్యాయ,పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని ఉద్యోగ సంఘాల నేతలకు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినట్లు సమాచారం.మంగళవారం(మార్చి 9) హైదరాబాద్లోని ప్రగతిభవన్లో ఉద్యోగ, ఉపాధ్యాయ, అధికారుల సంఘాల ప్రతినిధులు సీఎం కేసీఆర్తో సమావేశమై ఈ అంశాలపై చర్చించారు.

ఫిట్మెంట్,బదిలీలు,పదోన్నతులపై హామీ...
ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులకు ఇచ్చిన దానికంటే ఎక్కువే పీఆర్సీ ఇస్తామని ఉద్యోగ సంఘాల నేతలకు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో 27 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ఇస్తున్నందున.. రాష్ట్రంలో ఉద్యోగులకు అంతకంటే 2, 3 శాతం ఎక్కువ ఫిట్మెంట్ ఖరారు చేస్తామని చెప్పినట్లు సమాచారం. ఈ లెక్కన తెలంగాణ ఉద్యోగులకు 29 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ అందే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగియగానే ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చినట్లు సమాచారం.

రిటైర్మెంట్ వయసు,పంచాయతీ కార్యదర్శుల ప్రొబేషన్...
ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 61 ఏళ్లకు పెంచేందుకు సీఎం అంగీకరించినట్లు తెలుస్తోంది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) పరిధిలోని ఉద్యోగులు సర్వీసులో ఉండగా మరణిస్తే... వారి కుటుంబాలకు ఫ్యామిలీ పెన్షన్ ఇచ్చేందుకు ఓకె చెప్పినట్లు సమాచారం. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్) ప్రొబేషన్ పీరియడ్ను 3 ఏళ్ల నుంచి 2 ఏళ్లకు కుదించేందుకు, వీఆర్వోలను రెవెన్యూ శాఖలోనే సర్దుబాటు చేసేందుకు సీఎం హామీ ఇచ్చినట్లు చెప్తున్నారు. కాంట్రాక్టు లెక్చరర్లు, టీచర్ల క్రమబద్ధీకరణ సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని... తాజా పీఆర్సీలో వారికి మెరుగైన వేతనాలు అందిస్తామని చెప్పినట్లు ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు.

వారికి పాత పెన్షన్ విధానం....
2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు,పాఠశాలల్లో శానిటేషన్ సిబ్బంది నియామకాలకు హామీ ఇచ్చినట్లు తెలిపారు. ప్రాథమిక పాఠశాలలకు 10 వేల ప్రధానోపాధ్యాయ పోస్టులు మంజూరుచేసి.. పదోన్నతుల ద్వారా నియామకాలు చేపడుతామని చెప్పారన్నారు. స్పౌజ్ కేటగిరీ బదిలీలు, కారుణ్య నియామకాలను ఎప్పటికప్పుడు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చినట్లు చెప్పారు.కరోనాతో రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థికభారం పడినప్పటికీ ఉద్యోగుల జీతభత్యాలపై దాని ప్రభావం లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారన్నారు. సీఎంతో భేటీలో ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్, టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, జేఏసీ సెక్రటరీ జనరల్, టీజీవో అధ్యక్షురాలు మమత, టీఎన్జీవో మహిళావిభాగం అధ్యక్షురాలు రేచల్, సచివాలయ సంఘం అధ్యక్షుడు నరేందర్రావు, టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి ప్రతా ప్, టీజీవో ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, పీఆర్టీయూ అధ్యక్షుడు శ్రీపాల్రెడ్డి, ప్రధాన కార్యదర్శి కమలాకర్ పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications