వారిద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు: రోడ్డుపై పడి ఉన్నారు
సంగారెడ్డి: మెదక్ జిల్లాలో సంభవించిన దంపతుల మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో ఆబ్కారీ కానిస్టేబుల్గా పనిచేస్తున్న కోటిపల్లి మంజుల(24) అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఈ సంఘటనపై తీవ్రమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
శుక్రవారం తెల్లవారుజామున పెద్దేముల్ మండలం గాజీపూర్ గ్రామశివారులో భర్త మహేష్, మంజుల ద్విచక్ర వాహనం పక్కన పడిపోయి ఉన్నారు. గ్రామస్థులు గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కోటిపల్లి మంజుల, గొల్ల మహేష్లది మెదక్ జిల్లా కేంద్రం సంగారెడ్డి. ఇద్దరూ పటాన్చెరు ఆబ్కారీ పోలీసు స్టేషన్ పరిధిలో కానిస్టేబుళ్లుగా పని చేస్తున్నారు.
వారిద్దరిదీ ఒకే ఊరు. ఇరువురి కుటుంబాలు కూడా పెళ్లికి అంగీకరించలేదు. అయినా వినకుండా అక్టోబరులో యాదాద్రిలో పెళ్లి చేసుకున్నారు. సంగారెడ్డిలోనే నివాసం ఉంటూ రోజు పటాన్చెరుకు వచ్చి విధులు నిర్వహించే వారు. మంజుల ప్రస్తుతం గర్భవతి. అయితే శుక్రవారం తెల్లవారుజామున తాండూరు పట్టణ సమీపంలోని భూకైలాస్ ఆలయాన్ని చూడటానికి ఇద్దరు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు.
పెద్దేముల్ మండలం గాజీపూర్ సమీపంలో రోడ్డు పక్కన భార్యాభర్తలు పడి ఉన్నారు. గ్రామస్థులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఎస్ఐ వెంకటశ్రీను సంఘటన స్థలానికి చేరుకుని స్పృహ తప్పి పడి ఉన్న మహేష్ను 108లో తాండూరు జిల్లా అస్పత్రికి తరలించారు. పక్కనే పడి ఉన్న మంజుల అప్పటికే చనిపోయినట్లు గుర్తించారు.
ప్రమాదం జరిగిందని తొలుత భావించారు. కానీ పరిశీలిస్తే అది ప్రమాదంలా అనిపించలేదు. కింద పడిపోయిన మంజుల, మహేష్లకు శరీరంపై ఎలాంటి గాయాలు లేవు. వారు ఉపయోగించిన ద్విచక్ర వాహనం దెబ్బతిన్నట్లు లేదు. వాహనాన్ని పక్కకు పెట్టినట్లు, మంజులను పడుకోపెట్టినట్లు పరిస్థితి కనిపించింది.
ఏదైనా వాహనం ఢీకొడితే అందుకు సంబంధించిన ఆనవాళ్లు ఉండాలి. కానీ అటువంటివేమీ లేవు. సంఘటనపై అన్నీ అనుమానాలే కలుగుతున్నాయి. హత్యా, ప్రమాదమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకున్న మహేష్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
కాగా, తమ బిడ్డ మంజులను హత్య చేసి ప్రమాదం జరిగినట్లు కథ అల్లుతున్నారని తల్లిదండ్రులు నర్సింహులు, శ్యామల ఆరోపించారు. కులాలు వేరు కావడంతో ఆరు నెలలుగా అత్తింటి వారు వేధిస్తున్నారని తెలిపారు. పథకం ప్రకారం హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరిస్తున్నరని ఆరోపించారు.
మూడు నెలల గర్భవతి అని తెలియగానే భర్తతోపాటు మరిది కిరణ్, అత్తామామలు కలిసి తమ బిడ్డను హత్య చేశారని వివరించారు. మృతురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని గ్రామీణ సీఐ సైదిరెడ్డి తెలిపారు.