కేసీఆర్.. ఎందుకిలా?: రేవంత్, మోడీకి సవాల్
నల్గొండ: బీఆర్ఎస్, బీజేపీలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవం, నర్సింగ్ కాలేజీలకు శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం గంధంవారి గూడెంలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం రేవంత్ ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమంలో నల్గొండ పాత్ర మరువలేనిదన్నారు. ఉద్యమంలో ఆత్మబలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి నల్గొండవాడేనని సీఎం రేవంత్ అన్నారు.
నల్గొండలో అడుగుపెట్టినప్పుడల్లా సాయుధ రైతాంగ పోరాటం గుర్తుకు వస్తుందన్నారు సీఎం రేవంత్. నిజాంనే పరిగెత్తించారని అన్నారు. 2014 జూన్ 2కు ఎంత ప్రాధాన్యత ఉందో.. 2023 డిసెంబర్ 7కు అంతే ప్రాధాన్యత ఉందన్నారు. తెలంగాణ కోసం పదవీ త్యాగం చేసిన మహానుభావుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. తెలంగాణ వచ్చే వరకు మంత్రి పదవి అవసరం లేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాజీనామా చేశారని ప్రశంసించారు.

కేసీఆర్.. ఎందుకలా?
నల్గొండలో కృష్ణా జలాలు ప్రవహిస్తే ఫ్లోరైడ్ సమస్య తీరుతుందని ప్రజలు భావించారని.. కానీ, కేసీఆర్ పాలనలో నల్గొండ జిల్లా నిర్లక్ష్యానికి గురైందని రేవంత్ అన్నారు. ఉమ్మడి పాలనలో కంటే కేసీఆర్ పాలనలోనే నల్గొండకు అధిక నష్టం జరిగిందని విమర్శించారు. ఏడాదిలో ఏనాడైనా కేసీఆర్ ప్రతిపక్ష నేత పాత్ర పోషించారా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. గెలిస్తే ఉప్పొంగడం.. ఓడితే కుంగిపోవడం కేసీఆర్ స్థాయికి తగదని అన్నారు. గతంలో తాము ఎమ్మెల్యేగా ఓడిపోయినా.. ప్రజల్లో ఉండి ఎంపీగా గెలిచినట్లు తెలిపారు. కేసీఆర్కు ఒక్కటే చెబుతున్నా.. గెలిస్తే అధికారం చలాయిస్తాం.. ఓడిపోతే ఫాంహౌస్కే పరిమతమవుతామనే విధానం సరికాదన్నారు.
ఓ గాలి బ్యాచ్ను కేసీఆర్ ప్రజలపైకి వదిలారని సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ కీలక నేతలను ఉద్దేశించి విమర్శించారు. ప్రభుత్వం ఏ అభివృద్ధి పని చేపట్టినా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. దేశ చరిత్రలో ఏడాది పాలనలో 55 వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనని చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏడాదిలో 55 వేల ఉద్యోగాలు ఇచ్చారా? అంటూ ప్రధాని మోడీని ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 55 వేల ఉద్యోగాలు ఇచ్చారని నిరూపిస్తే ఢిల్లీలో క్షమాపణలు చెబుతానని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.
రాష్ట్ర ప్రభుత్వంపై హైదరాబాద్కు వచ్చిన జేపీ నడ్డా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సరిపోదన్నారు సీఎం రేవంత్. తాము ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని చెప్పారు. కేసీఆర్ కుటుంబం చేసిన అప్పులకు రూ. 65 వేల కోట్ల వడ్డీ కడుతున్నామని తెలిపారు.
రైతులకు శుభవార్త
సంక్రాంతి తర్వాత రైతుభరోసా నిధులు వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సన్నాలను పండిస్తూ రూ. 500 బోనస్ ఇస్తామన్నారు. రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు వేస్తామని చెప్పారు. రైతుల ఖాతాల్లో డబ్బులు పడుతుంటే.. బీఆర్ఎస్ నేతల గుండెలు లబ్డబ్ అని కొట్టుకోవాలని అన్నారు. రైతులు సన్నాలను పండించాలన్నారు. తెలంగాణ రైతులు పండించే సన్నాలనే రేషన్ షాపుల్లో పంపిణీ చేస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో సన్నాలనే భోజనానికి వినియోగిస్తామన్నారు.

ఫోర్త్ సిటీ నిర్మిస్తాం.. మూసీ ప్రక్షాళన చేస్తాం
50వేల ఎకరాల్లో కొత్తగా ఫోర్త్ సిటీని నిర్మిస్తామని సీఎం రేవంత్ చెప్పారు. ఎయిర్ పోర్టుకు కూతవేటు దూరంలో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామని తెలిపారు. ఫోర్త్ సిటీని కట్టే బాధ్యత తనదని చెప్పారు. ఫోర్త్ సిటీలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మూసీ ప్రక్షాళన చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నల్గొండ రింగ్ రోడ్డు పూర్తి చేస్తామన్నారు.
యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం ప్రారంభం
నల్గొండ జిల్లా దామరచర్లలోని యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతికి అంకితం చేశారు. నాలుగు వేల మెగావాట్ల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో 800 మెగావాట్ల యూనిట్-2 నుంచి వాణిజ్య ప్రాతిపదికన ఉత్పత్తి, గ్రిడ్కు అనుసంధానించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు.
అంతకుముందు థర్మల్ స్టేషన్లో ఏర్పాటు చేసిన పైలాన్ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి ఆవిష్కరించారు. ఈ థర్మల్ స్టేషన్లోని 800 మెగావాట్ల యూనిట్-2 వద్ద పూజలు నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను తిలకించారు.
ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్, మంత్రులు దామోదర రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎంపీలు రఘువీర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు థర్మల్ స్టేషన్లో ఏర్పాటు చేసిన పైలాన్ను ఉప ముఖ్యమంత్రి భట్టితో కలిసి ఆవిష్కరించారు. ఈ థర్మల్ స్టేషన్లోని 800 మెగావాట్ల యూనిట్-2 వద్ద పూజలు నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను తిలకించారు.












Click it and Unblock the Notifications