రేవంత్ రెడ్డిని ఒంటరివాడిని చేసే వ్యూహంలో కాంగ్రెస్ అసంతృప్తనేతలు.. అదునుచూసి దెబ్బ; కాంగ్రెస్ లో కల్లోలం!!
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ముసలం చోటు చేసుకుంది. నిన్న మొన్నటి వరకూ కాంగ్రెస్ పార్టీలో కి వలసలు కొనసాగుతున్నాయి అని అందరూ భావిస్తే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ తో అది కాస్త రివర్స్ అయింది. ఒక్కసారిగా రేవంత్ రెడ్డి పై వ్యతిరేకత కాంగ్రెస్ అసంతృప్త నేతలలో పెల్లుబుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టార్గెట్ గా కాంగ్రెస్ లో పెల్లుబుకున్న అసంతృప్తి
తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వ్యూహాత్మకంగా ముందుకు సాగుతుంటే కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. కాంగ్రెస్ పార్టీలో నేతలు అంతర్గత పోరులో పార్టీని నాశనం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి కి అవకాశం కల్పించినప్పటినుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలా మంది సీనియర్ నాయకులలో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
అనేక మార్లు బాహాటంగానే రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని విమర్శించిన పరిస్థితులు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు చాలామంది టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన రేవంత్ రెడ్డికి టీపీసీసీ అధ్యక్షుడిగా అవకాశం ఇవ్వడాన్ని తప్పుబట్టారు.
పార్టీకి కీలక నేతల రాజీనామా... కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీలో ఉండటం కష్టమే
కోమటిరెడ్డి వెంకటరెడ్డి బాహాటంగానే రేవంత్ రెడ్డికి టీపిసిసి ఇవ్వడంపై మండిపడ్డారు. గతంలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీకి దాదాపు రాజీనామా చేసినంత పని చేశారు. ఆతర్వాత సీనియర్ల బుజ్జగింపుతో పార్టీలో కొనసాగుతున్నారు. ఇక తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ పార్టీకి రాజీనామా చేశారు.
ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రేవంత్ రెడ్డి నాయకత్వంలో పని చేయడం కష్టమేనని ఆయన వ్యాఖ్యలు పదేపదే స్పష్టం చేస్తున్నాయి. రేవంత్ రెడ్డి ని టార్గెట్ చేస్తూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ఆయన కూడా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్తారు అన్న భావనకు కారణమవుతున్నాయి.
రేవంత్ రెడ్డిపై నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి .. అదును చూసి ఇప్పుడు ఇలా ..
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ తర్వాత రేవంత్ రెడ్డి నాయకత్వం పట్ల అసంతృప్తి ఉన్న ఒక్కొక్కరూ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చి బీజేపీ బాట పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం రేవంత్ రెడ్డి ని ఒంటరి వాడిని చేసి టీపిసిసి అధ్యక్షుడు విషయంలో కాంగ్రెస్ అధినాయకత్వం తీసుకున్న నిర్ణయం తప్పు అని చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు అసంతృప్త నేతలు. అందుకే అదునుచూసి ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్ బై చెబుతూ రేవంత్ రెడ్డి ని టార్గెట్ చేస్తున్నారు. ఇదే సమయంలో అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారు.
పీకల్లోతు కష్టాల్లో కాంగ్రెస్ .. రేవంత్ రెడ్డి టార్గెట్ గా అసంతృప్తుల వ్యూహం
అసలే పీకల్లోతు కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం తెలంగాణ రాష్ట్రంలోని పరిస్థితులపై ఏం నిర్ణయం తీసుకోవాలో అర్థం కాని దిక్కుతోచని స్థితిలో ఉంది. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్న చందంగా రాష్ట్రంలో నేతల మధ్య పరిస్థితులు ఉండడం కాంగ్రెస్ అధినాయకత్వానికి తలనొప్పిగా మారుతోంది. కాంగ్రెస్ పార్టీ నేతలలో సర్దుకుపోయే మనస్తత్వం లేకపోవడం, కలిసి పని చేయాలన్న ఆలోచన లేకపోవడం ఆ పార్టీకి పెద్ద మైనస్ గా కనిపిస్తుంది. మొదటి నుంచి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న వారు ప్రస్తుతం తమ రాజీనామాల బెదిరింపులతో టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని మార్చాలనే సంకేతాన్ని అధినాయకత్వానికి పంపిస్తున్నారు.
ఒకడుగు ముందుకు వేస్తే నాలుగడుగులు వెనక్కు .. ఉనికి కాపాడుకునే పనిలో కాంగ్రెస్
తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీని, సీఎం కేసీఆర్ ను ధీటుగా ఎదుర్కోవాలంటే రేవంత్ రెడ్డి వంటి నాయకుడు అవసరమని భావించి, కాంగ్రెస్ అధినాయకత్వం రేవంత్ రెడ్డికి పార్టీ బాధ్యతలను అప్పగించింది. పార్టీని ప్రజాక్షేత్రంలోకి దూకుడుగా ముందుకు తీసుకువెళ్లాలని సూచించింది. ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి కొంత మేరకు ఆ విషయంలో సక్సెస్ అయినట్టుగా కనిపించింది.
రాహుల్ గాంధీని రాష్ట్రానికి తీసుకువచ్చి సభలు నిర్వహించడం కాంగ్రెస్ పార్టీకి మంచి మైలేజ్ ను తీసుకు వచ్చింది. దీంతో కొందరు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరికొందరు కాంగ్రెస్ తీర్థం తీసుకోవడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సమయంలో జరిగిన తాజా పరిణామాలు కాంగ్రెస్ పార్టీని మరోమారు ఉనికిని కాపాడుకునే పరిస్థితికి నెట్టాయి అంటే ఎలాంటి అతిశయోక్తి లేదు.