మోడీ రాక కోసం కెసిఆర్ నిరీక్షణ! కొత్త ఫ్రెండ్ చంద్రబాబును పిలిచేనా?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రధాని నరేంద్ర మోడీ రాక కోసం నిరీక్షిస్తున్నారా? అంటే అవునని అంటున్నారు. ఇటీవల ఢిల్లీకి వెళ్లిన కెసిఆర్ ప్రధాని మోడీని డిసెంబర్లో తాను నిర్వహించనున్న చండీయాగానికి ఆహ్వానించారు.
కెసిఆర్ సిబిఐ కేసు నుంచి తప్పించుకునేందుకు ప్రధాని మోడీని కూల్ చేయాలని చూస్తున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి. ఇదిలా ఉండగా, గతంలోను పలుమార్లు కెసిఆర్ ప్రధాని మోడీని రాష్ట్రానికి ఆహ్వానించారు.
గత ఏడాది జూన్లో బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కెసిఆర్ ప్రధాని మోడీని రాష్ట్రానికి తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. జూన్ నెలలో గోదావరి పుష్కరాలు జరిగాయి. ఈ పుష్కరాల సమయంలోను కెసిఆర్ ప్రధాని మోడీని ఆహ్వానించారు. కానీ హాజరు కాలేదు.
ఇప్పుడు చండీయాగానికి ప్రధాని మోడీతో పాటు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తదితరులను ఆహ్వానించారు. ఈసారైనా ప్రధాని మోడీ వస్తారా చూడాల్సి ఉంది.
మరోవైపు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును కూడా కెసిఆర్ ఆహ్వానించే అవకాశాలు లేకపోలేదు. ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు చంద్రబాబు స్వయంగా కెసిఆర్ ఇంటికి వెళ్లి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో చండీయాగానికి చంద్రబాబును ఆహ్వానించవచ్చునని అంటున్నారు.