తెలంగాణాలో పేదరికం లేకుండా సీఎం రేవంత్ సూపర్ పాలసీ!
తెలంగాణ రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు కొత్త ఆయుధంగా విద్య తప్ప మరో ఆయుధం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ నివేదిక రూపకల్పన పైన మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయి పరిస్థితులకు, భవిష్యత్తు అవసరాలకు తగినట్టుగా తెలంగాణ విద్యా విధానాన్ని రూపొందించాలన్నారు. ఇది దేశానికి దిక్సూచిలా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు విద్యావేత్తలకు సూచించారు.
రాష్ట్ర విద్యా విధానంపై అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
ప్రస్తుత విద్యా విధానంలో భాష ఉన్న వారి వద్ద జ్ఞానం లేదని, జ్ఞానం ఉన్నచోట భాష లేదని, ఆ రెండు ఉన్నవాళ్ల వద్ద నైపుణ్యాలు లేవని ఈ మూడింటి మేళవింపుగా విద్యను అందించే లక్ష్యంతో రాష్ట్ర విద్యా విధానాన్ని రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు దిశా నిర్దేశం చేశారు.రాష్ట్రంలో విద్యారంగంలో ఇప్పటివరకు చేసిన దానితో తాము సంతృప్తి చెందడం లేదన్నారు.

విద్యా వ్యవస్థ సమూల ప్రక్షాళనకు నిర్ణయం
ప్రాథమిక స్థాయి నుంచి యూనివర్సిటీ విద్య వరకు సమూల ప్రక్షాళన చేయాలని నిర్ణయించుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. గత ప్రభుత్వాలు పేదరిక నిర్మూలనకు భూములను, నిధులను పంచితే ఇప్పుడు తమ దగ్గర పంపకానికి భూములు, తగినన్ని నిధులు లేవని ప్రస్తుత కాలంలో పేదరిక నిర్మూలనకు విద్య తప్ప మరొక ఆయుధం లేదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
విద్యా ప్రమాణాలు పెరగలేదన్న సీఎం రేవంత్
రాష్ట్రంలో ప్రతి సంవత్సరం లక్షల మంది విద్యార్థులు చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంటే, ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యార్థులు లక్ష మందికి పైగా ఉత్తీర్ణులు అయితే వారిలో 10 శాతం మందికి కూడా ఉద్యోగాలు రావడం లేదన్నారు. దేశ విదేశాలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు భారీగా అందుబాటులోకి వచ్చినా, విద్య ప్రమాణాలు ఆ స్థాయిలో పెరగలేదని రేవంత్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.
సబ్ కమిటీలుగా ఏర్పడి తెలంగాణా విద్యా పాలసీ తయారు చెయ్యాలన్న సీఎం
ప్రభుత్వ పాఠశాలలలో ప్రతి సంవత్సరం విద్యార్థుల సంఖ్య తగ్గుతోందని, ప్రైవేట్ బడులలో నర్సరీ నుంచి తరగతులు ఉంటే, ప్రభుత్వ పాఠశాలలలో ఒకటవ తరగతి నుంచి తరగతులు ప్రారంభమవుతున్నాయి అని పేర్కొన్న సీఎం రేవంత్ రెడ్డి నర్సరీ నుంచి ప్రభుత్వ పాఠశాలల విద్యా విధానాన్ని రూపొందించాలన్నారు. ప్రాథమిక, ఉన్నత, సాంకేతిక, నైపుణ్య విద్యల పై సబ్ కమిటీలుగా ఏర్పడి ఉత్తమ డాక్యుమెంట్ ను రూపొందించాలన్నారు.
2047 వరకు దిశా నిర్దేశం చేసేలా తెలంగాణ విద్యావిధానం
సిలబస్ వనరుల సమీకరణ విధానం అమలు పైన స్పష్టత అవసరమని ఆయన అన్నారు. రాష్ట్ర విద్యా వ్యవస్థకు 2047 వరకు దిశా నిర్దేశం చేసేలా తెలంగాణ విద్యావిధానం రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. డిసెంబర్ 9న ఆవిష్కరించనున్న తెలంగాణ దార్శనికత పత్రం 2047 లో దీనికి కూడా ఒక అధ్యాయం కేటాయిస్తామని తెలిపారు విద్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి మౌలిక వసతుల మెరుగుదలకు నిధులను కేటాయించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. విద్యాభివృద్ధికి తీసుకునే రుణాలను ఎఫ్ఆర్బీఎం పరిమితి నుంచి తొలగించాలని కేంద్రాన్ని కోరామని కూడా ఆయన పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications