ఆ బిల్లులపై కేంద్రాన్ని ఒప్పించండి: ద్రౌపది ముర్ము ముందు మంత్రి కేటీఆర్ డిమాండ్లు
రాష్ట్రపతి ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన టిఆర్ఎస్ పార్టీ రాష్ట్రపతి అభ్యర్థిగా విపక్షాల నుంచి బరిలోకి దిగిన యశ్వంత్ సిన్హా కు మద్దతు పలికిన విషయం తెలిసిందే. ఇక రాష్ట్రపతి ఎన్నికలలో ఎన్డీఏ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన ద్రౌపది ముర్ము ఘన విజయం సాధించడంతో టీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలినట్టైంది. అయితే రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షలు చెబుతూనే మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో ఆమె ముందు అనేక డిమాండ్లు ఉంచారు.
ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షలు చెప్పిన మంత్రి కేటీఆర్
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పర్యటించిన మంత్రి కేటీఆర్ రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షలు తెలియజేశారు. గిరిజన బిడ్డగా చొరవచూపి గిరిజనుల రిజర్వేషన్ల కోసం కేంద్రాన్ని ఒప్పించాలని, అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ చేయించాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు విజ్ఞప్తి చేశారు. ఇక జాతి నిర్మాణంలో తెలంగాణ భాగస్వామ్యం ఎంతో ఉందని చెప్పిన మంత్రి కేటీఆర్, దానికి తాము గర్వపడుతున్నాము అంటూ పేర్కొన్నారు.
పోడు భూముల విషయంలో కేంద్రం కటాఫ్ డేట్ మార్చే విధంగా చొరవ చూపాలి
తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని, తెలంగాణ పల్లెల్లో ఎక్కడా కరెంటు కష్టాలు లేవని పేర్కొన్న మంత్రి కేటీఆర్ ద్రౌపది ముర్ము రాష్ట్రపతి పదవి స్వీకరించిన రోజే ఆమె సొంత ఊరుకు కరెంటు వచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అటువంటి పరిస్థితి లేదని చెప్పారు. ఇక ఇదే సమయంలో పోడు భూముల విషయంలో కేంద్రం కటాఫ్ డేట్ మార్చే విధంగా రాష్ట్రపతి చొరవ చూపాలని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. మారిన జనాభా శాతం ప్రకారం గిరిజనుల రిజర్వేషన్ శాతం పెంచుకునే విధంగా అవకాశం కల్పించడానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కృషిచేయాలని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
గిరిజన రిజర్వేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్రాన్ని ఒప్పించండి
గిరిజన రిజర్వేషన్ బిల్లు కేంద్రం వద్ద పెండింగ్లో ఉందని, రాష్ట్రం పంపిన తీర్మానాన్ని అమలు చేసేలా చూడాలని, మహిళా రిజర్వేషన్ బిల్లుపైనా కేంద్రాన్ని ఒప్పించాలని ద్రౌపదీ ముర్మును కోరారు కేటీఆర్. ఎనిమిదేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన దానికంటే కేంద్రానికి తెలంగాణ రాష్ట్రం ఎన్నో రెట్లు ఎక్కువ ఇచ్చిందని కేటీఆర్ పేర్కొన్నారు. ఇక బీజేపీ నేతలు ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం మంచిది కాదని, ఇకనైనా పద్ధతి మార్చుకోకపోతే చూస్తూ ఊరుకోబోమని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు.
టీఆర్ఎస్ పై ఉన్న కోపాన్ని ప్రజలపై చూపొద్దు
టిఆర్ఎస్ పార్టీ పై ఉన్న కోపాన్ని తెలంగాణ ప్రజలపై చూపవద్దని కేంద్రానికి మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఆదర్శ గ్రామాలు ఉన్నాయని కేంద్రమే చెప్పిందని పేర్కొన్న కేటీఆర్ తెలంగాణకు తాము ఎంతో ఇస్తున్నామని మాట్లాడుతున్నారని, కానీ ఇచ్చింది ఏమీ లేదన్నారు. ఎనిమిదేళ్లలో తెలంగాణాకు కేంద్రం ఇచ్చిన దానికంటే, రాష్ట్రం కేంద్రానికి ఇచ్చినదే ఎక్కువ అంటూ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు