కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ దాడి రగడ; నేతల గృహనిర్బంధం; భగ్గుమన్న రేవంత్ రెడ్డి!!
కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు జరిగే వార్ రూమ్ లో పోలీసులు సోదాలు చేయడాన్ని నిరసిస్తూ టిపిసిసి తెలంగాణ వ్యాప్తంగా ఆందోళన బాట పట్టింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేడు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ వార్ రూం పైన దాడిని ఖండిస్తూ అన్ని మండల కేంద్రాల్లో నిరసన చేపట్టాల్సిందిగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దీంతో నేడు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళనను పోలీసులు అడ్డుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులను హౌస్ అరెస్టు చేస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ పై దాడి.. భగ్గుమన్న రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ వ్యూహకర్త కార్యాలయం పైపోలీసుల దాడి, సీజ్ చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ లో కాంగ్రెస్ వ్యవహారాలు జరుగుతాయి, ఇక్కడ పోలీసుల పెత్తనం ఏంటి అని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తుంటే పోలీసులు ఇలా వ్యవహరించడం దారుణం అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ వ్యవహారాల్లో పోలీసులు తల దూరిస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ నిర్బంధం ఇలాగే కొనసాగితే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఆందోళన నేపధ్యంలో ముఖ్య నాయకుల హౌస్ అరెస్ట్ లు
ఇక ఇదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్ వార్ రూమ్ పైన పోలీసుల దాడికి నిరసనగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ వద్ద నిరసన వ్యక్తం చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో నిరసనలు,ముఖ్యమంత్రి దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్య నాయకులను పోలీసులు గృహ నిర్బంధం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మల్లు రవి, రోహిణ్ రెడ్డి, హరివర్ధన్ రెడ్డి, మల్ రెడ్డి రాంరెడ్డి తదితరులను గృహ నిర్బంధం చేశారు.

ప్రతిపక్షాలపై నిర్బంధం.. ప్రజాస్వామ్యం ఖూనీ చెయ్యటమే: మల్లు రవి
దీంతో పోలీసుల తీరును కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలపై నిర్బంధం, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని మల్లు రవి పేర్కొన్నారు. తమకు నిరసన వ్యక్తం చేసే హక్కు ఉందని, ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలలో పోలీసులు దౌర్జన్యం చేయడం ఎటువంటి ప్రజాస్వామ్యమో చెప్పాలని మల్లు రవి ప్రశ్నించారు. ఇలా చేస్తే ప్రజలు తిరగబడతారని మల్లు రవి స్పష్టం చేశారు.

కాంగ్రెస్ వార్ రూమ్ పై దాడిపై మండిపడిన మణిక్కం ఠాగూర్
మరోవైపు ఈ ఘటనపై టీ కాంగ్రెస్ ఇన్చార్జి మణిక్కం ఠాగూర్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టిన ఆయన తెలంగాణ కాంగ్రెస్ వార్ రూమ్ పై దాడి చేయడం, 50 కంప్యూటర్లను స్వాధీనం చేసుకోవడం పూర్తిగా హేయమైన చర్య అని మండిపడ్డారు. ప్రొసీజర్ లేకుండా తమ సిబ్బందిని పోలీసులు అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టు వారెంటే ఇవ్వకుండా 41a crpc నోటీసులు ఇవ్వకుండా పూర్తిగా నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొన్నారు. ఈ అక్రమాలకు మంత్రి కేటీఆర్, సి పి సీవీ ఆనంద్ బాధ్యత వహించాలని ఆయన పేర్కొన్నారు. తాను కూడా ప్రస్తుతం అదే పోస్ట్ చేస్తానని దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలని సవాల్ విసిరారు.












Click it and Unblock the Notifications