'బాబు పిలవకముందే కెటిఆర్ ఉత్సాహం, ఓటుకు నోటు మాటేమిటి, పెద్దోడివా'
హైదరాబాద్: నిన్నటి వరకు ఏపీ సీఎం చంద్రబాబు పైన అంతెత్తు ఎగిరిపడ్డారని, ఇప్పుడేమో అమరావతి శంకుస్థాపనకు వెళతామంటున్నారని, అసలు పిలుపు రాకముందే ఎందుకు అంత ఉత్సాహం అని కాంగ్రెస్ నేతలు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కెటిఆర్ పైన ధ్వజమెత్తుతున్నారు.
ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు నుంచి పిలుపు రాకముందే అమరావతి వెళ్తామంటున్న కెటిఆర్.. ఓటుకు నోటు కేసు ఏమైందో చెప్పాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ నేత జానా రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిల పైన కెటిఆర్ వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు.
ఓ వైపు కెసిఆర్.. జానాను పొగుడుతుంటే, కెటిఆర్ మాత్రం నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కెటిఆర్ తీరు మార్చుకుంటే మంచిదని హితవు పలికారు. కెటిఆర్ తన స్థాయిని మించి మాట్లాడుతున్నారని కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు.

జానా రెడ్డిని విమర్శించడం ద్వారా మంత్రి కెటిఆర్ తనకు తానే పెద్దోడిని అని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న కెటిఆర్ పద్ధతిని మార్చుకోవాలన్నారు. అధికారం ఎప్పుడు తెరాసదే కాదని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.
అమరావతికి వెళ్లడం లేదు: తమ్మినేని
తాము ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు వెళ్లడం లేదని సిపిఎం తెలంగాణ చీఫ్ తమ్మినేని వీరభద్రం చెప్పారు. రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కున్నందుకు తాము వెళ్లడం లేదన్నారు. తమకు ఆహ్వానం వచ్చినప్పటికీ వెళ్లడం లేదన్నారు.
తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఒకేసారి రుణమాఫీని చేయాలని డిమాండ్ చేశారు. కెసిఆర్ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక ధోరణిని అవలంభిస్తోందని ధ్వజమెత్తారు. రైతుల రుణమాఫీ విషయంలో తెలంగాణ రాష్ట్ర మంత్రులు అబద్దాలు చెబుతున్నారన్నారు.












Click it and Unblock the Notifications