కొండా సురేఖకు షాక్.. అధిష్టానం వద్ద బాంబు పేల్చిన రేవంత్!
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రి కొండా సురేఖ విషయంలో నివురుగప్పిన నిప్పులా ఉన్నారా? కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యల విషయంలో రేవంత్ రెడ్డి ఇంకా సీరియస్ గానే ఉన్నారా? కొండా సురేఖ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఎటువంటి చర్యలు తీసుకోలేదని రేవంత్ రెడ్డి గుర్రుగా ఉన్నారా? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది.
కొండా సురేఖ vs సీఎం రేవంత్ రెడ్డి ఎపిసోడ్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రేవంత్ రెడ్డి పైన కొండ సురేఖ కుమార్తె సుస్మిత చేసినట్టు ఇప్పటివరకు ఎవరు వ్యాఖ్యలు చేయలేదు. కొండా సురేఖ వద్ద ఓ ఎస్ డి గా పనిచేసిన సుమంత్ ను డిస్మిస్ చేసిన రేవంత్ రెడ్డి, కొండా సురేఖ ఇంటి దగ్గర ఉన్న భద్రతను తొలగించడం వంటి చర్యలతో, సురేఖను మంత్రివర్గం నుండి తొలగిస్తారని అందరూ భావించారు.

అధిష్టానంతో రేవంత్ రెడ్డి చర్చ
కొండా సుస్మిత వ్యాఖ్యల తర్వాత అందుకు భిన్నంగా కాంగ్రెస్ అధిష్టానం కొండా సురేఖ విషయంలో సైలెంట్ అయింది. ఆ తర్వాత కొండ సురేఖ రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా కలిసినప్పటికీ, మీడియా సాక్షిగా క్షమాపణలు చెప్పినప్పటికీ రేవంత్ రెడ్డి మాత్రం సురేఖ విషయంలో గుర్రుగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఢిల్లీ వెళ్ళిన రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకునే విషయంలో తనకు స్వేచ్ఛను ఇవ్వకపోవడంపై అధిష్టానంతో చర్చించారు.
ఆమెను మంత్రిగా తొలగించకుండా బుజ్జగిస్తారా?
వివిధ వర్గాల జోక్యంతో పాలనలో ఎదురవుతున్న ఇబ్బందులను హై కమాండ్ దృష్టికి తీసుకు వెళ్లినట్లు తెలుస్తోంది. క్యాబినెట్ మంత్రి కుమార్తె తీవ్ర ఆరోపణలు చేసినప్పటికీ ఆమెను తొలగించకుండా బుజ్జగించడం ముఖ్యమంత్రి కి అధికారం ఉన్నట్టా లేనట్టా అని అధిష్టానాన్ని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో తాజా పరిణామాలను, ముఖ్యంగా కొండ సురేఖ ఎపిసోడ్ లో జరిగిన అంశాలను ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారనేది ఆలోచించాలని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం.
తన సమస్యలపై రేవంత్ రెడ్డి అధిష్టానానికి నివేదిక
మంత్రివర్గంపై తనకు పట్టు లేకపోతే పాలన ఎలా సాగుతుందని రేవంత్ రెడ్డి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. తన సమస్యలపై అధిష్టానానికి నివేదిక సమర్పించిన రేవంత్ రెడ్డి, తనను బలహీనపరిచే విధంగా తనపై వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇవ్వటం పైన అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రిని కూడా పట్టించుకోకుండా వ్యవహరించిన కొందరు మంత్రుల తీరు పైన కూడా ఆయన అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం.
సురేఖపైన అసంతృప్తితోనే సీఎం రేవంత్ రెడ్డి
హై కమాండ్ ఈ పరిస్థితులను గుర్తించి సరిదిద్దాలని, లేదంటే పార్టీకి పునర్ వైభవం కష్టం అన్న అభిప్రాయాన్ని రేవంత్ రెడ్డి వ్యక్తం చేసినట్టు సమాచారం. ఎన్నికల సమయంలో ఉన్న సానుకూలత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలలో లేదని, దానికి కారణాలను హై కమాండ్ అర్థం చేసుకోవాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మొత్తంగా రేవంత్ రెడ్డి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించకపోవడంతో అసంతృప్తితో ఉన్నట్లుగా తాజా పరిణామాలతో అర్థమవుతుంది. కొండా సురేఖ దంపతుల విషయంలో కాంగ్రెస్ లో వ్యవహారం నివురు గప్పిన నిప్పులానే ఉంది.












Click it and Unblock the Notifications