అసలు కేసీఆర్ నెం.1 ఎలా అయ్యారు: అలీ, కవితా! నీ అయ్య జాగీరా: రమ్య
హైదరాబాద్: అధికార తెరాస పైన కాంగ్రెస్ నేతలు వరుసగా విరుచుకుపడుతున్నారు. బుధవారం నాడు మండలి కాంగ్రెస్ పక్ష నేత షబ్బీర్ అలీ కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. నిరుద్యోగ యువతను కేసీఆర్ మోసం చేస్తున్నారని కామారెడ్డిలో అన్నారు.
విద్యారంగంలో తెలంగాణ 29వ స్థానంలో ఉందని, వ్యవసాయంలో 9వ స్థానంలో ఉందన్నారు. అలాంటప్పుడు కేసీఆర్ నెంబర్ వన్ సీఎం అలా అవుతారో చెప్పాలన్నారు.
నీ అయ్య జాగీరు కాదు: కవితకు రమ్య
కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి డీకే అరుణ పైన అధికార తెరాస ఎంపీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యల పైన కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రమ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. అరుణ పైన కవిత చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు.
తమ పార్టీ నాయకుల పైన ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఖబడ్దార్ అని రమ్య హెచ్చరించారు. తెలంగాణ మీ అయ్య జాగీరు కాదన్నారు. డీకే అరుణ అంటే కవితకు, తెరాసకు ఎందుకు అంత భయమో చెప్పాలని ఎద్దేవా చేశారు. అత్తవారింటి పేరు చెప్పుకోలేని కవిత తండ్రి ఇంటి పేరును బ్రాండ్గా ఉపయోగించుకుంటున్నారని దుయ్యబట్టారు.
బతుకమ్మ పేరు చెప్పుకొని దేశాలు తిరగడం కాదని, రాష్ట్రంలో మహిళలకు జరుగుతున్న వివక్షత పైన మాట్లాడాలని కవితకు హితవు పలికారు. ఇటీవల మహిళా ఉద్యోగుల పైన దాడులు పెరిగాయన్నారు. ఈ దాడులను అరికట్టడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందన్నారు.