మాకెవరూ బాస్లు లేరు: సీఎం కెసిఆర్, మే 2వ తేదీన ఎంసెట్
వరంగల్: తమకు ఎవరూ బాస్లు లేరని, ప్రజలే తమకు దేవుళ్లని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంగళవారం అన్నారు. ఆయన వరంగల్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా సమైక్య పాలకుల పైన మండిపడ్డారు.
వరంగల్ జిల్లాకు మంచి రోజులు రాబోతున్నాయన్నారు. కాకతీయ కాల్వ కింద మొత్తం ఆయకట్టుకు నీరు అందిస్తామని చెప్పారు. రేపటిలోగా వరంగల్ జిల్లా అభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకుంటామని, ప్రకటిస్తానని చెప్పారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్రకికీ మార్చి నెల నుంచి కల్యాణ లక్ష్మి వర్తింప చేస్తామన్నారు.
గతంలో సమైక్య పాలకులు నీరు వచ్చేలా ప్రాజెక్టులు నిర్మించలేదన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంతోనే రైతుల కష్టాలు తీరుతాయని చెప్పారు. రెండు పంటలకు సాగునీరు అందిస్తామన్నారు. ఉద్యమంలో, ఎన్నికల్లో ఓరుగల్లు ప్రజలు టిఆర్ఎస్ వెంటే ఉన్నారని చెప్పారు. సమైక్య రాష్ట్రంలో వరంగల్ ప్రాజెక్టులను పట్టించుకోలేదన్నారు.
ప్రతిపక్షాలు ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచనలు చేయడం లేదని చెప్పారు. ప్రతిపక్షాలను తాము పట్టించుకోవడం లేదని, ప్రజలే తమకు దేవుళ్లు అని చెప్పారు. వరంగల్ ప్రజలు బుద్ధి చెప్పినా టిడిపి, కాంగ్రెస్ నేతల్లో ఇంకా మార్పు రాలేదన్నారు.
కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించామని చెప్పారు. ప్రజల సహకారంతోనే బంగారు తెలంగాణ సాధ్యమన్నారు. మాకు ప్రజలు దేవుళ్లను, ఎవరూ బాస్లు లేరని చెప్పారు. భూపాలపల్లి నియోజకవర్గం తప్పకుండా అభివృద్ధి చెందుతుందన్నారు. గతంలో కాకతీయ ప్రాజెక్టును పట్టించుకోలేదన్నారు.
కరెంట్ విషయంలో అందరి అపోహలను పటాపంచలు చేశామన్నారు. 2018 నాటికి ఇరవై నాలుగు గంటల పాటు విద్యుత్ ఇస్తామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అలుపెరగకుండా కష్టపడతామన్నారు. ప్రతి ఏడాది ఇరిగేషన్కు రూ.25వేల కోట్లు కేటాయిస్తామన్నారు.
వరంగల్ జిల్లా ఘణపురం మండలం దుబ్బపల్లిలో ఏర్పాటు చేసిన కేటీపీపీ రెండో యూనిట్ను కెసిఆర్ జాతికి అంకితం చేశారు. పైలాన్ను ఆవిష్కరించారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. ఏం ఇచ్చినా వరంగల్ ప్రజల రుణాన్ని తీర్చుకోలేమన్నారు.
తెరాస పైన కిషన్ రెడ్డి ఆగ్రహం
తెలంగాణ ప్రభుత్వం పైన తెలంగాణ బిజెపి అధ్యక్షులు కిషన్ రెడ్డి మంగళవారం నాడు మండిపడ్డారు. హైదరాబాదులో గ్రేటర్ డివిజన్లను అడ్డగోలుగా చేశారన్నారు. సచివాలయాన్ని టిఆర్ఎస్ అధికార పార్టీగా మార్చారని నిప్పులు చెరిగారు.
ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీల ప్రకటన
తెలంగాణ రాష్ట్ర కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (సెట్) తేదీలు ఖరారయ్యాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (టీఎస్సీహెచ్ఈ) ఛైర్మన్ పాపిరెడ్డి పలు సెట్ల తేదీలను ప్రకటించారు. మే 2న ఎంసెట్, మే 12న ఈసెట్, మే 19న ఐసెట్, మే 27న ఎడ్సెట్, మే 29న ఈసెట్, మే 24న లాసెట్, పీజీ లాసెట్, మే 11న పీఈసెట్ పరీక్షలు ఉంటాయన్నారు.