కేసీఆర్కు చేతులెత్తి మొక్కిన కల్నల్ సంతోష్ తండ్రి.., చైనా వస్తువులపై మోదీకి సీఎం కీలక సూచన..
భారత్-చైనా సరిహద్దులో ఇరు దేశాల జవాన్ల మధ్య తలెత్తిన ఘర్షణలో వీర మరణం పొందిన తెలంగాణ బిడ్డ బిక్కుమళ్ల సంతోష్ కుటుంబానికి ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ ఆర్థిక సాయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. రూ.5కోట్లు నగదుతో పాటు సంతోష్ భార్య సంతోషికి గ్రూప్-1 స్థాయి ఉద్యోగం,అలాగే ఇంటి స్థలం ప్రకటించారు. సీఎం ప్రకటించిన ఈ సాయానికి కృతజ్ఞతగా సంతోష్ బాబు తండ్రి ఉపేందర్ చేతులెత్తి నమస్కరించారు. సంతోష్ స్మారక స్థూపంతో పాటు,కాంస్య విగ్రహ ఏర్పాటును కూడా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

విమర్శలకు చెక్ పెట్టిన కేసీఆర్..
నిజానికి కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియలకు హాజరు కాకపోవడంతో సీఎం కేసీఆర్పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే తాజాగా భారీ ఆర్థిక సాయాన్ని ప్రకటించిన సీఎం.. తానే స్వయంగా సంతోష్ ఇంటికి వెళ్లి అందజేస్తానని చెప్పడంతో ఆ విమర్శలకు చెక్ పెట్టినట్టయింది. అలాగే చైనా జవాన్లతో జరిగిన ఘర్షణలో వీర మరణం పొందిన మరో 19 మంది జవాన్లకు కూడా ఒక్కొక్కరికి రూ.10లక్షలు చొప్పున కేంద్ర రక్షణ మంత్రి ద్వారా ఆర్థిక సాయాన్ని కేసీఆర్ ప్రకటించారు.

ఇలాంటి పరిస్థితుల్లో వారికి ప్రాధాన్యం ఇవ్వాలని...
'సరిహద్దుల్లో దేశానికి రక్షణగా నిలుస్తున్న సైనికులకు యావత్ దేశం అండగా నిలవాలి. అమర జవాన్ల కుటుంబాలను ఆదుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం వద్ద నిధులు లేవు. అయినా సరే,ఇతరత్రా ఖర్చులు తగ్గించుకుని.. వారి కుటుంబాలను ఆదుకోవాలి. తద్వారా సైనిక సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తున్నామని చాటాలి. వీర మరణం పొందిన సైనికులకు కేంద్ర ప్రభుత్వం ఎలాగూ సాయం చేస్తుంది. కానీ రాష్ట్రాలు కూడా సహాయ సహకారాలు అందించాలి. అప్పుడే సైనికులకు, వారి కుటుంబాలకు దేశమంతా మా వెంట నిలుస్తుందనే నమ్మకం కుదురుతుంది. సింబల్ ఆఫ్ యూనిటీని ప్రదర్శించాలి.' అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

మోదీకి కేసీఆర్ కీలక సూచనలు...
అమర జవాన్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థిక సాయం ప్రకటించడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన 40 మంది వీర జవాన్లకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. ఇక దేశ ప్రయోజనాల విషయంలో స్వల్పకాలిక,దీర్ఘకాలిక వ్యూహాలతో ముందుకెళ్లాలని అఖిలపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మోదీతో పేర్కొన్నారు. ఇప్పుడు కావాల్సింది రాజనీతి కాదని, రణనీతి అని స్పష్టం చేశారు. భారత్ సుస్థిరంగా ఉండటం, ఆర్థికశక్తిగా ఎదగడం ఓర్వలేకనే చైనా కయ్యానికి కాలు దువ్వుతోందన్నారు. బ్రిటన్ ప్రతిపాదించిన డీ-10 గ్రూపులో కలవాలని.. ఓరాన్ అలయెన్సులో చేరాలని సూచించారు. హువాయ్ కంపెనీ ఎత్తుగడను తిప్పికొట్టాలన్నారు.
Recommended Video

అది తొందరపాటు చర్య అని..
1970 ప్రాంతంలో బంగ్లాదేశ్తో యుద్దంలో ఇందిరాగాంధీని వాజపేయి.. దుర్గామాత అని కొనియాడారని కేసీఆర్ మోదీకి గుర్తు చేశారు. అలాంటి స్ఫూర్తి ఇప్పుడు కావాలని, దేశమంతా కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. యావత్ తెలంగాణ ఈ సమయంలో దేశ ప్రధానికి అండగా ఉంటుందన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ కావాలని మనం కోరుకుంటున్నామని.. కానీ, చైనా మాత్రం అన్య నిర్భర్ భారత్ కావాలని కోరుకుంటోందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భారత్ 142వ స్థానం నుంచి 63వ స్థానానికి ఎదిగిందని అన్నారు. కరోనా తర్వాత చైనా నుంచి ఎంఎన్సీ కంపెనీలు వెళ్లిపోతున్నాయని.. అందులో కొన్ని తెలంగాణలో పెట్టుబడులకు ముందుకొస్తున్నాయని చెప్పారు. ఇవన్నీ చైనాకు నచ్చడం లేదని అన్నారు. చైనా వస్తువుల దిగుమతిపై నిషేధం విధించాలనే డిమాండ్ వ్యక్తమవుతోందని... కానీ అది తొందరపాటు చర్య అవుతుందన్నారు. భారత్ దిగుమతి చేసుకుంటున్న వస్తువులు మన దేశంలోనే తయారు చేసుకునే స్వావలంబన సాధించాలన్నారు. ప్రజలకు సరసమైన ధరల్లో ఆ వస్తువులు దొరకాలని చెప్పారు. ఈ విషయాలపై దృష్టి పెట్టాలని సూచించారు.












Click it and Unblock the Notifications