కాంగ్రెస్ సిద్ధాంతాలే శ్వాసగా పనిచేసారు.!రాజకీయ విలువలకు నిలువెత్తు నిదర్శనం.!రోశయ్యకు రేవంత్ నివాళి.!
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ కురువృద్ద నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య మరణం పట్ట కాంగ్రెస్ నాయకులు దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. జీవించినంత కాలం కాంగ్రెస్ సిద్ధాంతాలే శ్వాసగా, ధ్యాసగా పని చేసిన కొణిజేటి రోశయ్య మరణం తనను తీవ్రంగా కలచివేసిందని, రాజకీయాలలో విలువలు, నిబద్ధతకు ఆయన మారుపేరని, ఆర్థిక మంత్రిగా 15 సార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టిన రికార్డు కూడా రోశయ్య సొంతమని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్ రెడ్డి గుర్తుచేసుకున్నారు.
ఎమ్మెల్సీగా తొలి సారి చట్టసభలోకి తాను వచ్చినప్పుడు రోశయ్యతో దగ్గర పరిచయం ఏర్పడిందని, పార్టీలతో సంబంధం లేకుండా ప్రజా సమస్యలపై మాట్లాడే విషయంలో ఆయన తనకుకు సలహాలు, సూచనలు ఇచ్చి ప్రోత్సహించేవారని రేవంత్ రెడ్డి గుర్తు చేసారు.

ప్రత్యేక అభిమానం చూపించే వారు..
రోశయ్యలో తనపై ప్రత్యేక అభిమానం కనిపించేదని, పీసీసీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయనను కలిసి ఆశీస్సులు తీసుకున్న సందర్భంలో అనేక విలువైన సూచనలు చేశారని అన్నారు. అలాంటి మంచి నాయకుడు మన మధ్య లేకపోవడం కాంగ్రెస్ పార్టీకి, సమాజానికి కూడా తీరని లోటని, వ్యక్తిగతంగా కూడా ఆయన లేని లోటు తీర్చలేనిదని రేవంత్ అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పార్లమెంట్ సమావేశాల కోసం ఢిల్లీలో ఉన్నరేవంత్ రెడ్డి హైదరాబాద్ కు బయలుదేరినట్టు తెలుస్తోంది. విమానాశ్రయం నుండి రేవంత్ రెడ్డి నేరుగా రోశయ్య నివాసానికి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. రోశయ్య మరణం పై సోనియా, రాహుల్ గాంధీలకు రేవంత్ రెడ్డి సమాచారం ఇచ్చారు.

అలుపెరగని రాజకీయ యోధుడు..
మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్, మాజీ పీసీసీ అధ్యక్షులు రోశయ్య మృతి పట్ల పలువురు కాంగ్రెస్ నాయకులు సంతాపం ప్రకటించారు. మాజీ పీసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య రోశయ్యతో తన్న రాజకీయ ప్రయాణాన్ని నెమరు వేసుకున్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి తదితరులు తమ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. అనేక మంది రాజకీయ నాయకులకు ఆయన ఆదర్శంగా నిలిచారని వారు అభిప్రాయపడ్డారు. అవినీతి మచ్చలేని నిఖార్సయిన రాజకీయ నేత రోశయ్య అని, 15 సార్లు రాష్ట్రంలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఘనత రోశయ్య దని, ఆయన మరణం ఉమ్మడి రాష్ట్రానికి తీరని లోటని నేతలు ఆవేదన వ్యక్తం చేసారు.

రోశయ్యతో ప్రత్యేక అనుబంధం..
మాజీ గవర్నర్, మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మరణం కాంగ్రెస్ పార్టీకి, తెలుగు ప్రజలకు తీరని లోటని కాంగ్రెస్ పార్టీ సినియర్ నేత వి.హనుమంత రావు పేర్కొన్నారు. 40 సంవత్సరాలుగా ఆయనతో ఉన్న అనుభందం, ఆయన తన పట్ల చూపిన ఆప్యాయత మరువలేనిదని అన్నారు. రాజకీయాల్లో ఉన్నత విలువలను పాటిస్తూ, రాజకీయ నాయకుడంటే ఇలా ఉండాలని అందరికీ మార్గదర్శిగా ఉన్న నాయకుడు. ప్రజా సమస్యల పట్ల ఆయనకున్న అవగాహన, వాటిని పరిష్కరించే దిశలో ఆయన చూపిన చొరవ ప్రశంసనీయమన్నారు.

రాజకీయాలు హుందాగా నడిపేవారు..
అందరు ముఖ్యమంత్రులూ ఆయనను తమ విశ్వాసపాత్రుడిగా గౌరవించడము ఆయన నిబద్దతకు, ఉన్నత వ్యక్తిత్వానికి నిదర్శనమని, 2018 అక్టోబర్ 20న చారిత్రాత్మక చార్మినార్ వద్ద జరిగిన రాజీవ్ గాంధీ సద్భావనా యాత్రా స్మారక సమావేశంలో రోశయ్య సద్భావనా అవార్డును, రాహుల్ గాంధీ చేతుల మీద అందుకున్నారన్నారు. బోనాల పండుగకు ప్రతి సంవత్సరము పాత బస్తీ లోని శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి మందిరానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకునే వారని గుర్తు చేసుకున్నారు. ఆయన మృతి పట్ల వారి కుటుంబానికి ప్రగాడ సంతాపము తెలుపుతూ ఆయన ఆత్మకు శాంతి ప్రసాధించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు జీవన్ రెడ్డి.

పొన్నం ప్రభాకర్ దిగ్బ్రాంతి..
మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్, పిసిసి మాజీ అధ్యక్షులు, కాంగ్రెస్ కురువృద్ధుడు కొణిజేటి రోశయ్య ఈరోజు అకాల మృతి పట్ల తన ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేస్తున్నట్టు పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మరియు ఆర్థికమంత్రిగా దేశంలోనే అత్యధికంగా రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టి రికార్డు నెలకొల్పారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మరియు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశారని అన్నారు. రోశయ్య ఆకస్మిక మరణానికి నివాళి అర్పిస్తూ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియచేస్తన్నట్టు, వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియచేసారు పొన్నం ప్రభాకర్.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications