నేను వెళ్లను.. మీరు గెంటేయండి..?
చిన్న నాయకులుగా పార్టీలోకి ప్రవేశించి ప్రతి ఒక్కరినీ అక్కున చేర్చుకొని పదవులు కట్టబెట్టి పెద్ద నాయకులుగా తీర్చిదిద్దుతుంది. కన్నతల్లి లాంటి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆదుకోవడం ఇటువంటివారి కనీస బాధ్యత. అలా జరగనప్పుడు పార్టీ శ్రేణులనుంచే కాకుండా అన్నివర్గాల నుంచి వారిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. సరిగ్గా ఇటువంటి సందర్భాన్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎదుర్కొంటున్నారు.

మునుగోడులో కాంగ్రెస్ గెలవదు?
మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవదని, తాను తిరిగినా 10వేల ఓట్లు వస్తాయని, తన తమ్ముడే గెలుస్తాడంటూ ఆస్ట్రేలియా పర్యటనలో వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. దీంతో వీటిపై వివరణ ఇవ్వాలంటూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నోటీసులు జారీచేసింది. అయితే పార్టీ నోటీసులతో సరిపెడుతుందా? కఠిన చర్యలు తీసుకుంటుందా? అనే మీమాంస కాంగ్రెస్ శ్రేణుల్లో నెలకొంది. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ పార్టీ ప్రాభవాన్ని తగ్గించేందుకు, బలహీనపరిచేందుకు ఆయన ప్రయత్నిస్తున్నాడని కాంగ్రెస్ సీనియర్ నేతలు మండిపడుతున్నారు.

అధిష్టానానికి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు
ఇప్పటికే కోమటిరెడ్డిపై అధిష్టానానికి తామరతుంపరలుగా ఫిర్యాదులు అందుతున్నాయి. షబ్బీర్ అలీపై అభాండాలు వేయడంతోపాటు హైకమాండ్ కు లేఖ రాయడంతోనే ఆయన పార్టీలో ఉంటారా? లేదా? అనేది స్పష్టమవుతోందని చెబుతున్నారు. ఆయన సిట్టింగ్ ఎంపీగా ఉన్నారని, ప్రస్తుతం కోమటిరెడ్డిపై వేటు వేస్తే ఒక ఎంపీని కోల్పోయినట్లవుతుందనే భావనతో అధిష్టానం ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తోందని, అందుకే సంజాయిషీ ఇవ్వాలంటూ నోటీసులు జారీచేసిందని చెబుతున్నారు. ఇతరత్రా పరిస్థితుల్లో అయితే కచ్చితంగా ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించేవారని కాంగ్రెస్ నేతలు వెల్లడించారు.

సానుభూతితో మంచి పేరు తెచ్చుకోవాలని..
ఈ విషయంపై వెంకటరెడ్డికి అవగాహన ఉంది కాబట్టే ఇతర నేతలపై విమర్శలు చేయడంతోపాటు అందరిముందు పార్టీని కించపరిచేలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తుతున్నారు. పార్టీ నుంచి ఆయనంతట ఆయనగా వెళ్లే ఉద్దేశం లేదని, బహిష్కరిస్తే ఆ సానుభూతితో తనకు మంచి పేరు వచ్చేలా చూసుకోవచ్చని ఆలోచిస్తున్నారని చెబుతున్నారు. అయితే అధిష్టానం తొందరపడకుండా అలాగే ఉంటే ఓర్పు నశించి ఆయనే వెళ్లిపోతారని, అధిష్టానం తొందరపడి ఆయనపై చర్యలు తీసుకుంటే దాన్ని తన ప్రచారానికి ఉపయోగిస్తారని, మరోవైపు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర జరుగుతున్న సమయంలో ప్రజల దృష్టి అటువైపునకు మళ్లుతుందంటున్నారు. తెలంగాణలో రాహుల్ పాదయాత్ర ముగియగానే చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.












Click it and Unblock the Notifications