జాతీయ రాజకీయాలపై కేసీఆర్ నజర్ : ప్రధాని-షా తో భేటీ ఫిక్స్ : ఏపీ సీఎం జగన్ తో సంబంధాల పైనా..!!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన ఆకస్మికంగా మరో రెండు రోజులు పొడిగించారు. ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కోసం తెలంగాణ భవన్ శంకుస్థాపన కోసం ఢిల్లీ వచ్చిన సీఎం కేసీఆర్ పార్టీ నేతలతో కలిసి ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తరువాత పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ రోజు తిరిగి హైదరాబాద్ రావాల్సి ఉంది. అయితే, సడన్ గా సీఎం కేసీఆర్ ప్రధాని మోదీతో పాటుగా కేంద్ర మంత్రులను కలవాలని నిర్ణయించారు.
జాతీయ రాజకీయాలపై కేసీఆర్ వ్యూహాత్మకంగా..
అందులో భాగంగా ప్రధాని మోదీతో పాటుగా కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో ఈ రోజు సమావేశం కానున్నారు. శనివారం కేంద్రం హోం శాఖ మంత్రి అమిత్ షా తో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. ఢిల్లీలో పార్టీ కార్యాలయం ఏర్పాటు ద్వారా జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ యాక్టివ్ అవుతారనే ప్రచారం పార్టీ నేతల్లో జోరుగా సాగుతోంది. గతం లోనే ఆయన ఈ ప్రయత్నం చేసినా..2019 ఎన్నికల్లో జాతీయ స్థాయిలో వచ్చిన ఫలితాలతో తెలంగాణాకే పరిమితం అయ్యారు.
ఇక ఢిల్లీ రాజకీయాల పై నజర్..
అయితే, ఇప్పుడు తిరిగి జాతీయ రాజకీయాల్లో సమీకరణాలు మారుతున్నాయి. ఈ సమయంలో తిరిగి ప్రాంతీయ పార్టీలు కీలకంగా మారుతున్నాయి. జాతీయ స్థాయిలో అనేక పార్టీల నేతలతో సత్సంబంధాలు ఉన్న కేసీఆర్...పరిస్థితులకు అనుగుణంగా అడుగులు వేయటంలో మంచి వ్యూహకర్త. అయితే, ఇదే సమయంలో బీజేపీతోనూ కేసీఆర్ కు సత్సంబంధాలు ఉన్నాయంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. గతంలోనూ కేంద్రం తీసుకున్న పలు నిర్ణయాలకు కేసీఆర్ మద్దతు ప్రకటించారు.
కేంద్రానికి టీఆర్ఎస్ మద్దతు అవసరమేనా..
ఇక, త్వరలో రాష్ట్రపతి- ఉప రాష్ట్రపతి ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ మద్దతు బీజేపీకి అవసరం కానుంది. ఇక, ఈ భేటీ ద్వారా కేసీఆర్ రాష్ట్రంలో పరిస్థితులను ప్రధానికి వివరించే అవకాశం ఉంది. ఇక, ఏపీతో కొనసాగుతున్న నీటి పంచాయితీల అంశాన్ని ప్రధానికి నివేదించనున్నారు. ఏపీ సీఎం జగన్ తో సంబంధాల గురించి ప్రధానితో భేటీలో ప్రస్తావనకు వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఏపీలో సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టిన తరువాత రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగాయి.
జగన్ తో సంబంధాలు- ఎఫెక్ట్..
కానీ, కొంత కాలంగా కేసీఆర్ - జగన్ ఇద్దరి మధ్య సంబంధాలు దెబ్బ తిన్నట్లుగా కనిపిస్తోంది. అయితే, ఇద్దరూ ఒకరి పైన మరొకరు విమర్శలు చేసుకోకపోయినా..జల వివాదాలు మాత్రం ఇద్దరికీ ప్రతిష్ఠాత్మకంగా మారాయి. ఇక, సీఎం కేసీఆర్ కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ లోనూ సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. గోదావరి, కృష్ణానదీ జలాల వ్యవహారం, కేంద్ర గెజిట్ పై చర్చించనున్నారు. గెజిట్ లో పేర్కొన్న అంశాల పైన తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేసింది.
Recommended Video
అమిత్ షా తో కీలక భేటీ వెనుక..
ఏపీలో చేపడుతున్న ప్రాజెక్టులు.. తమ అభ్యంతరాల పైన కేసీఆర్ నేరుగా కేంద్ర మంత్రికి వివరించనున్నారు. శనివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో కేసీఆర్ సమావేశం కానున్నారు. ఈ మేరకు అప్పాయింట్ మెంట్ ఖరారైంది. తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారం కోసం కేంద్ర హోం శాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. అమిత్ షా తో సమావేశం సమయంలో..పునర్విభజన చట్టం మేరకు తెలంగాణకు రావాల్సిన ప్రయోజనాలు.. కేంద్రం వద్ద పెండింగ్ అంశాలతో పాటుగా .. ఏపీతో సంబంధాలు - జాతీయ రాజకీయాల పైన కేసీఆర్ చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.