ఏది నిజం?: మందమర్రిలో సంచలనం రేపుతోన్న సాగర్ 'పెళ్లి' వివాదం..
సాగర్ మాత్రం శ్రీవాణి ఇష్ట ప్రకారమే ఆమెను వివాహం చేసుకున్నానని, యువతి కుటుంబ సభ్యుల బెదిరింపులే ఆమెను తనకు దూరం చేశాయని ఆరోపిస్తున్నట్లు గా తెలుస్తోంది.
మందమర్రి: మంచిర్యాల జిల్లా మందమర్రిలో శ్రీవాణి అనే యువతి ఆత్మహత్యాయత్నం తీవ్ర వివాదాస్పదమవుతోంది. కొన్నాళ్ల క్రితం సాగర్ అనే దళిత యువకుడితో శ్రీవాణికి ప్రేమ వివాహం జరిగినట్లు తెలుస్తుండగా.. అది బలవంతపు వివాహమని యువతి సహా ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఈ క్రమంలోనే సాగర్ పై పోలీస్ కేసు కూడా ఫైల్ చేయించారు. అయితే సాగర్ మాత్రం శ్రీవాణి ఇష్ట ప్రకారమే ఆమెను వివాహం చేసుకున్నానని, యువతి కుటుంబ సభ్యుల బెదిరింపులే ఆమెను తనకు దూరం చేశాయని ఆరోపిస్తున్నట్లు గా తెలుస్తోంది.
ప్రేమ పెళ్లా?.. బలవంతపు పెళ్లా?
సాగర్-శ్రీవాణిలది ప్రేమ పెళ్లా?.. బలవంతపు పెళ్లా? అన్న వివాదం కొనసాగుతుండగానే.. యువతి ఆత్మహత్యకు యత్నించడం.. ఈ వ్యవహారాన్ని మరో మలుపు తిప్పింది. సాగర్ తరుపువారు సోషల్ మీడియాలో వీరి పెళ్లి ఫోటోలను అప్లోడ్ చేయడంతో తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్యకు యత్నిస్తున్నట్లుగా యువతి సూసైడ్ లేఖలో పేర్కొంది.
మరోవైపు సాగర్ తరుపు వారి వాదన మాత్రం మరోలా ఉంది. శ్రీవాణిని బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని ఆరోపిస్తున్నందువల్లా.. ఆ ఆరోపణలు తప్పు అని చెప్పడానికే ఫోటోలను బహిర్గతం చేయాల్సి వచ్చిందని వారు చెబుతున్నారు.
కాగా, మందమర్రిలో నివసించే క్యాతం శ్రీవాణి, సారంగపల్లికి చెందిన ఆయిల్ల సాగర్ ఏప్రిల్ 22న కాళేశ్వరంలో వివాహం చేసుకున్నట్లు సమాచారం. వివాహానంతరం వీరు కాళేశ్వరం నుంచి తిరిగి వస్తున్న క్రమంలో.. శ్రీవాణి సోదరుడు, స్నేహితులతో కలిసి సాగర్ పై దాడి చేసి యువతిని తీసుకెళ్లిపోయినట్లు ఆరోపణలున్నాయి.
ఆ దాడి తర్వాత.. సాగర్ తనను బెదిరింపులకు గురిచేసి, బలవంతపు పెళ్లి చేసుకున్నాడని శ్రీవాణి సహా ఆమె సోదరుడు బెల్లంపల్లి ఏసీపీకి ఫిర్యాదు చేశారు. దీంతో సాగర్ దళిత యువకుడు కావడం వల్లే అతని పట్ల ఇలా వ్యవహారిస్తున్నారని భావించిన రాము బీరెల్లి, పానుగంటి సతీష్ అనే దళిత సామాజిక కార్యకర్తలు సాగర్-శ్రీవాణిల పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టారు. బలవంతపు పెళ్లి కాదనే దానికి ఈ ఫోటోలే నిదర్శనమని చెప్పడానికి తాము ఇలా చేసినట్లు చెబుతున్నారు.
Recommended Video
ఫోటోలు బహిర్గతం చేసినందుకు:
ఈ నేపథ్యంలోనే.. సోషల్ మీడియాలో తన ఫోటోలనుబహిర్గతం చేసినందుకు తీవ్ర మనస్తాపం చెందానని పేర్కొంటూ శ్రీవాణి ఆత్మహత్యకు యత్నించింది. తన వీడియోలు, ఫోటొలు ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేసి కుటుంబ పరువు తీస్తున్నందువల్లే ఆత్మహత్యకు యత్నిస్తున్నట్లు అందులో పేర్కొంది. ఏసీపీ సైతం తమ ఫిర్యాదును పట్టించుకోకుండా అసభ్యంగా వ్యవహరిస్తూ తమను ఇబ్బందులకు గురిచేశాడని అందులో రాసింది. తన చావుకు కారణం సాగర్, రాము బీరెల్లి, పానుగంటి సతీష్, ఏసీపీ సతీష్, అంటూ చెప్పుకొచ్చింది.
ఇదిలా ఉంటే, శ్రీవాణి ఆత్మహత్యాయత్నం తర్వాత ఆమెను మంచిర్యాల ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఆమె తరుపు బంధువులంతా ఆసుపత్రి ముందు ఆందోళన చేసి.. బాధితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్పందించిన డీసీపీ జాన్ వెస్లీ కేసును పూర్తిగా విచారించి న్యాయం చేస్తామన్నారు.
ఎమ్మెల్యే ఓదెలుపై ఆరోపణలు:
శ్రీవాణి బీసీ కావడం.. సాగర్ దళిత సామాజికవర్గానికి చెందినవాడు కావడం వల్లే వీరి ప్రేమ వ్యవహారం ఇంత వివాదాస్పదమైందన్న ఆరోపణలున్నాయి. అటు ఎమ్మెల్యే ఓదెలు సైతం సాగర్ ను ఫోన్ ద్వారా బెదిరింపులకు గురిచేసినట్లుగా చెబుతున్నారు. ఎమ్మెల్యే మాత్రం తానెవరినీ బెదిరించలేదని, పైగా సాగర్ కే తాను మద్దతుగా నిలబడ్డానని చెప్పారు. సోషల్ మీడియాలో ఫోటోలు మాత్రం తీసేయాల్సిందిగా చెప్పానని పేర్కొన్నారు.
దళిత సంఘాల వాదన:
కులం అనే చట్రంలో సాగర్ ను బలిపశువును చేశారని దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇష్టపడి పెళ్లి చేసుకున్నవారిని విడగొట్టి విషయాన్ని ఇంత పెద్ద వివాదంగా మార్చారని వారు ఆరోపిస్తున్నారు. బెదిరింపులకు భయపడి సాగర్ ప్రస్తుతం దిక్కులేని పక్షిలా ఎక్కడెక్కడో తిరుగుతున్నాడని చెబుతున్నారు. అతనికి అండగా నిలబడేందుకు వచ్చే ఆదివారం నాడు సందరయ్య విజ్ఞాన భవన్ లో ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.