తెలంగాణలో కరోనా: కొత్తగా 2,384 కేసులు, 17 మంది మృతి -ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఉధృతి
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి స్థిరంగా కొనసాగుతోంది. రికవరీలు పెరుగుతుండటంతో యాక్టివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే, మరణాల సంఖ్య తగ్గకపోవడం కలవరపెడుతోంది. హైదరాబాద్ తోపాటు ఇతర జిల్లాల్లోనూ కొత్త కేసులు భారీగా వస్తున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియ నిదానంగా సాగుతోంది. వివరాలివి..
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం సాయంత్రం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,08,696 శాంపిళ్లను పరీక్షించగా, కొత్తగా 2,384 మంది పాజిటివ్ గా నిర్ధారణ అయ్యారు. దీంతో మొత్తం కేసులు 5,83,228కి పెరిగాయి. కొత్తగా వెలుగు చూసిన వాటిలో జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 307 కేసులురాగా, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఉధృతి కనిపించింది. నల్గొండలో 170, ఖమ్మంలో 167 కొత్త కేసులు వచ్చాయి.
కొత్త కేసుల సంఖ్య తగ్గుతూ వస్తున్నా, కొవిడ్ మృతుల సంఖ్య నిలకడగా ఉంటోంది. నిన్న ఒక్కరోజే కొవిడ్ వల్ల 17 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి దాకా సంభవించిన కొవిడ్ మరణాల సంఖ్య 3,313కు పెరిగింది. దేశంలో కొవిడ్ మరణాల రేటు 1.2శాతంకాగా, తెలంగాణలో అది 0.56శాతంగా ఉన్నట్లు బులిటెన్ లో తెలిపారు.
రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 2,242 మంది కొవిడ్ వ్యాధి నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 5,46,536కు పెరిగింది. జాతీయ స్థాయిలో రికవరీ రేటు 92.4 శాతం ఉండగా, తెలంగాణలో అది 93.7శాతం ఉన్నట్లు బులిటెన్ లో పేర్కొన్నారు. రికవరీలు భారీగా ఉండటంతో యాక్టివ్ కేసులు 33,379కి పడిపోయాయి. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిదానంగా సాగుతోంది. వ్యాక్సిన్ కోసం తెలంగాణ సర్కారు గ్లోబల్ టెండర్ యత్నాలు కొనసాగుతున్నాయి.