రూ.2,780 కోట్లు విడుదల చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. టార్గెట్ అదే !
తెలంగాణ లోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు కాంగ్రెస్ సర్కారు తీపికబురు ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం లేటెస్ట్ గా రూ.2,780 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 138 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 2,432 అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. అన్ని మున్సిపాలిటీల్లో పనులు వేగవంతంగా ప్రారంభించాలని సీఎం అధికారులను ఆదేశించారు.
కాగా టెండర్ ప్రక్రియను వెంటనే పూర్తి చేసి, ప్రాధాన్య ప్రాజెక్టులను మొదటిగా ప్రారంభించాలని సూచించారు. ఈ నిధులు ప్రధానంగా రోడ్లు, డ్రైనేజీలు, నీటి సరఫరా, స్ట్రీట్ లైట్లు, పార్కులు, బజార్లు.. ప్రజా సదుపాయాల అభివృద్ధికి వినియోగించనున్నట్లు మున్సిపల్ శాఖ తెలిపింది. ఈసారి విడుదలైన నిధుల్లో కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలు, గ్రామాలు విలీనమైన పట్టణ ప్రాంతాలు ప్రత్యేక ప్రాధాన్యత పొందాయి. ఇటువంటి ప్రాంతాల్లో మౌలిక వసతులు ఇంకా పటిష్ఠంగా లేవని గుర్తించిన ప్రభుత్వం.. ప్రాథమిక అవసరాలైన రహదారులు, మురుగు నీటి వ్యవస్థ, డ్రైనేజీ లైన్లు, వీధి దీపాలు వంటి పనులకు ఎక్కువ నిధులు కేటాయించింది.

అర్బన్ మేకోవర్ లక్ష్యంగా..
తెలంగాణ కోర్ అర్బన్ సిటీ (GHMC పరిధి)ని మినహాయించి.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీలకు ఈ నిధులు కేటాయించారు. పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ పట్టణాలకు కూడా నగరాల మాదిరి మౌలిక వసతులు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ ప్రాజెక్టుకు "తెలంగాణ రైజింగ్ విజన్ 2027" లో భాగమని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. పట్టణ అభివృద్ధి అంటే కేవలం భవనాలు కాదని.. ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల అని స్పష్టం చేశారు. ప్రతి పట్టణం ఒక గ్రోత్ హబ్గా మారాలని అప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.
ఇక ప్రభుత్వం ఈసారి జిల్లాల ప్రాతిపదికగా నిధులు పంపిణీ చేసింది. ప్రతి మున్సిపాలిటీలో ఆర్థిక, జనసాంద్రత ఆధారంగా నిధుల కేటాయింపులు చేపట్టింది. అభివృద్ధి పనుల్లో ఎలాంటి ఆలస్యం జరగకూడదని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ స్పష్టం చేసింది. పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న నీటి సరఫరా లోపాలు, డ్రైనేజీ సమస్యలు, రోడ్ల దుస్థితి వంటి సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఈ నిధులతో ఆ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ భారీ నిధుల కేటాయింపుతో తెలంగాణలోని పట్టణాల రూపురేఖలు పూర్తిగా మారనున్నాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆధునిక మౌలిక సదుపాయాలు, స్మార్ట్ సిటీల మాదిరిగా డిజిటల్ ఫెసిలిటీస్, హరిత పథకాలతో పట్టణాలు కొత్త చైతన్యం సంతరించుకోనున్నాయని అంటున్నారు.












Click it and Unblock the Notifications