ఖతం చేస్తా... తలసాని తనయుడి బెదిరింపు కేసులో ట్విస్ట్: అభినవ్పై మామ ఫిర్యాదు
హైదరాబాద్: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి కిరణ్ తనపై దౌర్జన్యానికి దిగడమే కాక, అనుచరులతో కలిసి చావబాదాడని, భార్యను వదిలేయకపోతే చంపేస్తానని బెదిరించాడంటూ సికింద్రాబాద్కు చెందిన అభినవ్ మహేందర్ అనే యువకుడు శనివారం విలేకరుల సమావేశంలో ఆరోపించారు.
ఈ కేసులో కొత్త ట్విస్ట్. ఇంటికొచ్చి కొట్టాడని అభినవ్ తనను కొట్టాడాని అతని మామ ఫిర్యాదు చేశారు. అభినవ్ తన కారు డ్రైవర్తో కలిసి ఇంటికి వచ్చి తనను కొట్టాడంటూ ఆయన మామ, మారేడ్పల్లిలో ఉండే వ్యాపారవేత్త మహేంద్రనాథ్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో సికింద్రాబాద్ తుకారాంగేట్ పోలీస్ స్టేషన్లో శనివారం రాత్రి కేసు నమోదైంది.
కుటుంబ తగాదాల నేపథ్యంలో అక్టోబర్ 26న ఉదయం అభినవ్ తన కారు డ్రైవర్తో కలసి, తన ఇంటికి వచ్చి తలపై గాయపరిచాడని మహేంద్రనాథ్ రెడ్డి 31 శనివారం రాత్రి తమకు ఫిర్యాదు చేసినట్లు సీఐ లక్ష్మీనారాయణ చెప్పారు. కాగా, తలసాని తనయుడి పైన కూడా కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది.

తలసాని బెదిరించాడని అంతకుముందు అభివన్ ఆరోపణ
తలసాని తనయుడు సాయి కిరణ్ తన పైన దౌర్జన్యానికి దిగాడని, వారి దాడిలో తన పళ్లు రెండు ఊడాయని, మెదడులో రక్తస్రావం జరిగిందని, దీనిపై ఫిర్యాదు చేయగా పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేయలేదని అభినవ్ అంతకుముందు ఆవేదన వ్యక్తం చేశాడు.
చెన్నైలో ఉంటున్న తాను కొన్నేళ్ల క్రితం ఇక్కడికి వచ్చానని, ఏడాది క్రితం జాతీయ టెన్నిస్ క్రీడాకారిణి భువన రెడ్డితో పరిచయం ఏర్పడిందని వివరించారు. తమ పెళ్లికి భువన తండ్రి, కడప జిల్లాకు చెందిన మహేంద్రనాథ్ రెడ్డి అంగీకరించకపోతే అయిదు నెలల క్రితం ఆర్యసమాజ్లో ఒక్కటయ్యామన్నాడు.
తన భార్య టెన్నిస్ తారగా ఎదగాలన్న లక్ష్యంతో ఆమె తండ్రి కృషి చేసినా, పెళ్లి తర్వాత టెన్నిస్పై భువనకు ఆసక్తి తగ్గిపోయిందన్నారు. దీనిపైనే తనకు, మహేంద్రనాథ్కు విభేదాలు వచ్చాయన్నాడు. ఆరు రోజుల క్రితం భువన సోదరి నిశ్చితార్థం అంటే ఇంటికి పంపించానని, మాట్లాడేందుకు వెళితే తన మామ బెదిరించాడన్నాడు.
ఈలోపు మంత్రి తలసాని అనుచరులు వచ్చి అన్న పిలుస్తున్నాడని చెప్పడంతో, మారేడ్పల్లిలోని ఆయన నివాసానికి వెళ్లానని, అక్కడ సాయి కిరణ్ తనను బెదిరించి పంపించాడన్నాడు. అక్టోబరు 26న మళ్లీ తాను భువన ఇంటికి వెళ్లగా, మరోమారు తలసాని అనుచరులు వచ్చి ఇంటికి తీసుకెళ్లారన్నాడు.
సుమారు గంటన్నర సేపు చావబాదారన్నారు. భువనను వదిలెయ్.. లేకపోతే చంపేస్తా.. నువ్వు చనిపోయినట్టు దుబాయ్లో ఉంటున్న మీ అమ్మానాన్నలకు కూడా తెలీకుండా చేస్తా.. అంటూ సాయి కిరణ్ హెచ్చరించాడన్నాడు.
భయంతో తాను సరేనంటూ ఇంటికి వచ్చానని, స్నేహితులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పాడు. గాంధీ ఆసుపత్రిలో వైద్యులు కూడా తనకు తీవ్రగాయాలైనట్లు నిర్ధరించారని, పోలీసులు స్పందించి తనకు న్యాయం చేయాలంటూ వేడుకున్నాడు.












Click it and Unblock the Notifications