యాదాద్రి అభివృద్ధి పనులకు కెసిఆర్ శంకుస్థాపన
హైదరాబాద్: నల్గొండ జిల్లా యాదగిరిగుట్టలో అభివృద్ధి పనులకు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు శనివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ నర్సింహన్ దంపతులు, చినజీయర్ స్వామి, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, భువనగిరి ఎంపి బూర నర్సయ్యగౌడ్, అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామిని గవర్నర్ దంపతులు, సిఎం కెసిఆర్, చినజీయర్ స్వామి దర్శించుకున్నారు. అర్చకులు వారికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో విమాన గోపుర పునర్నిర్మాణ శిలాఫలకాన్ని సీఎం ఆవిష్కరించారు.
గుట్టకింద తులసికోట దగ్గర శిలాఫలకాన్ని సిఎం ఆవిష్కరించారు. యాదగిరిగుట్ట అథారిటీ సమావేశంలో కెసిఆర్ పాల్గొన్నారు. భూసేకరణ కమిటీ, అటవీ రెవెన్యూ శాఖ అధికారులతో గుట్ట అభివృద్ధి పనులపై సిఎం చర్చించారు. సంగీత భవన్లో అధికారులు ఏర్పాటు చేసిన గుట్ట అభివృద్ధి ప్లాన్పై పవర్పాయింట్ ప్రజెంటేషన్ను సిఎం కెసిఆర్ తిలకించారు.
పూర్తి స్థాయిలో అభివృద్ధి చేపట్టాక యాదాద్రి ఎలా ఉంటుందో చూపేలా అధికారులు దీన్ని రూపొందించారు. సిఎంతోపాటు చినజీయర్ స్వామి, మంత్రులు, ఎమ్మెల్యేలు, యాడా వైస్ ఛైర్మన్ కిషన్ రావు తదితరులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తిలకించారు. అనంతరం సిఎం కెసిఆర్ హైదరాబాద్ పయనమయ్యారు.