కాంగ్రెస్, టీడీపీలకు వార్నింగ్, క్రిమినల్ కేసులు: జయ, మమత బాటలో కేసీఆర్
హైదరాబాద్: మహారాష్ట్ర ప్రభుత్వంతో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో చారిత్రాత్మక ఒప్పందాలు చేసుకుని తిరిగి హైదరాబాద్కు చేరుకున్న సీఎం కేసీఆర్ బేగంపేట విమానాశ్రయంలో కాంగ్రెస్, టీడీపీలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇకమీదట రాష్ట్రాంలోని విపక్షాలతో ఏ విధంగా వ్యవహరించబోతున్నారో సవాల్ విసురుతూ స్పష్టంగా తేల్చిచెప్పారు.
ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తే కేసులు పెట్టి జైలు కూడు తినిపిస్తానని చెప్పి ప్రతిపక్షాలను కట్టడి చేయబోతున్నట్టు స్పషమైన సంకేతాలిచ్చారు. సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో మాటల యుద్ధానికి తెరలేపాయి. దీంతో కేసీఆర్ సవాళ్లను ఎదుర్కొంటూనే, ప్రతిపక్షాలు సైతం తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.
బేగంపేట విమానాశ్రయంలో సీఎం కేసీఆర్ ప్రధానంగా కాంగ్రెస్, టీడీపీలను టార్గెట్ చేశారు. ప్రతిపక్షాలు అవాకులు, చెవాకులు మాట్లాడుతున్నాయంటూ ఆరోపణలు రుజువు చేయకపోతే జైలుకు పోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కేసీఆర్ హెచ్చరికలను చూస్తుంటే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం జయలలితను ఫాలో అవుతున్నారా?
అనే సందేహాం కలుగుతోంది. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ రెండోసారి పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రతిపక్షాలపై కేసులు ఎక్కువగా పెడుతున్నారు. దీదీకి నచ్చని పనిచేసినా వారిని జైల్లో పెడుతోంది. మొన్నామధ్య వ్యంగ్యంగా కార్టూన్ వేసినా ఓ కార్టూనిస్ట్ చేతులకు సంకెళ్లు వేయించింది.
ఇక తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత విషయానికి వస్తే తన వ్యతిరేకులపై పరువు నష్టం దావాలు వేసి ఇబ్బందులు పెడతారనే విమర్శ ఉంది. ఈ విషయమై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సైతం జయలలిత తీరుపై మండిపడింది. ప్రజా జీవితంలో ఉన్న వారు సద్విమర్శల్ని స్వీకరించడం అలవాటు చేసుకోవాల్సిందేనని తేల్చి చెప్పింది.
అంతేనా పరువు నష్టం దావా చట్టాన్ని కక్ష సాధించడానికి ఉపయోగించకూడదని జయకు చెప్పింది. ఇప్పుడు కేసీఆర్ కూడా ప్రభుత్వంపై చేసిన ఆరోపణలు రుజువు చేయలేకపోతే క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపిస్తానని అంటున్నారు. అయితే కేసీఆర్ చెప్పిన కేసులు క్రిమినల్ కేసులు కావచ్చు లేదా పరువు నష్టం దావాలు కావచ్చనే వాదన వినిపిస్తోంది.
గోదావరిపై 152 మీటర్లకు బదులు 148 మీటర్ల ఒప్పందం వల్ల తెలంగాణకు నష్టమని కాంగ్రెస్, టీడీపీతో పాటు బీజేపీ నేతలు కూడా అభ్యంతరం తెలిపారు. అది అబద్దమైతే ప్రజలకు మహారాష్ట్రతో చేసుకున్న ఒప్పందాల గురించి ప్రభుత్వం విడమర్చి చెప్పాలి. అంతేకాదు ప్రతిపక్షాలు చేస్తున్న వాదనను కూడా పరిగణనలోకి తీసుకుని ఆలోచించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
అలా కాకుండా ప్రభుత్వంపై ఆరోపణలు చేసినంత మాత్రాన జైల్లో పెట్టిస్తానని సీఎం స్థాయి వ్యక్తి అనడం ఎంత వరకు సబబు అని ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయి. ఈ విషయంపై ప్రభుత్వం ప్రజలకు క్లారిటీ ఇస్తే బాగుంటుంది. అలా కాకుండా ఏకపక్షంగా వ్యవహారిస్తే మల్లన్న సాగర్ ప్రాజక్టు మాదిరి ప్రభుత్వం వ్యతిరేకతను ఎదుర్కోనే వీలుంది.
ఇక ప్రతిపక్షాలపై ప్రభుత్వం కేసుల పెడితే అవి మరింతగా రాటుదేలే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతురావు ప్రస్తావించారు. గురువారం ఆయన మాట్లాడుతూ మమ్మల్ని జైల్లో పెట్టిన రోజే టీఆర్ఎస్ పతనం మొదలైనట్టేనని వీహెచ్ హెచ్చరించారు.