రాకేష్ టికాయత్ తోపాటు వివిధ రాష్ట్రాల రైతుసంఘాల నేతలతో సీఎం కేసీఆర్ భేటీ..ఎందుకంటే!!
తెలంగాణ సీఎం కేసీఆర్ ఈరోజు రైతు సంఘాల నాయకులతో భేటీ కానున్నారు. పంజాబ్, కర్ణాటక, ఒరిస్సా, జార్ఖండ్ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల నుండి వచ్చిన వంద మంది రైతు సంఘాల నేతలు సీఎం కేసీఆర్ ను కలవనున్నారు. మొత్తం దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాల నుండి వచ్చిన రైతు సంఘాల నాయకులు నేడు సీఎం కేసీఆర్ తో భేటీలో పాల్గొననున్నారు.

రాకేష్ టికాయత్ తో పాటు రైతు సంఘాల నాయకులతో సీఎం కేసీఆర్ భేటీ
ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో రైతుల సాగునీటి అవసరాల కోసం నిర్మించిన వివిధ ప్రాజెక్టులను ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన రైతు సంఘాల నాయకులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే గౌరారం దగ్గర రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించిన అటవీ ప్రాంతాన్ని పరిశీలించిన రైతు సంఘాల ప్రతినిధులు మల్లన్న సాగర్, ట్యాంక్ బండ్, పంప్ హౌస్ లను పరిశీలించారు. ఈరోజు జాతీయ రైతు సంఘం నేత రాకేష్ టికాయత్ తో సహా మరికొంత మంది నేతలతో సమావేశం కానున్నారు సీఎం కేసీఆర్.

భేటీలో ప్రధానంగా చర్చించే అంశాలివే
కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై ప్రధానంగా ఈ భేటీలో చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. రైతుల విషయంలో కేంద్రం తీరు ఈ భేటీలో చర్చకు రానుంది. ఢిల్లీ వేదికగా టిఆర్ఎస్ పార్టీ నేతలు రైతు సంఘ నాయకులతో సమన్వయం జరిపి, సీఎం కేసీఆర్ తో భేటీలు నిర్వహించడం జాతీయ రాజకీయాల్లో ఆసక్తి కలిగిస్తుంది. ఒకపక్క జాతీయ రాజకీయాలలో కీలక పాత్ర పోషిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటన చేసిన నేపథ్యంలో, తాజాగా రైతు సంఘాల నాయకులతో సీఎం కేసీఆర్ భేటీ ఆసక్తికరంగా మారింది.

తెలంగాణాలో రైతు సంక్షేమ పథకాలపై ఇతర రాష్ట్రాల రైతుల కితాబు
రాష్ట్రంలో రైతు సంక్షేమం కోసం అమలవుతున్న పథకాలు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సాగునీటి వనరులు, వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పులు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన రైతు సంఘం నాయకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అవుతున్న రైతుల సంక్షేమ పథకాలపై ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎకరానికి 10 వేల రూపాయల రైతుబంధు సాయం, ఐదు లక్షల రూపాయల రైతు బీమా అందించడం, దేశ రైతు చరిత్రలోనే గొప్ప పరిణామమని తెలంగాణ సీఎం కేసీఆర్ ను వారు తెగ కొనియాడుతున్నారు.

సీఎం కేసీఆర్ దేశానికి రైతు బాంధవుడు అంటున్న రైతు సంఘం నాయకులు
సాగునీటి ప్రాజెక్టుల ద్వారా రైతులకు నీరు అందించడం, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు వంటి సదుపాయాలను చూసి తెలంగాణ రైతాంగానికి ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కిసాన్ ఆందోళనలో పాల్గొని అమరులైన రైతులకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఆర్థిక సహాయం అందించడం కూడా అభినందనీయమని ప్రశంసిస్తున్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికే కాదు దేశానికి రైతు బాంధవుడు అని రైతు సంఘాల నాయకులు కొనియాడుతున్నారు












Click it and Unblock the Notifications