ధాన్యం కొనుగోలుపై చిల్లరకొట్టు షావుకారులా కేంద్రం తీరు; కిషన్ రెడ్డి దద్దమ్మ.. కేంద్రంపై కేసీఆర్ కన్నెర్ర
తెలంగాణ సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై నిప్పులు చెరిగారు. సోమవారం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ కేంద్రం తన సామాజిక బాధ్యతను విస్మరించిందని మండిపడ్డారు. దేశంలో ధాన్యాన్ని సేకరించడం, సేకరించిన ధాన్యాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందించడం, దేశ ఆహార భద్రత కోసం బఫర్ స్టాక్ నిల్వచేయడం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్న కేసీఆర్ క్యాబినెట్ భేటీ అనంతరం మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు.

కేంద్రం చిల్లర కొట్టు షావుకారులా వ్యవహరిస్తోందన్న కేసీఆర్
తెలంగాణ వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం తీరు పై నిప్పులు చెరిగిన కేసీఆర్ దేశ రైతాంగాన్ని కేంద్రం గందరగోళానికి గురి చేస్తుందని ఆరోపించారు. కేంద్రం చిల్లర కొట్టు షావుకారులా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. దేశంలోని రైతాంగం నుండి ధాన్యం కొనుగోలు చేయాలని, నష్టం వస్తే కేంద్రం భరించాలని,నిల్వలు ఎక్కువైతే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని కేసీఆర్ సూచించారు. బిజెపి రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని సీఎం కేసీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గ్యాస్, పెట్రోల్ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచారు అని విమర్శించిన కేసీఆర్ పూర్తిస్థాయిలో పేదల వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు.

నీచమైన కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదు
కేంద్రం నిర్ణయాలు సామాన్య మధ్యతరగతి ప్రజలపై భారం మోపే విధంగా ఉంటున్నాయని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని రంగాలలోనూ కేంద్రం ఇలాంటి విధానాలనే అవలంబిస్తోందని కెసిఆర్ నిప్పులు చెరిగారు. ఇంత నీచమైన కేంద్ర ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదని విరుచుకుపడ్డారు. ప్రతి విషయంలోనూ లాభనష్టాలను బేరీజు వేసుకొని మాట్లాడటం సరైందికాదని, అలా చేస్తే ప్రభుత్వం ఎలా అవుతుంది అంటూ ప్రశ్నించారు కెసిఆర్. లక్షల కోట్ల బడ్జెట్ కలిగి ఉన్న కేంద్ర ప్రభుత్వం కిరాణా దుకాణందారుడిలా మాట్లాడటం అనైతికమని కేంద్ర ప్రభుత్వానికి ఔన్నత్యం కాదని మండిపడ్డారు.

ధాన్యం ఎంత కోటా తీసుకుంటారో చెప్పకుండా ఇబ్బంది పెడుతున్న కేంద్రం
బాయిల్డ్ రైస్ కొనమని కేంద్ర స్పష్టంగా చెప్పిందని పేర్కొన్న కేసీఆర్ రా రైస్ ఎంత తీసుకుంటారో కూడా కేంద్రం చెప్పలేదని మండిపడ్డారు. 90 లక్షల టన్నుల ధాన్యం తీసుకోవాలని కేంద్రాన్ని కోరామని పేర్కొన్నారు కెసిఆర్. యాసంగి లో వడ్లు పండితే నూక ఎక్కువగా వస్తుందన్న ఆయన నష్టపోకుండా ఉండటం కోసం మిల్లర్లు బాయిల్డ్ రైస్ చేస్తున్నారని, రాష్ట్ర వాతావరణం దృష్ట్యా యాసంగి పంట బాయిల్డ్ రైస్ కి అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు. ఏడాదికొకసారి ఎంత పంట తీసుకుంటారో కోటా ఇస్తే అంతవరకే పండించి కేంద్ర ప్రభుత్వానికి ఇస్తామని కానీ అలా చెప్పకుండా ఇబ్బంది పెడుతున్నారని కేంద్రం తీరుపై మండిపడ్డారు.

వాళ్లకు మొహం లేక మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు
మా మెడపై కత్తి పెట్టి బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని లేఖ రాయించుకున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం తీరుతో తెలంగాణ రైతులు ఏం చేయాలో చెప్పాలని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ఇంత దిగజారిన కేంద్ర ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని పేర్కొన్న కెసిఆర్ ఢిల్లీకి వెళితే మొహం లేక మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అంటూ మండిపడ్డారు. విభజన చట్టం ప్రకారం కేంద్రం సహకారం అందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్నామని చెప్పిన ఆయన కేంద్రం సహకరించకపోయినా ఎన్నో అభివృద్ధి పనులను చేపట్టామని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇబ్బందులు పెట్టినా, కేసులు వేసినా ప్రాజెక్టులు కట్టామని, తద్వారా తెలంగాణలో పంటల దిగుబడి వస్తుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
Recommended Video

దమ్ముంటే కిషన్ రెడ్డి కేంద్రంతో బాయిల్డ్ రైస్ కొనిపించాలని కేసీఆర్ డిమాండ్
రైతులకు అండగా ఉంటానని చెబుతున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దమ్ముంటే కేంద్రంతో బాయిల్డ్ రైస్ కొనిపించాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. వరి విషయంలో కిషన్ రెడ్డి చేతగాని దద్దమ్మలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 750 మంది రైతులను పొట్టనబెట్టుకున్న హంతక పార్టీ బిజెపి అని తెలంగాణా సీఎం కెసిఆర్ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులను 100% ముంచుతుందని తెలంగాణ సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications