13 ఏళ్ళ బంధానికి తెర :స్టేట్ హోంకు చేరిన అవిభక్త కవలలు వీణా వాణి
తాజాగా అస్ట్రేలియా నుండి వైద్యబృందం, ఎయిమ్స్ వైద్య బృందం కూడ వీరిని పరీక్షించారు.అయినా ఫలితం లేకపోయింది. దరిమిలా అవిభక్త కవలలను విడదీసే ప్రక్రియ ముందుకు సాగలేదు.
హైదరాబాద్ :అవిభక్త కవలలు వీణా వాణిలను స్టేట్ హోం (శిశు విహర్ )కు తరలించారు. ఆదివారం ఉదయం పూటే వీణావాణిలను నీలోఫర్ ఆసుపత్రి నుండి స్టేట్ హోం కు తరలించారు. 13 ఏళ్ళ జన్మదినాన్ని జరుపుకొన్న వీణా వాణిలు నీలోఫర్ తో తమ బంధాన్ని తెంచుకొన్నారు. తాము నీలోఫర్ లోనే ఉంటామని వీణావాణిలు చెబుతున్నారు. అయితే అనివార్య పరిస్థితుల్లో స్టేట్ హొంకు అవిభక్త కవలలను తరలించాల్సి వచ్చిందని అధికారులు చెబుతున్నారు.
అవిభక్త కవలలు వీణావాణిలను విడదీసేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. అయితే ఈ ఫలితాలు ఇంకా ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. తాజాగా విదేశాల నుండి వచ్చిన వైద్యులు అవిభక్త కవలలను పరీక్షించారు. అయితే వారికి శస్త్రచికిత్స చేసి వారిని విడదీస్తే బతికే అవకాశాలు తక్కువగా ఉన్నాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
దీంతో వీణా వాణిలను విడదీయడం కంటే అలానే ఉంచితే ప్రయోజనం ఉంటుందనే అభిప్రాయాన్ని ప్రభుత్వం వ్యక్తం చేస్తోంది. విదేశాల నుండి వైద్య నిపుణులు వచ్చి ఈ అవిభక్త పిల్లలను పరీక్షించారు అయితే వారిని వీడదీసే ప్రయత్నాలు కొలిక్కి రాలేదు.
వీణా వాణిల అనుబంధం నీలోఫర్ తో
అవిభక్త కవలలు వీణా వాణిలు పుట్టినప్పటి నుండి తమ తల్లిదండ్రల వద్ద ఉన్నది చాలా తక్కువ కాలం. నీలోఫర్ ఆసుపత్రిలోనే వారు ఎక్కువ కాలం గడిపారు. వీణా వాణిలకు వైద్య పరీక్షల నిమిత్తం , ఇతర అవసరాల కోసం నీలోఫర్ ఆసుపత్రిలోనే కొనసాగుతున్నారు. పేదరికంలో ఉన్న వీణా వాణిల తల్లిదండ్రులు వారిని సాకలేమనితేల్చిచెప్పారు.దీంతో నీలోఫర్ ఆసుపత్రిలోనే వారు పెరిగారు. 13 ఏళ్ళుగా నీలోఫర్ లో పనిచేస్తున్న ఆయాలు, డాక్టర్లు, వైద్య సిబ్బందితో వీణా వాణిలు కుటుంబసభ్యులుగా కొనసాగుతున్నారు.ఇటీవలనే వారికి ఆసుపత్రి సిబ్బంది 13 ఏళ్ళ పుట్టినరోజు వేడుకలను ఆసుపత్రిలో నిర్వహించారు.ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయంతో వారిని స్టేట్ హోంకు తరలించారు.
నిబంధనల అడ్డంకి కారణంగానే వీణా వాణిలను స్టేట్ హోంకు తరలించారా
13 ఏళ్ళుగా నీలోఫర్ ఆసుపత్రిలోనే ఉన్న వీణా వాణిలను స్టేట్ హోంకు తరలించడం వెనుక నిబంధనలను అధికారులు కారణంగా చూపుతున్నారు. 13 ఏళ్ళ లోపు పిల్లలకు నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స అందించాల్సి ఉంటుంది. అయితే ఇటీవలే 13 ఏళ్ళు పూర్తిచేసుకొన్న వీణా వాణిలను నీలోఫర్ ఆసుపత్రిలో కొనసాగించేందుకు నిబంధనలు అడ్డుగా మారాయి. అయితే ఇటీవల వారిని పరీక్షించిన వైద్యుల బృందాలు ఆపరేషన్ చేసి వారిని విడదీస్తే ప్రమాదమని తేల్చి చెప్పడంతో ప్రభుత్వం కూడ వెనుకడుగు వేసింది.అయితే గత ఏడాది అక్టోబర్ మాసంలోనే అవిభక్త కవలలను స్టేట్ హోంకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. అయితే వైద్య పరీక్షల నిమిత్తం, విదేశాల నుండి వచ్చే వైద్యుల పరీక్షల కోసం వారిని నిలోఫర్ ఆసుపత్రిలోనే ఉంచారు.
నీలోఫర్ లోనే ఉంచాలని కోరిన వీణా వాణి తల్లిండ్రులు
నీలోఫర్ ఆసుపత్రిలోనే ఉంటామని వీణావాణిలు చెప్పారు. ఇదే అభిప్రాయాన్ని వారి తల్లిదండ్రులు కూడ వ్యక్తం చేశారు. స్టేట్ హోంలో కంటే నీలోఫర్ ఆసుపత్రిలోనే తమ పిల్లలను ఉంచాలని తల్లిదండ్రులు మురళి, నాగలక్ష్మి ప్రభుత్వాన్ని కోరారు.నిబంధనల కారణంగా నీలోఫర్ నుండి బదిలీ చేయాల్సిన అనివార్య పరిస్థితులున్నాయని వీణావాణి కుటుంబసభ్యులకు నీలోఫర్ ఆసుపత్రి సిబ్బంది తెలిపారు.
వీణావాణిలను చూసుకొనేది ఎవరు
నిలోఫర్ ఆసుపత్రిలో వీణా వాణిలను చూసుకొనేందుకు ప్రత్యేకమైన సిబ్బంది ఉండేవారు. వారికి ప్రత్యేక గదిని కేటాయించారు. నీలోఫర్ ఆసుపత్రిలో కూడ అవిభక్త కవలలను చూసుకొనేందుకు నీలోఫర్ లో ఉన్న సిబ్బందినే స్టేట్ హోంకు బదిలీ చేశారు.చాలా కాలంగా వీణా వాణిలకు సేవలు చేస్తోన్న సిబ్బందిని డిప్యూటేషన్ పై స్టేట్ హోంకు బదిలీచేసినట్టు నిలోఫర్ ఆర్ ఎంఓ రేణుక తెలిపారు. ఆసుపత్రి సిబ్బంది వారి పర్యవేక్షణకు అందుబాటులో ఉంటారని ఆర్ ఎం ఓ చెప్పారు.