సీఎం కేసీఆర్ హత్యకు కుట్ర.. కొడుకు కేటీఆరే చంపుతాడు.. రేవంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. మామూలుగానే వివాదాలతో సహవాసం చేసే రేంవత్ రెడ్డి.. మున్సిపల్ ఎన్నికల ప్రచారం భాగంగా హైదరాబాద్ లోని గడ్డి అన్నారంలో మీటింగ్ దగ్గర మాట్లాడుతూ.. కేసీఆర్ ఫ్యామిలీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. రేవంత్ పై చట్టపరమైన చర్యలు తీసుకునే దిశగా అధికారపార్టీ యోచిస్తున్నట్లు సమాచారం.
ముఖ్యమంత్రి మార్పు..
ఆరేండ్ల టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అన్ని విధాలుగా ముందుకెళ్లిందని, రాష్ట్రానికి జీవనాడిగా భావిస్తోన్న కాళేశ్వరం ప్రాజెక్టు దాదాపు పూర్తికావడం, రైతులతోపాటు సమాజంలోని అన్ని వర్గాలకూ అవసరమైన సంక్షేమ పథకాలు అందుతుండటంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతృప్తిగా ఉన్నారని, ఇంత సంతోషకరమైన సమయంలోనే.. కొడుకు కేటీఆర్ ను సీఎం పీఠంపై కూర్చోబెట్టి కేసీఆర్ రిటైర్ కావాలనుకుంటున్నారని కొద్ది రోజులుగా దాదాపు అన్ని పేపర్లు, టీవీల్లో కథనాలు వచ్చాయి. మీడియా కథనాలను ఉటంకిస్తూ కేసీఆర్ ఫ్యామిలీపై రేవంత్ అభ్యంతరకర కామెంట్లు చేశారు.
కొడుకుతోనే సీఎంకు ముప్పు
‘‘రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి కేటీఆరే అంటూ కేబినెట్ మంత్రులు ఒకరితర్వాత ఒకరు మాట్లాడుతున్నారు. మీడియాలో కూడా పెద్ద ఎత్తున కథనాలొస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటిదాకా టీఆర్ఎస్ గానీ, సీఎంవోగానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీన్నిబట్టి కొన్ని విషయాలు అర్థమవుతున్నాయి. సీఎం కేసీఆర్ ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది. సీఎం సీటు కోసం కేటీఆరే తన తండ్రిని చంపేసే అవకాశాలున్నాయి. ఎం జరుగనుందోననే టెన్షన్ అంతటా నెలకొంది''అని రేవంత్ అన్నారు.
ఇంటి నుంచి గెంటేయండి..
సీఎం కేసీఆర్ ను కేటీఆర్ ఎలా చంపుతాడో కూడా రేవంత్ పూసగుచ్చినట్లు వివరించారు. ‘‘తండ్రికొడుకులిద్దరూ ప్రస్తుతం క్యాంప్ ఆఫీసులో కలిసే ఉంటున్నారు. ఏ అర్థరాత్రో కేటీఆర్ లేచి.. తండ్రి బెడ్ రూమ్ కి వెళ్లి.. దిండుతో ముఖంపై అదిమి చంపేస్తాడు. ఆ ప్రమాదాన్ని నివారించాలంటే ముందుగా కేటీఆర్ ను ఇంట్లో నుంచి గెంటేయాలి‘‘అని చెప్పారు.
హరీశ్ తో ప్రమాదం తప్పింది..
టీఆర్ఎస్ లో అంత్గత వర్గపోరు తీవ్రస్థాయిలో కొనసాగుతోందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ అన్నారు. మొన్నటిదాకా సీఎం కేసీఆర్ కు ఇద్దరి నుంచి ప్రాణహాని ఉండేదని, సీఎం సీటు కోసం అల్లుడు హరీశ్ రావు, కొడుకు కేటీఆర్ తన్నుకునేవారని, కేటీఆర్ కు మద్దతుగా మంత్రులు మాట్లాడటాన్నిబట్టి హరీశ్ తో ప్రమాదం తప్పిందనే భావించాలన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు చావుదెబ్బ తప్పదని, మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని రేవంత్ రెడ్డి చెప్పారు.