కర్ణాటక ఇచ్చిన ఉత్సాహం.. జోష్ లో ఉన్న కాంగ్రెస్..
మొన్నటి వరకు ఆ పార్టీలో నిర్వేదం.. నిరుత్సాహం.. నిట్టూర్పు.. నిస్తేజం.. నైరాశ్యం కొట్టొచ్చినట్టు కనపడేది. తెలుగు రాష్ట్రాల్లో మంచి నాయకత్వం, అందుకు తగ్గట్టు పార్టీ క్యాడర్ పటిష్టంగా ఉన్నా ఏదో తెలియని వెలితి, ఆందోళన పార్టీని పట్టి పీడిస్తుండేది. ప్రజాకార్యక్రమాల రూపక్పనలో కూడా పెద్దగా ఉత్సహం చూపించేవారు కాదు రాష్ట్ర నాయకులు. పక్క రాష్ట్రాల ఓటమి ప్రభావంతో మరింత క్రుంగిపోయేవారు. ఎందుకు ఇంతగా బలహీనపడుతున్నామని లోలోపల కుమిలిపోయే వారు ఆ పార్టీ నేతలు. కాని.., ఒకే ఒక్క రాష్ట్రంలో పార్టీ పూర్వవైభం దిశగా అడుగులు వేయగానే మెరుపులా మెరిసింది.. వంద సునామీల బలంతో చెలరేగి పోతానంటోంది ఆపార్టీ.. ఏదా పార్టి, ఏంటా కథ అనుకుంటున్నారా.. ఐతే ఈ స్టోరీ చూడండి.

కాంగ్రెస్ పార్టీలో ఉరకలేస్తున్న ఉత్సాహం..
కర్ణాటక అందించిన విజయంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రేస్ పార్టీ ఉత్సాహంతో ఉరకలేస్తోంది. పార్టీ గెలుపోటములపైన ఇప్పటివరకు ఉన్న సందేహాలను పటాపంచలు చేస్తూ క్షేత్ర స్థాయిలో పార్టీ సంస్థాగత బలోపేతానికి నడుం బిగిస్తున్నారు నాయకులు. ఒక్క గెలుపు వంద మలుపులకు కారణం కావాలంటూ., అందివచ్చిన అవకాశాన్ని ఆసరాచేసుకుని మరిన్ని విజయాలకు బాటలు వేసుకుంటామంటోంది తెలుగు రాష్ట్రాల కాంగ్రేస్ నాయకత్వం. అందుకు తగ్గట్టుగానే కార్యాచరణ రూపొందించుకుని ప్రజల మద్యకు వెళ్లాలని ప్రణాళిక రచిస్తున్నారు ఇరు పార్టీల నేతలు. తెలంగాణాలో టీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఇచ్చి న వాగ్ధానాలను ఎంతవరనకు నెరవేర్చింది అనే అశం పట్ల కార్యాచరణ రూపొందిస్తున్నారు తెలంగాణ నేతలు. గులాబీ పార్టీ మేనిఫెస్టో లో పొందు పరిచిన హామీలు ఎంతవరకు అమలు చేసారు అనే అంశాన్ని ప్రజల మద్యకు తీసుకువెళ్లేందుకు ప్రణాళిక రచిస్తున్నారు.

ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడాలని నిర్ణయం..
వెనుకబడిన వర్గాలకు మూడెకరాల సాగు భూమి, రైతు రుణమాఫీ, కేజీ టు పీజి ఉచిత విద్య, డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలు, నిరుద్యోగ యువతకు ఉపాది అవకాశాలు, విద్యార్థుల బోదనా రుసుము, వైద్యరంగం లో తలెత్తిన వివాదాలు, సాగు, త్రాగు నీటి కల్పన, తదితర అంశాల పట్ట ప్రజల్లో చైతన్యం తీసుకు రావాలని నిర్ణయించారు కాంగ్రెస్ నాయకులు. అంతే కాకుండా తెలంగాణా ప్రభుత్వం పనులకు కాకుండా ప్రకటనలకు ఇస్తున్న ప్రాముఖ్యతను కూడా ప్రజలకు వివరించలనుకుంటున్నారు. మిగులు బడ్జెట్ లో ఉన్న తెలంగాణ రాష్ట్రం ఎందుకు అప్పులు చేయాల్సివస్తుందో కూడా ప్రజలకు వివరించాలనుకుంటున్నారు. అంతే కాకుండా ఇటీవల టీ సర్కార్ ప్రవేశ పెట్టిన రైతుబందు పథకం పట్ల రైతుల్లో నెలకొన్న అసంత్రుప్తిని కూడా బట్టబయలు చేయాలని నిర్ణయించారు నాయకులు. తెలంగాణాలో ఇప్పటి వరకు చూసీ చూడనట్టు వ్యవహరించామని, ఇకముందు తెలంగాణ ప్రభుత్వ అసమర్థ విధానాలను ప్రతిపక్ష పార్టీగా ఎండగడతామని కాంగ్రెస్ నాయకులు తెగేసి చెప్తున్నారు.

పాదయాత్రల కోసం ఉత్సాహం.. ప్రజా చైతన్యానికి సై..
పార్టీలోని కొంతమంది నాయకులు పాదయాత్ర ద్వారా ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని భావిస్తున్నారు. పాత జిల్లాల ప్రకారం గజ్వేల్ నుండి ఎమ్మెల్యే డీకె అరుణ జిల్లా వ్యాప్తంగా పాదయాత్ర చేసేందుకు ఏర్పాట్లు చేసుంకుంటున్నారు. అనుమతి కోసం అదిష్టానానికి ఆర్జీ కూడా పెట్టుకున్నారు. ఇక మదిర నుండి పాదయాత్ర మొదలు పెట్టి ఖమ్మం జిల్లా మొత్తం కవర్ చేసేందుకు సీనియర్ నేత భట్టి విక్రమార్క రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఇటు కరీంనగర్ జిల్లా నుండి పొన్నం ప్రభాకర్ కూడా పాదయాత్ర చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో సంచలనంగా మారిన రేవంత్ రెడ్డి సైతం తెలంగాణా వ్యాప్తంగా పాదయాత్ర చేసేందుకు రెడీ అవుతున్నారు. అదిష్టానం నుండి అనుమతి కోసం సదరు నేతలు ఎదురు చూస్తున్నారు. అదికార పార్టీ అసమర్థ విధానాలను ఎండగట్టి కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం దిశగా ప్లాన్ చేస్తున్నారు. ఇదంతా కర్ణాటక రాష్ట్రం అందించిన ఉత్సాహమని కాంగ్రేస్ పార్టీలోని కొందరు సీనియర్ నేతలు అభివర్ణిస్తున్నారు.

ఇరు రాష్ట్రాల్లో బలోపేతం దిశగా అడుగులు, ఇది కర్ణాటక అందిచిన ప్రేరణ..
ఇక ఏపిలో కూడా కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాలకు పదును పెడుతోంది. ప్రత్యేక హోదా సాదించండంలో చంద్రబాబు నాయుడు ఎందుకు తాత్సారం చేశారో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు సాదించలేని అంశాలను ఫోకస్ చేస్తూ ప్రజల్లోకి వెళ్లేందుకు కార్యాచరణ రూపొందిచుకుంటున్నారు ఏపి కాంగ్రెస్ నేతలు. విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను కూడా అమలు చేకయకుండా కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేస్తుంటే ప్రధాని నరేంద్ర మోదీని బాబు ఎందుకు నిలదీయలేదని ప్రశ్నిస్తున్నారు. చివరి నిమిషంలో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం నుండి వైదొలిగితే ప్రయోజనం ఉండదని చెప్తున్నారు. అంతేకాకుండా స్థానికంగా తలెత్తుతున్న శాంతి భద్రల అంశం పై కూడా స్పందిస్తామని ఏపి కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మొత్తానికి కర్ణాటక రగిల్చిన విజయం ద్వారా స్పూర్తి పొందిన తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ నాయకులు రెట్టింపు ఉత్సాహంతో పని చేయాలని నిర్ణయించారు. వివిధ కార్యక్రమాలతో ప్రజా క్షేత్రంలోకి దూసుకెళ్లాలనుకుంటున్న కాంగ్రెస్ నేతలను ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి.












Click it and Unblock the Notifications