ఇది రేవంత్ రెడ్డికి జరిగిన అవమానం కాదు.. తెలంగాణా ప్రజలకు జరిగిన అవమానం!
రాజకీయ కోణంలోనే తన అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వలేదని, ఇది రేవంత్ రెడ్డికి వ్యక్తిగతంగా జరిగిన అవమానం కాదని, నాలుగు కోటల తెలంగాణా ప్రజలకు, తెలంగాణా ప్రభుత్వానికి జరిగిన అవమానం అని తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ తన విదేశీ పర్యటనల లక్ష్యం పెట్టుబడులు మాత్రమేనని స్పష్టం చేశారు.
అమెరికా పర్యటనను తిరస్కరించిన కేంద్ర వైఖరిపై సీఎం రేవంత్
విద్యా, స్పోర్ట్స్ రంగాల్లో పెట్టుబడులు తీసుకురావాలన్నది ప్రభుత్వ ఆలోచన అని చెప్పారు. ఇంగ్లండ్ పర్యటనకు అనుమతి ఇచ్చి అమెరికా పర్యటనను తిరస్కరించిన కేంద్ర వైఖరిని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఖండించారని సీఎం గుర్తు చేశారు.కోట్లాది మంది కేంద్ర నిర్ణయాన్ని తప్పుపట్టారని పేర్కొన్నారు. అమెరికా పర్యటనపై బీజేపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేశారని, వివరాలు ఇవ్వలేదని తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు.

రాజకీయపరమైన నిర్ణయంతోనే అనుమతి నిరాకరణ
విదేశాంగ శాఖకు విద్య, క్రీడలు, పెట్టుబడుల అంశాలపై స్పష్టమైన వివరాలు అందించామని, పర్యటన ఉద్దేశాన్ని పూర్తిగా వివరించామని సీఎం చెప్పారు. రాజకీయపరమైన నిర్ణయంతోనే అనుమతి నిరాకరించారని పేర్కొన్నారు. బీజేపీ నేతల గురించి మాట్లాడాలని అనుకోలేదని, వారికి ఆ స్థాయి లేదని స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధికి విదేశీ పెట్టుబడులు కీలకమని, విద్యా, క్రీడా రంగాల్లో భాగస్వామ్యం ద్వారా రాష్ట్రం ముందుకు వెళ్లాలని సీఎం అభిప్రాయపడ్డారు.
గుజరాత్ సీఎం కు ఎందుకు అనుమతి ఇచ్చారు? రేవంత్ ప్రశ్న
లండన్ పర్యటనలో ప్రవాస తెలుగు వారితో చర్చలు జరిపినట్లు, తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను వివరించినట్లు తెలిపారు. కేంద్రం వైఖరి రాజకీయ ప్రేరితమని మళ్లీ నొక్కి చెప్పారు.
పార్లమెంట్ లో తెలంగాణ అభివృద్ధిని.. పెట్టుబడులను అడ్డుకుంటున్న వైనంపై కేంద్రాన్ని ప్రశ్నిస్తాం అన్నారు. నరేంద్ర మోడీ గుజరాత్..కాబట్టి గుజరాత్ అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారన్నారు. గుజరాత్ సీఎంని ఎలా అమెరికా పర్యటనకు అనుమతించారో చెప్పాలని ప్రశ్నించారు.
పర్యటన అడ్డుకున్నా లక్ష్యాన్ని అడ్డుకోలేరన్న సీఎం రేవంత్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఎందుకు అడ్డుకున్నారు..?మోదీ సమాధానం చెప్పాలన్నారు. కేంద్రం వైఖరిని తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరం ఖండిస్తున్నాం అన్నారు. నా పర్యటన అడ్డుకున్నారు.. కానీ నా లక్ష్యాన్ని అడ్డుకోలేరని సీఎం రేవంత్ పేర్కొన్నారు.అధికారులు అమెరికా వెళ్లారు.. వాళ్ళ ద్వారా లక్ష్య సాధన దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం అని వెల్లడించారు.డిసెంబర్ లో హైదరాబాద్ లో గ్లోబల్ ఈవెంట్ నిర్వహించే ప్రణాళిక ఉందన్నారు. అందుకు సంబంధించి ముందే విదేశీ కంపెనీలకు సమాచారం.ఇవ్వాల్సి ఉంటుందని ఆయన వెల్లడించారు.
ఇది పూర్తిగా వివక్ష
గుజరాత్ సీఎం ఈనెల 17 నుంచి 8 రోజులు విదేశాల్లో పర్యటించారు.. వైబ్రెంట్ గుజరాత్ పేరుతో అమెరికా, కెనడాలో ఆయనకు రోడ్షోలకు అనుమతి ఇచ్చారు.. అదే తెలంగాణ రైజింగ్ పాలసీలో భాగంగా నేను వెళ్తా అంటే తిరస్కరించారన్నారు. ఇది పూర్తిగా తెలంగాణాపై వివక్ష అన్నారు. తెలంగాణా అభివృద్ధిని అడ్డుకునే కుట్ర అన్నారు. నా విదేశీ పర్యటనలో విషయం లేదనుకుంటే ఇంగ్లండ్ వెళ్లేందుకు ఎలా అనుమతి ఇచ్చారో చెప్పాలన్నారు. అమెరికాకు ఎందుకు ఇవ్వలేదు అన్నది మోదీ సమాధానం చెప్పాలని సీఎం రేవంత్ ప్రశ్నించారు.













Click it and Unblock the Notifications