ఎందుకు చర్చించుకోరు?: కేసీఆర్, బాబులకు నారాయణ సూటి ప్రశ్న
హైదరాబాద్: హైకోర్టు విభజన వివాదంపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తీరుని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తప్పుబట్టారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చండీయాగం, రాజధాని నిర్మాణాలకు ఒకరినొకరు పిలుచుకొని, మాట్లాడుకునే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జలవివాదం, హైకోర్టు విభజన వివాదపై ఎందుకు చర్చించుకోరని ప్రశ్నించారు.
హైకోర్టు విభజన అనేది చాలా సున్నితమైన అంశమని, ముఖ్యమంత్రుల స్థాయిలో పరిష్కరించడానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ చొరవ చూపాలని ఆయన సూచించారు. హైకోర్టు విభజన విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ను వెనకేసుకొచ్చిన నారాయణ, కేసీఆర్ తీరును సమర్ధించారు.
రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ప్రత్యేక హైకోర్టుని కోరుకోవడంలో తప్పులేదని అయితే అందుకు ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకోవాల్సిందిగా సూచించారు. ఏపీ ప్రభుత్వమే హైకోర్టు సమస్యను కావాలని జటిలం చేస్తోందని ఆరోపించారు. తెలంగాణలో చట్టప్రకారం న్యాయమూర్తుల కేటాయింపులు జరగాలని ఆయన డిమాండ్ చేశారు.
హైకోర్టు విభజనపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ఏపీ సీఎం చంద్రబాబు రాజకీయ దృక్పథం సరిగా లేదని, అందుకే హైకోర్టు విభజన ఆలస్యమవుతోందని నారాయణ వ్యాఖ్యానించారు. రెండు తెలుగు రాష్ట్రాలు చర్చించుకుని హైకోర్టు విభజన సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.
రక్షణ, ఫార్మా రంగాల్లోకి కేంద్రం వంద శాతం ఎఫ్డీఐలను ఆమోదించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఎఫ్డీఐల ద్వారా దేశంలోకి ఉగ్రవాద డబ్బులు పెట్టుబడులుగా వస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విదేశీ పెట్టుబడులు ఆహ్వానించి దేశాన్ని తాకట్టు పెడుతోందన్నారు. అమెరికాతో దేశానికి ఎప్పటికైనా ముప్పేనని, బీజేపీ మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తోందన్నారు.