ముస్లిం స్ధితిగతులపై కేసీఆర్ సమీక్ష: 'ఎంతో వెనుకబడి ఉన్నారు, మార్పు తెస్తాం'
హైదరాబాద్: తెలంగాణలో ముస్లిం స్థితిగతులపై సీఎం కేసీఆర్ సోమవారం సచివాలయంలో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో ముస్లింలు ఎంతో వెనుకబడి ఉన్నారు. ముస్లింల జీవన స్థితిగతుల్లో మార్పు తెస్తామని ఎన్నికల సందర్భంగా చెప్పామని అన్నారు.
ఆ హామీని 100 శాతం నిలబెట్టుకునేందుకు గాను, జనాభా ప్రకారం పేద ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించేందుకు అధ్యయనం చేస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత పేదరికంలో మగ్గుతోన్న ముస్లింల ఆర్థిక, సామాజిక, విద్యా స్థితిగతులపై సమగ్రంగా అధ్యయనం చేయాలని సీఎం తెలిపారు.
తెలంగాణ ముస్లింల సంక్షేమం కోసం అవసరమైన కార్యక్రమాలు రూపొందించాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 12 శాతం మంది ముస్లింలు ఉన్నారని, వారిలో ఎక్కువ శాతం మంది నిరుపేదలుగా ఉన్నారని వివరించారు.
గతంలో తాను యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు సచార్ కమిటీ నియామకానికి యూపీఏ ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. ఈ కమిటీ ద్వారా దేశ వ్యాప్తంగా ముస్లింలకు సంబంధించిన అనేక అంశాలు బయటకు వచ్చాయని అన్నారు.
ఇప్పడుు తెలంగాణలో కూడా ముస్లింలపై లోతుగా అధ్యయనం జరగాలని అన్నారు. ప్రతీ జిల్లాలో 3 నుంచి నాలుగు నియోజకవర్గాల్లో పర్యటించాలన్నారు. పట్టణ, గ్రామీణ ముస్లింలను కలవాలని సూచించారు. వారి స్థితిగతులపై వివరాలు సేకరించాలన్నారు.
ముస్లింల జీవన విధానంపై ఫోటోలు తీయడంతో పాటు వీడియోలు కూడా చిత్రీకరించాలని అన్నారు. మూడు, నాలుగు ఏజెన్సీలతో సర్వే నిర్వహించాలన్నారు. రాజకీయ పార్టీలు, ఇతర సంస్థలు ముస్లింల నుంచి వినతులు స్వీకరించాలని అన్నారు.
తెలంగాణలో చాలా ముస్లిం కుటుంబాలు పేదరికంలో ఉన్నాయని, నెలకు రూ. 1000 కూడా సంపాదన లేని వారుండటం బాధాకరమని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు, ముస్లింల కోసం ప్రత్యేకించి షాదీ ముబారక్, హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు లాంటి చర్యలు తీసుకున్నామని చెప్పారు.
ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, కేంద్రం నియమించిని కుంద్ కమిటీ సభ్యులు ఈ సమీక్షకు హాజరయ్యారు. కమిషన్లోకి ప్రభుత్వ మాజీ ప్రత్యేక కార్యదర్శి జి. సుధీర్ నేతృత్వంలోని కమిషన్లో కుంద్ కమిటీలో పని చేసిన అనుభవం ఉన్న అమీరుల్లాఖాన్, అబ్దుల్ షాబాన్లను సభ్యులుగా నియమించారు.