సీఎం కేసీఆర్ సంచలనం .. 40వేల కోట్ల అప్పుల్లో తెలంగాణా, కానీ వారికి కియా కార్నివాల్ కార్ల బొనాంజా!!
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ తెలంగాణ జిల్లా అదనపు కలెక్టర్లకు అధికారిక వాహనాలుగా కియా కార్నివాల్ కార్లను కొనుగోలు చేసి సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిన్నటికి నిన్న ప్రగతి భవన్ లో ఈ కార్లను పరిశీలించిన కెసిఆర్ అధికారులను వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పచ్చజెండా ఊపి ఈ కార్లను ప్రారంభించారు.అయితే రాష్ట్రం కరోనా సంక్షోభంతో విలవిలలాడుతున్న సమయంలో,ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న తరుణంలో అధికారులకు లగ్జరీ కార్ల కొనుగోలుపై ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి.ఈ సమయంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం అవసరమా అని ప్రశ్నిస్తున్నాయి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు.
సెలవు రోజుల్లో విధ్వంసం .. వైఎస్ జగన్ కొత్త పథకం : టీడీపీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు ఫైర్
32 మంది అదనపు జిల్లా కలెక్టర్లకు బంపర్ బొనాంజా ఆఫర్ ఇచ్చిన సీఎం కేసీఆర్
కరోనా మహమ్మారి సమయంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 32 మంది అదనపు జిల్లా కలెక్టర్లకు బంపర్ బొనాంజా ఆఫర్ ఇచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్. వారు క్షేత్రస్థాయి పర్యటనలు చేయడం కోసం 32 కియా కార్నివాల్ కార్లను కొనుగోలు చేశారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన ఒక్కో కియా కార్నివాల్ కార్ విలువ 25 నుండి 30 లక్షలు ఉంటుందని అంచనా. అయితే ఈ చర్యపై ప్రతిపక్ష పార్టీలు తీవ్రస్థాయిలో సీఎం కేసీఆర్ పై విరుచుకు పడుతున్నాయి.
మండిపడుతున్న ప్రతిపక్షాలు .... అధికారులను ప్రసన్నం చేసుకోవటానికే అంటున్న బీజేపీ
ఒకపక్క రాష్ట్రంలో కరోనా మహమ్మారి అల్లకల్లోలం సృష్టిస్తోంది. కరోనా సంక్షోభ సమయంలో ఇంత ఖర్చుతో ఇంత లగ్జరీ కార్లను, అధికారుల కోసం కొనుగోలు చేయడం అవసరమా అని ప్రశ్నిస్తున్నాయి. తెలంగాణ బిజెపి రాష్ట్రంలో అధికారులను ప్రసన్నం చేసుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన చర్య ఓ క్రిమినల్ చర్య అని అభివర్ణిస్తుంది. 32 అల్ట్రా లగ్జరీ వాహనాలు కొనడానికి 11 కోట్లకు పైగా ఖర్చు చేయడం ఎంతవరకు సమర్థనీయం అని సీఎం కేసీఆర్ ను బిజెపి పార్టీ ప్రతినిధి కృష్ణ సాగర్ రావు ప్రశ్నించారు.
కరోనా సంక్షోభ సమయంలో భారీగా ప్రజా ధనం దుర్వినియోగం
కరోనా మహమ్మారి విలయతాండవం చేసి ప్రజలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో సీఎం కేసీఆర్ ప్రజల డబ్బును భారీగా వృధా చేస్తున్నారని ఆరోపించారు.కరోనా మహమ్మారి బారిన పడి ఆసుపత్రుల్లో చేరి చాలా మంది పేదలు ఆర్థిక ఇబ్బందులతో, అప్పులబాధతో చనిపోతున్నారని, అవేవి పట్టకుండా అధికారులకు లగ్జరీ కార్లను కొనుగోలు చేయడం చాలా దారుణమైన నిర్ణయమని, ఈ నిర్ణయాన్ని వెంటనే సీఎం కేసీఆర్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రాన్ని 40 వేల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టారన్న కాంగ్రెస్
ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం సీఎం కేసీఆర్ చర్యపై మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్రవణ్ కుమార్ టిఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రాన్ని 40 వేల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టి, మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని లోటు బడ్జెట్ రాష్ట్రంగా తయారుచేశారని మండిపడ్డారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకల సంఖ్యను పెంచడానికి, ప్రజా రవాణా కోసం బస్సుల సంఖ్య పెంచడానికి ఖర్చు చేయకుండా, ప్రభుత్వ అధికారులకు లగ్జరీ కియా కార్నివాల్ కార్లు కొనడం ప్రభుత్వ దుర్వినియోగానికి నిదర్శనమని ఆయన ఆరోపించారు.
కరోనా లాక్ డౌన్ సమయంలో తగ్గిన ఆదాయం .. లగ్జరీ కార్లు అధికారులకు అవసరమే అన్న కేసీఆర్
కరోనా లాక్డౌన్ కారణంగా తెలంగాణ 4,500 కోట్ల రూపాయల భారీ ఆదాయం కోల్పోయిందని ఇటీవల ఆర్థిక మంత్రి హరీష్ రావు పేర్కొన్నారని, ఇలాంటి సమయంలో అధికారుల కోసం లగ్జరీ కార్లు కొనుగోలు అవసరమా అంటూ ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ నేతలు.అయితే సీఎం కేసీఆర్ మాత్రం లగ్జరీ కార్ల కొనుగోలుకు సమర్థిస్తూ అదనపు కలెక్టర్లకు జిల్లాల్లో పర్యటించడానికి,వారి విధులను నిర్వర్తించడానికి ఇటువంటి వాహనాలు అవసరం అని చెప్పడం గమనార్హం.