కేసీఆర్ నిజస్వరూపం అదే.. : సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
రాష్ట్రంలో సభలు నిర్వహించుకునేందుకు ఆర్ఎస్ఎస్,ఎంఐఎంలకు అనుమతినిచ్చే ముఖ్యమంత్రి కేసీఆర్.. కాంగ్రెస్ పార్టీ ర్యాలీ చేసుకుంటామంటే మాత్రం ఎందుకు అనుమతివ్వడం లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని
ఎన్ఆర్సీ,సీఏఏలకు వ్యతిరేకంగా గాంధీభవన్ నుంచి ట్యాంక్బండ్ అంబేడ్కర్ విగ్రహం వరకు శాంతియుత ర్యాలీ చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిపారు.
అయితే కేసీఆర్ ట్రాఫిక్ సమస్యను కారణంగా చూపుతూ అందుకు అనుమతి నిరాకరించారని అన్నారు. ట్రాఫిక్కి ఇబ్బంది తలెత్తకుండా ఏ మార్గంలో అనుమతిచ్చినా ర్యాలీ చేసుకుంటామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రికి లేఖ రాసినట్టు చెప్పారు.

ఎంఐఎం,ఆర్ఎస్ఎస్లు రెండు బీజేపీకి మద్దతుదారులేనని భట్టి విమర్శించారు. కాంగ్రెస్ అంటే కేసీఆర్కు భయమని,అందుకే అనుమతి ఇవ్వడం లేదని మండిపడ్డారు. టీఆర్ఎస్,ఎంఐఎం ఇద్దరి ఎజెండా బీజేపీ రావడమేనని.. దానికోసం వెనక ఉండి పనిచేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ నిజస్వరూపం అదేనని ఆరోపించారు.
ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఆందోళన రీత్యా కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజలకు ఒక సందేశం ఇవ్వాల్సిన అవసరం ఉందని, దానికోసం ర్యాలీ చేపడుతామని అడిగితే అనుమతి ఇవ్వడం లేదని అసహనం వ్యక్తం చేశారు. కేసీఆర్ అనుమతిచ్చినా,ఇవ్వకపోయినా తిరంగా ర్యాలీ చేసి తీరుతామన్నారు.
దేశ ప్రజలంతా కలిసిమెలిసి బతకాలన్న సందేశాన్ని ర్యాలీ ద్వారా ప్రజల్లోకి పంపిస్తామన్నారు.












Click it and Unblock the Notifications