సీఎం కేసీఆర్ చేసిన ఉద్యోగులు కుక్క తోక వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ ఫైర్
ప్రభుత్వ ఉద్యోగుల తీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పెను దుమారం రేపాయి. ఆదివారం అసెంబ్లీలో ప్రభుత్వ ఉద్యోగుల అంశంపై సీఎం కేసీఆర్ మాట్లాడారు. ప్రభుత్వాన్ని ఉద్యోగులు డిక్టేట్ చేయలేరని ఉద్ఘాటించారు. ప్రభుత్వం నిర్ధేశించిన పనులను ఉద్యోగులు చేయాల్సిందేనని చెప్పిన సీఎం కేసీఆర్ ''కుక్క తోకను ఊపుతుందా? లేక తోక కుక్కను ఊపుతుందా?'' అంటూ ఉద్యోగుల తీరుపై వ్యాఖ్యలు చేశారు.
సింగరేణి బొగ్గు గనుల్లో కొనసాగుతున్న సమ్మె .. నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి
ఇక ఈ వ్యాఖ్యలపై ఉద్యోగులు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆందోళనలు చేస్తుంటే సమస్యలు పరిష్కరించకపోగా 'కుక్క.. తోక' అని మాట్లాడతారా? తొలగిస్తామని బెదిరిస్తారా? అంటూ సీఎం కేసీఆర్పై మండిపడ్డారు. ఎంప్లాయ్ ఫ్రెండ్లీ సర్కారంటే ఇదేనా? అని ప్రశ్నించిన టీచర్స్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సుదీర్ఘ కాలం ఉద్యోగులు సైతం సకల జనుల సమ్మె చేసిన విషయం మరచిపోవద్దన్నారు. ఆ ఉద్యమానికి నాయకత్వం వహించిన ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగుల హక్కులను కాలరాస్తూ నియంతగా వ్యవహరించటం సరికాదన్నారు. అనుచిత వ్యాఖ్యలను సీఎం ఉపసంహరించుకోవాలని ఉప్పాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
ఇక తాజాగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఉద్యోగులపై కెసిఆర్ వి అనుచిత వ్యాఖ్యలు అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పని చేసిన ఉద్యోగులు.. కేసీఆర్కు కుక్కతోకతో సమానమా? అంటూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. ఉద్యోగులపై ఆదివారం అసెంబ్లీలో సీఎం చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులపై ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
కేసీఆర్ తన మాటల గారడీ ఆపాలన్నారు. ఇప్పటికి మూడు లక్షల కోట్లు అప్పు చేశారని ఇదేనా బంగారు తెలంగాణ అని ప్రశ్నించారు. కేసీఆర్ను ఆకాశం నుంచి భూమి మీదకు దించాలని ప్రజలను కోరిన పొన్నం ప్రభాకర్ కేసీఆర్ సర్కారు తీరుపై విరుచుకుపడ్డారు. కరీంనగర్ ను లండన్, న్యూయార్క్ చేయాల్సిన అవసరం లేదని కనీస సౌకర్యాలు కూడా లేకుండా ఇబ్బందులు పడుతున్నారని అవి కల్పిస్తే చాలు అన్నారు. ఉద్యోగులను ఉద్దేశించి నోటికి ఎంతొస్తే అంత మాట్లాడిన సీఎం కేసీఆర్ కు ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు.