ప్రణయ్ కేసులో కీలక కాంగ్రెస్ నేత అరెస్ట్, మిగతా ప్లాన్ అంతా అతడిదే? ఇంటాబయటా కెమెరాలు
మిర్యాలగూడ: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసులో కాంగ్రెస్ నేత కరీం సహా ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రణయ్ భార్య అమృత తండ్రి మారుతీరావు, అతడి తమ్ముడు శ్రవణ్ కుమార్, మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కరీంతో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ మేరకు పోలీసులు తెలిపారు.
చదవండి: నాన్న అందుకే ఫోన్ చేశాడని ఇప్పుడర్థమైంది: అమృత, ప్రణయ్పై గతంలోను...
ప్రణయ్ని హత్య చేసి నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తమ కూతురును ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కక్షతో ప్రణయ్ను మారుతీరావు హత్య చేయించినట్లుగా పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. కాంగ్రెస్ నేత కరీంను విచారిస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశముంది.
ప్లాన్ అంతా అతనే నడిపించాడని అనుమానం
ప్రణయ్ హత్యకు నల్గొండ జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కరీం సహరించాడని పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. హత్యకు వీరికి సహకరించాడని పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. ప్రణయ్ను హత్య చేయాలని మారుతిరావు నిర్ణయించుకున్న తర్వాత మిగతా ప్లాన్ అంతా కరీం నడిపించినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుఫారీ మాట్లాడటం నుంచి అంతా అతని పర్యవేక్షణలో జరిగిందని అనుమానిస్తున్నారు. అయితే ఇది విచారణలో తేలనుంది.
ప్రణయ్ ఇంటా, లోపల ప్రత్యేకంగా సీసీ కెమెరాలు
ప్రణయ్ను చంపేందుకు ముందస్తుగా పక్కా ప్లాన్ సిద్ధం చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. తనకు ప్రాణాపాయం ఉందని ముందే గుర్తించిన ప్రణయ్ తన ఇంటి లోపల, బయట ప్రత్యేకంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నారు. అనుమానితుల కదలికలను ఎప్పటికపుడు ప్రణయ్ గుర్తిస్తుండేవాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మరోవైపు హత్యకు సుపారీ తీసుకున్న గ్యాంగ్ సభ్యులు నిరంతరం వారి కదలికలను పర్యవేక్షిస్తుండేవారు.
బైక్ పైన అనుసరించిన నిందితుడు
ప్రణయ్ శుక్రవారం తన భార్య అమృతను ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు కారులో బయటికి రాగానే వెంటనే బైక్ పైన నిందితుడు అనుసరించాడు. కారు బయలు దేరిన వెంటనే మూడు నిముషాల వ్యవధిలోనే నిందితుడు వారిని అనుసరించిన విషయం సీసీ కెమెరాలో రికార్డు కాగా దీనిని ఎస్సై నాగరాజు శనివారం సేకరించారు. సుష్మ ఆసుపత్రి సీసీ కెమెరాల్లో కూడా నిందితుడి కదలికలు నమోదయ్యాయి. వీటి ఆధారంగా పక్కాగా నిందితుడు ఆసుపత్రిలోకి ప్రవేశించి అక్కడే మాటు వేశాడు.
తండ్రికి ఫోన్ చేయగానే...
ప్రణయ్ తన భార్య అమృత, తల్లి ప్రేమలతతో కలిసి కారు వద్దకు వస్తుండగానే వెనక నుంచి మాటువేసి కత్తితో నరికాడు. ప్రణయ్ అక్కడికి అక్కడే మృతి చెందాడు. హత్య జరిగిన సమాచారం స్వయంగా అమృత తన తండ్రి మారుతీరావుకు ఫోన్లో సమాచారం ఇవ్వగానే ఆయన తన వాహనంలో అద్దంకి రోడ్డుపై వెళ్లాడు. ఈ విషయం మాడుగుల పల్లి టోల్గేట్ వద్ద సీసీ కెమెరాల్లో రికార్డైంది.